యాప్నగరం

హుస్సేన్ త్యాగం.. వీరుల మరణానికి చిహ్నం.. ఈ మొహర్రం

ముస్లీం పవిత్రంగా జరుపుకునే మొహర్రం వాస్తవానికి నెల. ఈ నెలలోనే పదో రోజుకు ఎంతో ప్రత్యేకత ఉంది. మహమ్మద్ ప్రవక్త మనవడైన హజ్రత్ హున్సేన్ (ర.జి) శత్రువుల చేతిలో వీరమరణం పొందుతారు.. ఆయనతో పాటు 70 మంది వరకు మహమ్మద్ ప్రవక్త వంశానికి చెందిన వారు అమరులౌతారు. ఈ ఏడాది ఆగస్టు 29న ఈ పండుగ రానుంది.

Samayam Telugu 28 Aug 2020, 7:37 pm
రంజాన్, బక్రీద్ తర్వాత ముస్లీంలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండగల్లో మొహర్రం ఒకటి. పదిరోజుల పాటు చేసే ఈ పండగ ఇస్లాంకు సంబంధించిన ప్రవచనాలు, మహ్మద్ ప్రవక్త బోధనలు వినిపిస్తాయి. దీన్నే పీర్ల పండగ అని కూడా అంటారు. మొహర్రం నెల పదవ రోజున పీర్లను ఊరేగింపుగా తీసుకువెళ్తారు. నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. వాస్తవానికి మొహర్రం అనేది పండగ కాదు. ఇస్లాం క్యాలెండర్ ప్రకారం తొలి మాసాన్ని మొహర్రం నెలగా పిలుస్తారు. ఈ నెలలోనే పదో రోజు హజ్రత్ ఇమాం హుస్సేన్ కు గుర్తుగా ప్రతిమలను ఊరేగించి తమ సంతాపం ప్రకటిస్తారు. ఈ ఏడాది ఆగస్టు 29న ఈ పండుగ రానుంది.
Samayam Telugu మొహర్రం


Also Read: అరచేతిలో ఈ గుర్తులు ఉంటే ధనవంతులవుతారని మీకు తెలుసా..?

పదోరోజుకు ఎంతో ప్రత్యేకత..
మొహర్రం నెలలో పదో రోజు ఎంతో ప్రత్యేకత ఉందని చెబుతారు. వారి కథనం ప్రకారం మహమ్మద్ ప్రవక్త మనవడైన హజ్రత్ హున్సేన్ (ర.జి) శత్రువుల చేతిలో వీరమరణం పొందుతారు.. ఆయనతో పాటు 70 మంది వరకు మహమ్మద్ ప్రవక్త వంశానికి చెందిన వారు అమరులౌతారు. మహమ్మద్ ప్రవక్త మరణానంతరం హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ , హజ్రత్ అలీ, హజ్రత్ ఉమర్ సైతం సుపరిపాలన అందించారు. అయితే, వీరి తర్వాత వచ్చిన మావియా చక్రవర్తి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశాడు. అనంతరం యజీద్ తనను తాను ఖలీఫాగా ప్రకటించుకుని రాక్షస పాలన సాగించాడు. చెడు అలవాట్లకు బానిసైన యజీద్ ప్రజల్ని పీక్కుతినడం ప్రారంభించాడు.

నమాజ్ చేస్తున్న సమయంలోనే..
దీంతో అతడి దురాగతాల్ని హజ్రత్ హుస్సేన్ ఎదురించి ప్రజల పక్షాన నిలిచాడు. శాంతి కోసం హుస్సేన్ చేసిన ప్రతిపాదనల్ని యజీద్ తోసిపుచ్చి యుద్ధం ప్రకటించాడు. మొహర్రం నెల ఒకటో రోజున ఇరాక్‌లో కర్బలా మైదానంలో యుద్ధం ప్రారంభమైంది. యజీద్ సైన్యం హుస్సేన్‌తోపాటు కుటుంబసభ్యులను చిత్ర హింసలకు గురిచేసి, మహిళలు, పసిపిల్లలను సైతం పాశవికంగా హతమార్చింది. మొహర్రం నెల 10వ రోజు సాయంత్రం నమాజ్ చేస్తున్న సమయంలో ఇమాం హుస్సేన్‌ను శత్రుసైన్యం చుట్టుముట్టింది. ప్రార్థనలో భాగంగా సజ్దా చేస్తున్న సమయంలో భూమిపై తల ఆన్చడంతో వెంటనే శత్రు సైన్యం హుస్సేన్ శిరస్సును ఖండించింది. హుస్సేన్ తలతో సైన్యం ఊరేగుతూ విజయోత్సవం జరుపుకుంటుంది.


హజ్రత్ హుస్సేన్ శాపం..
శత్రువుల చేతిలో 70 మంది వరకు మహమ్మద్ ప్రవక్త వంశానికి చెందిన వారు అసువులబాసారు. ఈ సందర్భంలో హజ్రత్ హుస్సేన్ ఆ తెగకు శాపం పెడతారు. ఈ తెగకు ఎప్పటికీ మోక్షం ఇవ్వొద్దని అల్లాహ్‌ను ప్రార్ధిస్తూ ప్రాణాలు విడుస్తారు. యుద్ధానంతరం యాజిద్ తెగకు చెందిన వారు పశ్చాతాపం చెంది "దేవుడా మేం తప్పు చేశాం.. దైవ ప్రవక్త మహ్మద్ ప్రవక్త వంశానికి చెందిన వారిని మా చేతులతో హతమర్చాం.." కాబట్టి మమ్మల్ని మన్నించమని గుండెల మీద చేతులతో బాదుకుంటూ బిగ్గరగా ఏడుస్తూ నిప్పులపై నడుస్తారు..అప్పటి నుంచి ప్రారంభమైన సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది.

మరోవైపు మహమ్మద్ ప్రవక్త కుటుంబానికి చెందిన వ్యక్తులు అమరులైన సందర్భంగా వారికి సంతాపంగా అరబ్‌వాసులు రెండు రోజుల పాటు ఉపవాస దీక్ష పాటిస్తారు. మొహర్రం నెలలోని 10, 11 రోజుల్లో ఉపవాస దీక్ష పాటించడాన్ని ముస్లింలు పవిత్రంగా భావిస్తారు. మొహర్రం నెలలో ముస్లింలు తమ ఇళ్లలో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించరు. ఇస్లాంను వ్యాపింపజేసేందుకు తన ప్రాణాలను సైతం త్యాగం చేసిన హజ్రత్ఇమాం హుస్సేన్ కు సంతాపం తెలిపే ఉద్దేశంతో దీన్ని పాటిస్తారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.