యాప్నగరం

ఐశ్వర్య సిద్ధి ప్రదాయిని అన్నపూర్ణగా బెజవాడ కనకదుర్గమ్మ

ఆశ్వయుజ మాసంలో నిర్వహించే నవరాత్రి ఉత్సవాల్లో జగన్మాతను వివిధ రూపాల్లో ఆరాధిస్తారు. తొలి మూడు రోజులు పార్వతిగా, తర్వాతి మూడు రోజులు లక్ష్మీగా, చివరి మూడు రోజులు సరస్వతిగా ఆరాధిస్తారు.

Samayam Telugu 15 Oct 2018, 11:35 am
విజయవాడ కనకదుర్గ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నవరాత్రుల్లో భాగంగా ఆరో రోజు సోమవారం కనకదుర్గమ్మ అన్నపూర్ణ దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. సకల జీవరాశికి ఆహారం ప్రసాదించే అన్నపూర్ణ దేవిగా అలంకృతమైన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఓ చేతిలో అక్షయపాత్ర, మరో చేతిలో గరిట పట్టి మానవాళి ఆకలి దప్పులను తీర్చే తల్లి అన్నపూర్ణ దేవి రూపం భక్తుల్లో పారవశ్యాన్ని నింపుతోంది. ప్రాణికోటికి జీవనాధారం అన్నం. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. సాక్షాత్తు పరమేశ్వరుడికే భిక్షపెట్టిన దేవత అన్నపూర్ణాదేవి. ఈ తల్లిని ధ్యానిస్తే ధనధాన్యవృద్ధి, ఐశ్వర్య సిద్ధి కలుగుతాయి. అన్నపూర్ణాదేవి ధరించిన రసపాత్ర అక్షయ శుభాలను అందిస్తుంది.
Samayam Telugu అన్నపూర్ణేశ్వరి


ఆదివారం మూల నక్షత్రం కావడంతో సరస్వతి దేవి అలంకరణలో ఉన్న దుర్గమ్మను సుమారు మూడున్నర లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. సోమవారం మాత్రం భక్తుల రద్దీ కాస్త తగ్గింది. కొండపై క్యూలైన్లలో మాత్రమే భక్తులు కనిపిస్తున్నారు. రద్దీ తగ్గినా పోలీసుల ఆంక్షలు సడలించకపోవంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌, పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌, భవానీపురం వద్దే వాహనాలు నిలిపివేస్తున్నారు. దీంతో ఆలయానికి వెళ్తే భక్తులు సుమారు రెండు కిలోమీటర్లు నడవాల్సి వస్తోంది. రద్దీ లేకపోయినా ఆంక్షలు విధించడంపై భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం నాడు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించిన విషయం తెలిసిందే. దుర్గగుడి పాలకమండలి ఛైర్మన్‌ను ఆలయంలోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.