యాప్నగరం

త్రిపురలో మొదలైన పోలింగ్.. త్రిముఖ పోరులో బీజేపీ గట్టెక్కానా?

త్రిపుర అసెంబ్లీ ఎన్నికల సమరం రసవత్తరంగా మారింది. మొత్తం 60 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఆ రాష్ట్రంలో గురువారం పోలింగ్ జరుగుతోంది. 30 ఏళ్ల వామపక్ష కూటమి పాలనకు ముగింపు పలుకుతూ 2018లో అధికారంలోకి వచ్చిన బీజేపీ.. మళ్లీ అధికార పీఠాన్ని నిలబెట్టుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. దశాబ్దాల వైరాన్ని పక్కనపెట్టి ప్రతిపక్ష సీపీఎం ఈసారి కాంగ్రెస్‌తో జట్టుకట్టింది. మరో కొత్త పార్టీ బీజేపీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తుండటం గమనార్హం.

Authored byఅప్పారావు జివిఎన్ | Samayam Telugu 16 Feb 2023, 8:43 am

ప్రధానాంశాలు:

  • త్రిపురలో 60 అసెంబ్లీ సీట్లుకు ఒకే విడత పోలింగ్
  • రెండోసారి అధికారం కోసం బీజేపీ విశ్వ ప్రయత్నాలు
  • అనూహ్యంగా కాంగ్రెస్‌తో జట్టుకట్టిన వామపక్షాలు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Tripura Elections
త్రిపుర శాససనభ ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం 7 గంటలకు మొదలయ్యింది. మొత్తం 60 స్థానాలున్న త్రిపురలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఈసీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. సాయంత్రం నాలుగు గంటలకే పోలింగ్ ముగియనుంది. కాగా, ఈ ఎన్నికల్లో త్రిముఖ పోరు నెలకుంది. బీజేపీ- ఇండిజినస్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ త్రిపుర (ఐపీఎఫ్‌టీ), సీపీఎం - కాంగ్రెస్‌ కూటములతోపాటు ప్రాంతీయ పార్టీ అయిన తిప్రా మోథా ప్రధాన పోటీదారులుగా బరిలో ఉన్నాయి. మొత్తం 259 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. ఇందులో మహిళలు 20 మంది. 28.13 లక్షల ఓటర్లు వీరి భవితవ్యం తేల్చనున్నారు. నాగాలాండ్, మేఘాలయలో ఫిబ్రవరి 27న పోలింగ్ ముగిసిన తర్వాత.. మార్చి 2న ఈ మూడు రాష్ట్రాల్లో ఫలితాలను వెల్లడిస్తారు.
త్రిపురలో వరుసగా 30 ఏళ్ల పాటు కొనసాగిన కమ్యూనిస్ట్‌ల జైత్రయాత్రకు 2018లో బీజేపీ బ్రేకులు వేసింది. 36 సీట్లలో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ఈసారి అధికారం నిలబెట్టుకోవాలనే కృతనిశ్చయంతో ఉన్న కమలనాథులు.. అందుకు అనుగుణంగా వ్యూహరచన చేశారు. వ్యూహంలో భాగంగానే ఐపీఎఫ్‌టీతో జతకట్టి బరిలో నిలిచింది.

మరోవైపు, త్రిపురలో పూర్వవైభవం సాధించాలని భావిస్తోన్న సీపీఎం.. దశాబ్దాల వైరాన్ని పక్కనబెట్టి కాంగ్రెస్‌‌తో చేతులు కలిపింది. 47 చోట్ల పోటీచేస్తోన్న సీపీఎం.. మిత్రపక్షం కాంగ్రెస్‌కు 13 స్థానాలను కేటాయించింది. గత ఎన్నికల్లో 16 సీట్లకు పరిమితమైన సీపీఎం.. ప్రస్తుతం అధికారంపై భారీ ఆశలు పెట్టుకుంది. ఒకప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌తో పొత్తు తమకు లాభిస్తుందని ఆ పార్టీ అంచనా వేస్తోంది.

గ్రేటర్ తిప్రా ప్రధాన డిమాండ్‌తో మాజీ రాయల్ ప్రద్యోత్ కిషోర్ దెబ్బర్మ ఏర్పాటు చేసిన కొత్త పార్టీ తిప్రా మోత.. బీజేపీ విజయవకాశాలను క్లిష్టతరం చేసే సూచనలు ఉన్నాయి. బీజేపీ మిత్రపక్షం ఐపీఎఫ్‌టీ‌కు గత ఐదేళ్లలో పట్టు సడలింది. 2021లో ట్రైబల్ ఏరియా అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ ఎన్నికలలో తుడిచిపెట్టుకుపోయింది. తాజా ఎన్నికల్లో కేవలం ఐదు స్థానాల్లో పోటీకి మాత్రమే పరిమితమయ్యింది.

Read Latest National News And Telugu News
రచయిత గురించి
అప్పారావు జివిఎన్
జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో విద్య, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.