యాప్నగరం

ఉత్కంఠ వూపేసిన మ్యాచ్‌లో బెంగళూరు గెలుపు

18 బంతుల్లో 32 పరుగులు చేయాల్సి రావడంతో దాదాపు బెంగళూరు చేతి నుంచి మ్యాచ్ చేజారిపోయిందని అంతా

TNN 9 Apr 2017, 12:14 am
ఐపీఎల్‌ పదో సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బోణి కొట్టింది. చిన్నస్వామి స్టేడియంలో దిల్లీ డేర్‌డెవిల్స్‌తో శనివారం రాత్రి జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో బెంగళూరు 15 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు కేదార్ జాదవ్ (69: 37 బంతుల్లో 5x4, 5x6) చెలరేగడంతో 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన దిల్లీ జట్టులో సీనియర్ క్రికెటర్లు నిరాశపరిచినా.. యువ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ చివరి వరకూ పోరాడాడు. అయితే దిల్లీ విజయానికి చివరి ఓవర్లో 19 పరుగులు అవసరంకాగా.. ఆ ఓవర్ వేసిన స్పిన్నర్ పవన్ నేగి తొలి బంతికే రిషబ్ పంత్ (57: 36 బంతుల్లో 3x4, 4x6)ని క్లీన్‌బౌల్డ్ చేసి మ్యాచ్‌ను బెంగళూరు వైపు తిప్పాడు. రెండో బంతికి ఎలాంటి పరుగు రాబట్టలేకపోయిన నదీమ్ మూడో బంతిని బౌండరీకి తరలించే ప్రయత్నంలో పవన్‌ నేగీకే క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అనంతరం చివరి మూడు బంతుల్లో దిల్లీ కేవలం మూడు పరుగులే రాబట్టడంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. చివరి మూడు ఓవర్లలో 32 పరుగులే చేయాల్సి రావడంతో మ్యాచ్ దాదాపు బెంగళూరు చేతి నుంచి చేజారిపోయిందని అంతా అనుకున్నారు. కానీ పట్టు వదలకుండా పోరాడిన బెంగళూరు బౌలర్లు చివరికి విజయం సాధించారు. దిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 142 పరుగులే చేయగలిగింది.
Samayam Telugu rcb vs dd 5th match ipl live score
ఉత్కంఠ వూపేసిన మ్యాచ్‌లో బెంగళూరు గెలుపు


తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టులో కేదార్ జాదవ్ (69: 37 బంతుల్లో 5x4, 5x6) మినహా ఆ జట్టులోని బ్యాట్స్‌మెన్లంతా విఫలమయ్యారు. ఓపెనర్ క్రిస్‌గేల్ (6) మరోసారి వైఫల్యాల బాట కొనసాగిస్తూ తక్కువ స్కోరుకే క్రిస్ మోరీస్ బౌలింగ్‌‌లో ఔటయ్యాడు. కెప్టెన్ వాట్సన్ (24) ఒక ఎండ్‌లో కాసేపు పోరాడినా.. గేల్ అనంతరం వచ్చిన మన్‌దీప్ సింగ్ (12), స్టువర్ బిన్నీ (16), విష్ణు వినోద్ (9) నిరాశపరచడంతో బెంగళూరు ఒత్తిడిలో పడింది. ఒకానొక దశలో 55/3తో పీకల్లోతు కష్టాల్లో కనిపించిన బెంగళూరును కేదార్ జాదవ్ ఆదుకున్నాడు. క్రీజులో కుదురుకునే వరకూ నెమ్మదిగా ఆడిన జాదవ్ అనంతరం వరుస బౌండరీలతో రెచ్చిపోయిన. ఈ క్రమంలోనే అతను కేవలం 26 బంతుల్లోనే అర్ధశతకాన్ని పూర్తి చేసుకోవడం విశేషం. అయితే స్కోరు వేగం పెంచే క్రమంలో జాదవ్ ఔటవడంతో బెంగళూరు మళ్లీ తడబడింది. పవన్ నేగి (10), మిల్స్ (0) చివరి ఓవర్‌లో వరుసగా ఔటవడంతో ఆ జట్టు 157 పరుగులకే పరిమితమైంది. దిల్లీ బౌలర్లలో క్రిస్ మోరీస్ మూడు వికెట్లు తీయగా.. జహీర్ ఖాన్ రెండు, కమిన్స్, నదీమ్ తలో వికెట్ తీశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.