యాప్నగరం

Vasant Panchami Pooja వసంత పంచమి: ఇలా చేస్తే సరస్వతీ అనుగ్రహం.. విద్యా ప్రాప్తి

హిందూ మతంలోని ముఖ్యమైన దేవతా మూర్తులలో సరస్వతిని చదువుల తల్లిగా ఆరాధిస్తారు. ఈ దేవి త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మ దేవేరి. వేదాలు, పురాణాలలో విపులంగా సరస్వతీ నది కూడా ప్రస్తావించబడింది.

Samayam Telugu 29 Jan 2020, 1:50 pm
మాఘ శుక్ల పంచమిని వసంత పంచమి, శ్రీ పంచమి, మదన పంచమి అనే పేర్లతో పిలుస్తారు. జ్ఞానం మనిషిని మనీషిగా తీర్చిదిద్దుతుంది. జ్ఞానం, విద్య, చదువు పర్యాయపదాలు. విద్యకు అధిదేవత సరస్వతీదేవి వసంత పంచమి రోజే జన్మించిందని భావిస్తారు. అందుకే ఆ రోజున సరస్వతిని ప్రత్యేకంగా పూజిస్తారు. అంతేకాదు, అమృతం కోసం దేవదానవులు పాలకడలిని చిలుకుతుండగా ఈరోజునే శ్రీమహాలక్ష్మి ఆవిర్భవించిందని, అందుకే దీనిని మదన పంచమిగా కూడా పేర్కొంటారు.
Samayam Telugu corona_jpg


యాదేవీ సర్వభూతేషు విద్యారూపేణ సంస్థితా.. సకల విద్యాస్వరూపిణి సరస్వతిగా ఆవిర్భవించిన పరమపావన తిథి. బ్రహ్మవైవర్త పురాణం సహా పలు పురాణాలు ఈ రోజున సరస్వతీదేవిని అర్చించాలని పేర్కొంటున్నాయి.

‘మాఘ శుక్ల పంచమ్యాం విద్యారంభే దినేపి చ పూర్వేహ్ని సమయం కృత్యా తత్రాహ్న సంయుతః రుచిః’వసంత పంచమి రోజున ప్రాతఃకాలంలో సరస్వతీదేవిని పూజించి విద్యారంభం చేయాలని శాస్త్ర వచనం. ఈరోజు మహాగణపతిని షోడశోపచారాలతో పూజించాలి. సరస్వతిదేవి ప్రతిమతోపాటు జ్ఞానానికి ప్రతీకలైన పుస్తకాలు, లేఖినులను పూజాపీఠంపై ఉంచి అష్టోత్తరం చదివి... తెల్లని కుసుమాలు, సుగంధ ద్రవ్యాలు, చందనంతో అర్చించి శుక్లవస్త్రాన్ని సమర్పించాలి.

ఈ రోజున చాలా మంది తమ పిల్లలకు అక్షరాభ్యాసం కూడా జరిపిస్తారు. తద్వారా ఆ తల్లి కరుణాకటాక్షాలు లభించి అపారమైన జ్ఞానం సిద్ధిస్తుందని, నిరాటంకంగా విద్యాభివృద్ధి జరుగుతుందని ప్రజలందరి విశ్వాసం. పూర్వ కాలంలో రాజులు తమ ఆస్థానాలలో దర్బారులు నిర్వహించి, కవితా గోష్టి జరిపి కవులు, పండితులు, కళాకారులను సత్కరించడం ఆనవాయితీగా ఉండేది.

విధాత బ్రహ్మ సైతం పరాశక్తిని శారదామాత రూపంలో దర్శించి, ఆరాధించి ఆమె కృపవల్ల సృష్టి రచనను సృజనాత్మకంగా ఆరంభించాడు. గాయత్రీదేవి ఐదు రూపాలలో సరస్వతీదేవి ఒకటి. గురు శాపం వల్ల విద్యను కోల్పోయిన యాజ్ఞవల్క్యుడు సూర్యుని ఆరాధించగా, అతడికి సరస్వతీ ఉపాసనను సూర్యభగవానుడు ఉపదేశించాడు. సరస్వతీ కృపతో స్మృతి శక్తిని తిరిగి సంపాదించిన యాజ్ఞవల్క్యుడు మహావిద్వాంసుడయ్యాడు. వాల్మీకి సైతం సరస్వతీని ఉపాసించి రామాయణ రచనను చేశాడని పురాణాలు చెబుతున్నాయి.

వ్యాస మహర్షి సరస్వతీదేవి అనుగ్రహంతోనే వేదాలను విభజించాడు. అష్టాదశ పురాణాలను ఆవిష్కరించి, భారత, భాగవత, బ్రహ్మసూత్రాది రచనలు చేసి భారతీయ సనాతన ధర్మవ్యవస్థకు మూలపురుషుడుగా నిలిచాడు. తెలుగులో భాగవతాన్ని రచించిన పోతన మహాశయుడు కూడా సరస్వతీదేవి అనుగ్రహం పొందడమే కాదు, ఆ గ్రంథాన్ని పొట్టకూటికోసం నరులెవ్వరికి అంకితమివ్వనని వాగ్దానం చేశాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.