యాప్నగరం

పది జన్మల పాపాలను పోగొట్టే నవరాత్రుల పూజ!

జగన్మాత ఉపాసనకు నిర్వహించే కార్యక్రమాలే శరన్నవరాత్రులుగా ప్రాచుర్యం పొందాయి. ఆశ్వయుజానికి మరోపేరు ఇష మాసం. అశ్వనీ నక్షత్రంతో కూడిన పౌర్ణమి వచ్చే మాసం కాబట్టి ఇది ఆశ్వయుజ మాసం అయింది.

Samayam Telugu 12 Oct 2018, 4:24 pm
మనసు నిర్మలం కోసం మహర్షులు ఉపదేశించిన మార్గాల్లో శక్తి ఆరాధన అతి ముఖ్యమైంది. పరమేశ్వరి, పార్వతి, గాయత్రి, మహాకాళి, మహాలక్ష్మీ, మహా సరస్వతి, కనకదుర్గ, లలిత, రాజరాజేశ్వరి.. ఇలా ఏ పేరుతో పిలిచినా ఆయా రూపాల్లో ఉండే ‘పరాశక్తి’ ఒక్కటే. శక్తిని ఆరాధించేందుకు మహర్షులు నిర్ణయించిన కాలం ఆశ్వయుజం. జగన్మాత ఉపాసనకు నిర్వహించే కార్యక్రమాలే శరన్నవరాత్రులుగా ప్రాచుర్యం పొందాయి. ఆశ్వయుజానికి మరోపేరు ఇష మాసం. అశ్వనీ నక్షత్రంతో కూడిన పౌర్ణమి వచ్చే మాసం కాబట్టి ఇది ఆశ్వయుజ మాసం అయింది. శరద్రుతువులో ఈ మాసం వస్తుంది. వర్షాలు కొద్దిగా తగ్గుముఖం పట్టి ప్రకృతి కొత్త శోభను సంతరించుకునే ఈ మాసంలో వెన్నెల అత్యధికంగా కాస్తుంది.
Samayam Telugu durga3


శరత్కాలంలోని తొలి పది రోజుల్లో జరుపుకునే దేవీ నవరాత్రులు అనేక రుగ్మతలను నివారించి, విజయాన్ని చేకూరుస్తాయని పురాణాలు పేర్కొంటున్నాయి. శరద్రుతువులో కాచే వెన్నెల కాంతి, చల్లని చూపు, మందహాసం, ముఖపద్మం కలిగినదిగా పరాశక్తిని అభివర్ణిస్తారు. శరత్కాలంలో ఆవిర్భవించడంతో పరాశక్తికి శారద అనే పేరు వచ్చింది. అందుకే అమ్మవారిని ఉపాసించే కాలాన్ని శరన్నవరాత్రులు, దసరా ఉత్సవాలుగా జరుపుకుంటారు.

పది జన్మల పాపాలను పోగొట్టే నవరాత్రుల్లో మొదటి మూడు రాత్రులు పార్వతి, మధ్య మూడు రోజులు లక్ష్మీ, చివరి మూడు రోజులు సరస్వతిని ఆరాధిస్తారు. ప్రకృతి నియమాలను అనుసరించి శరత్కాలం సంధికాలం. అనారోగ్యాన్ని కలిగించి, ప్రాణాలను హరించే శక్తి ఈ కాలానికి ఉంటుంది. బాధలకు గురికాకుండా జగన్మాతను వేడుకుంటూ చేసే ఉత్సవమే నవరాత్రి ఉత్సవం. హస్తా నక్షత్రంతో కూడిన జ్యేష్ఠ దశమికి దశహరా అనే పేరు ఉంది. పది జన్మల పాపాలను పొగొట్టేది అని కూడా అర్థం.

నవరాత్రుల్లో దుర్గాదేవిని పూజిస్తే జన్మజన్మల పాపాలు, బాధలు దూరం అవుతాయని నమ్మకం. రాత్రి అంటే తిథి అనే అర్థం ఉంది. దీని ప్రకారం ఆశ్వయుజ శుద్ధ పాఢ్యమి నుంచి నవమి వరకు జరిగే ఉత్సవాలే నవరాత్రి ఉత్సవాలు. తొమ్మిది రోజుల పాటు నియమాల ప్రకారం అర్చనలు చేయలేని వారు చివరి మూడు రోజులు అష్టమి, నవమి, దశమి రోజుల్లో అయినా దేవిని అర్చిస్తే, అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. మూలా నక్షత్రంతో కూడిన షష్ఠి లేదా సప్తమి రోజున సరస్వతీదేవిని పూజిస్తారు. ఈ రోజున పుస్తకదానం చేస్తే ఉత్తమ ఫలితం పొందుతారు. దశమి రోజున వేద పండితులు, బ్రాహ్మణులను సత్కరించడం ఆనవాయితీగా వస్తోంది.

నవరాత్రి ఉత్సవాల్లో కుమారీ పూజకు చాలా ప్రత్యేకత ఉంది. తొమ్మిది సంవత్సరాలలోపు బాలికను అలంకరించి, దేవీ స్వరూపంగా భావించి తన్మయత్వం చెందుతూ చేసేదే కుమారీ పూజ. ఇది సాధకులకు ఎంతో మేలు చేస్తుంది. తొమ్మిది మంది బాలికలను కుమారి, త్రిమూర్తి, కల్యాణి, రోహిణి, కాళి, చండిక, శాంభవి, దుర్గ, సుభద్ర అని పేర్లతో ప్రత్యేకంగా పూజిస్తారు.

శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయిని, కాలరాత్రి, మహాగౌరీ, సిద్ధిధాత్రీలను నవదుర్గలుగా పిలుస్తారు. ఈ నవదుర్గలకు సానుకూలంగానే భక్తులు శైలపుత్రి-గాయత్రీదేవి, చంద్రఘంట-అన్నపూర్ణ, కూష్మాండ-మహాలక్ష్మి, స్కందమాత- లలితా త్రిపురసుందరి, కాత్యాయిని - సరస్వతీదేవి, కాలరాత్రి- దుర్గాదేవి, మహాగౌరి-మహిషాసురమర్దని, సిద్ధి ధాత్ని-రాజరాజేశ్వరీదేవిగా అలంకరించి కొలుస్తారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.