యాప్నగరం

Bhishma Ekadasi: భీష్మ ఏకాదశి.. విష్ణుసహస్ర నామాలు జనించిన రోజు

తాను వివాహం చేసుకుంటే సంతానం కలిగితే ఆ త్యాగం ఎక్కడ వృథా అవుతుందోనన్న సంశయంతో ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉంటానని భీషణ ప్రతిజ్ఞ చేసిన మహోన్నతుడు

Samayam Telugu 16 Feb 2019, 7:48 am
పంచమవేదమైన మహాభారతాన్ని వేదవ్యాసుడు రాసినా, భీష్ముడు అనే పాత్ర లేకపోతే భారతమే లేదు! తండ్రి సౌఖ్యం కోసం సింహాసనాన్నే త్యాగం చేసిన ధీరుడు భీష్ముడు. తాను వివాహం చేసుకుంటే సంతానం కలిగితే ఆ త్యాగం ఎక్కడ వృథా అవుతుందోనన్న సంశయంతో ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉంటానని భీషణ ప్రతిజ్ఞ చేసిన మహోన్నతుడు. తాను కోరుకునే సమయంలోనే మరణించగలిగే వరం కూడా ఆయన సొంతం. అందుకే మార్గశిర మాసంలో అంపశయ్య మీదకి చేరుకున్నా... ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేవరకూ వేచి చూశాడు. ఉత్తరాయణం ప్రవేశించిన తరువాత తనకు మోక్షం కలిగించమని ఆ పరంధాముని అష్టమి రోజున వేడుకున్నాడు. భీష్ముడి జీవితమంతా పరిపక్వంగానే గడిచింది.
Samayam Telugu bhishma-no-watermark


ఇక మరణసమయంలోనూ తన విశిష్టతను చాటుకున్నాడు ఈ కురుకుల వృద్ధుడు. అంపశయ్యపై ఉన్న తనను చూసేందుకు వచ్చిన ధర్మరాజుకు రాజనీతి గురించి బోధించాడు. పాండవులతో అక్కడకు వచ్చిన కృష్ణపరమాత్ముడుని స్తుతిస్తూ విష్ణు సహస్రనామాన్ని పలికాడు. భీష్ముడు ఆనాడు ధర్మరాజుకు లేవనెత్తిన సందేహాలను తీరుస్తుంటే, పక్కనే ఉన్న ద్రౌపది నవ్వుతూ ‘తాతా! నాడు నాకు అవమానం జరుగుతుంటే ఏమైయ్యాయీ ధర్మాలు’ అని ప్రశ్నించింది.

అందుకు భీష్ముడు ‘అవును తల్లీ! ఈ దేహం నా అధీనంలో లేదు, అది ధుర్యోదనుడి సొంతం. నీకు అవమానం జరుగుతుందని తెలిసినా, నా దేహం నా మాట వినలేదు... అంతటి ఘోరమైన పాపం చేశాను కాబట్టే ప్రక్షాళన కోసం ఇన్ని రోజులు అంపశయ్యపై ఉన్నాన’ని చెప్పాడు. కురు వంశాన్ని కాపాడుతానని తన తండ్రికి ఇచ్చిన మాటకు కట్టుబడిన భీష్ముడు, పరిస్థితుల ప్రభావంతో విశేష ధర్మాన్ని త్వజించాడు.

మాఘమాస ఏకాదశి రోజున భీష్ముడు తన దేహాన్ని వదిలి స్వర్గానికి చేరుకున్నాడు. అందుకే దీనిని భీష్మ ఏకాదశిని జయ ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు మొదలుపెట్టిన ఏ కార్యమైనా విజయవంతం అవుతుందని నమ్మకం. ఇక భీష్ముడు భారతీయులందరికీ పూర్వీకుడే! ఆచార్యునిగా, భరతవంశానికి ఆదిపురుషుడిగా మనకు చిరస్మరణీయుడు. అందుకే ఈ ఏకాదశి నాడు ఆయనకు తర్పణాలను విడవాలని పండితులు సూచిస్తారు. భీష్ముని తమ పూర్వజునిగా భావిస్తూ ఎవరైతే ఆయనకు తర్పణం విడుస్తారో వారి పాపాలన్నీ దహించుకుపోతాయట. ఈ రోజున బ్రాహ్మణులకు ఛత్రం, చెప్పులు, జలపాత్ర, వస్త్రాలు దానం చేస్తే శుభం కలుగుతుంది. రథసప్తమి నుంచి సూర్యుని తీక్షణత పెరుగుతూ వస్తుంది కాబట్టి, బహుశా ఈ సూచని చేసి ఉంటారు.

ఈ రోజునే విష్ణు సహస్ర నామం పుట్టిందని పురాణాలు చెప్తున్నాయి. అందుకే దీనిని విష్ణు సహస్ర నామ జయంతి అని పిలుస్తుంటారు. విష్ణు సహస్రనామ విశేషాలను భీష్ముడు పాండవులకు తెలిపి, కురుక్షేత్ర యుద్ధంలో వారి విజయానికి భీష్ముడు కారణమయ్యాడు. భీష్మ ఏకాదశి రోజున నరసింహ కల్యాణం చేయిస్తారు. అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయం, సింహాచలం వరాహ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం, యాదగిరి గుట్ట, భద్రచాలం సీతారాముల వారి ఆలయంలోనూ ప్రత్యేక పూజలు చేస్తారు.

ప్రతి ఏకాదశికి ఉండే నియమాలే ఈ రోజు కూడా వర్తిస్తాయి. దశమి నాటి రాత్రి నుంచి ద్వాదశి ఉదయం వరకూ ఉపవాసం ఉండాలనీ, ఏకాదశి రాత్రివేళ జాగరణ చేయమనీ పెద్దలు సూచిస్తారు. దీంతోపాటుగా విష్ణుపూజకు విశేష ప్రాధాన్యత ఉంది. భీష్ముడు అందించిన విష్ణుసహస్రనామాలను ఈరోజున పటిస్తే, విశేష ఫలితం దక్కుతుంది. కాబట్టే దీనిని శ్రీ విష్ణు సహస్రనామ జయంతి అని కూడా పిలుస్తారు. భగవద్గీతను పఠించడానికి ఇది అనువైన రోజు.

మాఘశుద్ద అష్టమి నుంచి ద్వాదశి వరకూ ఉన్న ఐదు రోజులనూ భీష్మ పంచకం అని పిలుస్తారు. ఈ అయిదు రోజులూ భీష్ముడి వ్యక్తిత్వాన్ని తలచుకుంటారు. ఆ మహాత్ముని జీవితం నుంచి ప్రేరణ పొందేందుకు ఈ ఐదు రోజులనూ కేటాయిస్తారు. తరచూ వినే వ్యక్తిత్వ వికాస తరగతులకు ఏమాత్రం తీసిపోని ఆచారం ఇది. పైగా భీష్మ ఏకాదశినాడు ఉపవాసం ఉండి, విష్ణుసహస్రనామాలను జపిస్తూ, భగవద్గీతను చదువుతూ భీష్ముని తల్చుకుంటే సాగే క్రతువుతో మనిషి వ్యక్తిత్వమే సాత్వికంగా మారిపోతుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.