యాప్నగరం

శబరిమల: రివ్యూ పిటిషన్లపై విచారణ ఆ రోజే!

సుప్రీంకోర్టు తీర్పుతో శబరిమల ఆలయంలోకి ప్రవేశించాలన్న నిషేధిత వయసున్న మహిళలు చేసిన ప్రయత్నాలను భక్తులు అడ్డుకున్నారు. ఐదు రోజుల పాటు శబరిమలలో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.

Samayam Telugu 23 Oct 2018, 1:12 pm
అన్ని వయసుల మహిళలకు శబరిమల అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశం కల్పించాలని సెప్టెంబరు 28న సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పుపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం 4-1 మెజార్టీతో తీర్పు వెల్లడించింది. అయితే, తీర్పు అనంతరం నెలవారీ పూజల కోసం తొలిసారిగా తెరచిన అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించేందుకు నిషేధిత వయసు మహిళలు చేసిన ప్రయత్నాలను భక్తులు అడ్డుకున్నారు. దీంతో శబరిమలలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. సన్నిధానంలోకి మహిళలు వస్తే ఆలయాన్ని మూసివేస్తామని పూజార్లు సైతం హెచ్చరించారు. దీంతో ఈ తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ దాఖలైన 19 పిటిషన్లను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. రివ్యూ పిటిషన్లను విచారించేందుకు అంగీకరించిన సుప్రీం, నవంబరు 13 న వీటిపై విచారణ జరుపుతామని చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్, జస్టిస్ ఎస్‌కే కౌల్‌ల ధర్మాసంన మంగళవారం స్పష్టం చేసింది.
Samayam Telugu sabarimala-mandir


తీర్పునకు వ్యతిరేకంగా వేలాది మంది భక్తులు ర్యాలీలు నిర్వహించారు. బుధవారం తెరచిన ఆలయాన్ని ఐదు రోజుల పూజ అనంతరం సోమవారం రాత్రి మూసివేశారు. మరోవైపు శబరిమల వివాదంపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ మంగళవారం స్పందించారు. ‘సుప్రీంకోర్టు తీర్పును అమలుచేస్తామని స్పష్టంగా పేర్కొన్నామని, అందుకు అనుగుణంగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని అన్నారు. ప్రభుత్వం, పోలీసులు ఏ మహిళను అడ్డుకోలేదని, ఆర్‌ఎస్‌ఎస్‌ వల్లే శబరిమల రణరణంగా మారిందన్నారు. కొందరు ఆందోళనకారులు మహిళా భక్తులు, మీడియాపై దాడికి పాల్పడ్డారని వ్యాఖ్యానించారు. గత ఆరు రోజులుగా శబరిమలలో చోటుచేసుకున్న పరిణామాలపై చర్చించేందుకు ట్రావెన్‌కోర్ దేవస్వామ్ బోర్డ్ మంగళవారం ప్రత్యేకంగా సమావేశం కానుంది. దీనిపై ఓ నివేదికను రూపొందించి సుప్రీంకోర్టు అందజేయనుంది. భక్తుల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయాన్ని సమీక్షించాలని కోరతామని టీబీడీ ఛైర్మన్ పద్మకుమార్ తెలిపారు.

ట్రావెన్‌కోర్ దేవస్వామ్ బోర్డ్ నిర్ణయాన్ని స్వాగతించిన కేరళ దేవాదాయ శాఖ మంత్రి కడకంపల్లి సురేంద్రన్, నిజమైన భక్తులకు ఆటంకం కలుగుతోందని పేర్కొన్నారు. ట్రావెన్‌కోర్ చివరి సంస్థానాధిపతి చితీరా తిరునాళ్ బలరామ వర్మ జయంతిని పురస్కరించుకుని నవంబరు 5 న శబరిమల ఆలయాన్ని తెరవనున్నారు. నవంబరు 5న తెరిచే ఆలయాన్ని మర్నాడే మూసివేస్తారు. అనంతరం నవంబరు 17న మండల పూజల కోసం తెరచిన ఆలయం, మకర జ్యోతి వరకు దాదాపు మూడు నెలలు తెరచే ఉంటుంది. ఈ సమయంలో దేశం నలుమూల నుంచి లక్షలాది భక్తులు స్వామి దర్శనం కోసం వస్తారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.