యాప్నగరం

శబరిమల ఆలయం మూసివేత.. రివ్యూ పిటిషన్‌‌కు సుప్రీం ఓకే!

నెలవారీ పూజకోసం గత బుధవారం తెరచుకున్న ఆలయం, ఐదు రోజుల అనంతరం సోమవారం రాత్రి 10 గంటలకు మూసివేశారు. సుప్రీంకోర్టు తీర్పుతో శబరిమల ఆలయంలోకి ప్రవేశించాలన్న నిషేధిత వయసున్న మహిళల ప్రయత్నాలు ఫలించలేదు.

Samayam Telugu 23 Oct 2018, 9:56 am
సుప్రీంకోర్టు తీర్పుతో శబరిమల ఆలయంలోకి ప్రవేశించాలన్న నిషేధిత వయసున్న మహిళలు చేసిన ప్రయత్నాలను భక్తులు అడ్డుకున్నారు. నెలవారీ పూజకోసం గత బుధవారం తెరచుకున్న ఆలయం, ఐదు రోజుల అనంతరం సోమవారం రాత్రి 10 గంటలకు మూసివేశారు. తిరిగి నవంబరు 5 ఆలయం తెరవనున్నారు. మండల పూజల కోసం నవంబరు 16 నుంచి డిసెంబరు చివరి వారం, తర్వాత రోజుల మినహా జనవరి 20 వరకు సన్నిధానం తెరిచే ఉంటుంది. సుప్రీం తీర్పు అనంతరం మాస పూజల కోసం బుధవారం ఆలయం తెరచిన తర్వాత ఆరు రోజుల పాటు కేరళలో యుద్ధ వాతావరణం నెలకొంది. సుప్రీంకోర్టు తీర్పుతో అయ్యప్ప సన్నిధానంలోకి అడుగుపెట్టాలని భావించిన మహిళలను ఆందోళనకారులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.
Samayam Telugu Sabarimala-Protesters-1


సోమవారం నాడు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐదుగురు మహిళలు సైతం శబరిమలలో ప్రవేశించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కేరళలోని వివిధ ఆలయాల సందర్శనకు వచ్చిన వీరంతా శబరిమల అయ్యప్పను దర్శించుకోవచ్చిన భావించారు. అయితే, ఇక్కడ పరిస్థితి తమకు తెలియకపోవడంతోనే రావాల్సి వచ్చిందని వారు తెలిపారు. వీరిలో నలుగురు మహిళలు శబరిమల వెళ్లేందుకు ప్రయత్నించగా తెలుగు భక్తులు వారించడంతో వెనుదిరిగారు. మరో మహిళ మాత్రం మొండిగా ముందుకు సాగుతుండగా భక్తులు పెద్ద ఎత్తున శరణుఘోష చేస్తూ అడ్డుకోవడంతో ఆమె తన ప్రయత్నం విరమించుకోకతప్పలేదు. కోజికోడ్‌కు చెందిన బిందు అనే మహిళ సైతం సోమవారం శబరిమలలో ప్రవేశించేందుకు చేసిన ప్రయత్నాలను మార్గమధ్యలోనే భక్తులు అడ్డుకుని వెనక్కుపంపారు. భక్తులు ఆమెను చుట్టుముట్టడంతో పోలీసులు ఆ మహిళను తప్పించి, తమ వాహనంలో తీసుకెళ్లారు.

మరోవైపు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు కూడా పునరాలోచనలో పడింది. ఐదు రోజులపాటు ఎదురైన పరిస్థితులపై చర్చించడానికి మంగళవారం సమావేశం కానుంది. దీనిపై తుది నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించాలని భావిస్తోంది. ఇప్పటికే రివ్యూ పిటిషన్ వేసేందుకు సుముఖంగా ఉన్న ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు, దీనికి ప్రస్తుత నివేదికను జతచేయనుంది. సీనియర్ న్యాయవాది, కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వీ సాయంతో రివ్యూ పిటిషన్ వేస్తామని కేరళ న్యాయ శాఖ మంత్రి ఏకే బాలన్ తెలియజేశారు. మరోవైపు శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయసుల మహిళలనూ అనుమతించాలని గతంలో ఇచ్చిన తీర్పును సమీక్షించేందుకు సుప్రీంకోర్టు నిర్ణయించింది.

దీనిపై దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ ను స్వీకరించిన ధర్మాసనం, ఎప్పటి నుంచి విచారణ జరపుతామన్న విషయాన్ని నేడు వెల్లడించనుంది. మహిళల ప్రవేశాన్ని అడ్డుకుంటూ శబరిమల, పంబ, పథనంతిట్ట, ఎర్నాకులం, తిరువనంతపురం, కొచ్చి తదితర ప్రాంతాల్లో నిరసనలు మిన్నంటిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేసేందుకు కేరళ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. నిషేధిత వయసున్న మహిళలను ఆలయం వరకూ మాత్రమే చేర్చగలిగిన పోలీసులు, వారిని పదునెట్టాంబడి మాత్రం ఎక్కించలేకపోయారు. సుప్రీంకోర్టు తన తీర్పుపై రివ్యూ పిటిషన్‌ను స్వీకరించడం భక్తుల విజయమని శివసేన ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.