యాప్నగరం

గుంటూరులో వైసీపీ ''వంచనపై గర్జన దీక్ష''

విభజన హామీలపై పోరుబాట పట్టింది వైఎస్సార్‌సీపీ. గుంటూరులోని వీఏఆర్‌ గార్డెన్స్‌లో వంచనపై గర్జన దీక్ష పేరుతో భారీ ఆందోళనా కార్యక్రమం నిర్వహించింది. ఈ దీక్షలో పార్టీ సీనియర్ నేతలతో పాటూ పార్టీ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.

Samayam Telugu 9 Aug 2018, 1:48 pm
విభజన హామీలపై పోరుబాట పట్టింది వైఎస్సార్‌సీపీ. గుంటూరులోని వీఏఆర్‌ గార్డెన్స్‌లో వంచనపై గర్జన దీక్ష పేరుతో భారీ ఆందోళనా కార్యక్రమం నిర్వహించింది. ఈ దీక్షలో పార్టీ సీనియర్ నేతలతో పాటూ పార్టీ కార్యకర్తలు భారీగా పాల్గొనగా.. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు దీక్షను నిర్వహిస్తున్నారు. దీక్ష వేదికగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విరుచుకుపడ్డారు వైసీపీ నేతలు. విభజన హామీలను అమలు చేయకుండా కేంద్రం మోసం చేస్తే.. స్పెషల్ ప్యాకేజీ పేరుతో ఏపీ ప్రజల్ని చంద్రబాబు మోసం చేశారంటూ విమర్శనాస్త్రాలు సంధించారు.
Samayam Telugu YCP


ప్రత్యేక హోదా కోసం చిత్తశుద్ధితో పోరాడుతున్న ఏకైక పార్టీ వైసీపీ అన్నారు ఆ పార్టీ నేతలు. నాలుగేళ్లగా పార్టీ అధినేత జగన్ ఆధ్వర్యంలో యువభేరిలు, నిరసనలు, ఆందోళనలు, ధర్నాలు, రిలే దీక్షలు, వంటా వార్పులు ఇలా అనేక రకాల ఉద్యమాలతో పోరాటం కొనసాగించామన్నారు. చివరి అస్త్రంగా వైసీపీ ఎంపీలు రాజీనామా కూడా చేశారని.. దీన్నిబట్టే హోదా కోసం పోరాడుతుంది ఎవరో అర్థమవుతుందన్నారు. టీడీపీ ఎంపీలు కూడా రాజీనామాల చేసి.. పోరాటం చేసి ఉంటే.. కేంద్రానికి కనువిప్పు కలిగేదన్నారు.

ప్రత్యేక హోదా, విభజన హామీల విషయంలో చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని మండిపడ్డారు నేతలు. నాలుగేళ్లు ఎన్డీఏలో కొనసాగి.. ముందు స్పెషల్ ప్యాకేజీకి ఒప్పుకొని... ఇప్పుడు హోదా పేరుతో ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. టీడీపీ ధర్మపోరాటం పేరుతో ప్రజలను మళ్లీ మోసం చేస్తున్నారని.. చంద్రబాబుకు ప్రజల్ని ఓటు అడిగే హక్కు కూడా లేదన్నారు. బాబు మోసాలపై ప్రజలను చైతన్యం చేసేందుకే వంచనపై గర్జన దీక్ష చేపట్టామన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు మాత్రమే కాకుండా.. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలోనూ టీడీపీ ప్రభుత్వం విఫలమయ్యిందన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.