యాప్నగరం

బంగారంతో మెరిసిపోనున్న సోమ్‌నాథ్ ఆలయం!

గజనీ మహ్మద్, ఘోరీల దండయాత్రల సమయంలో సోమ్‌నాథ్ ఆలయంపై దాడిచేసి అపార సంపదలను దోచుకెళ్లారు. దోచుకోవడమే కాదు దీన్ని ధ్వంసం చేశారు.

TNN 4 Apr 2018, 1:01 pm
ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం గుజరాత్‌లోని సోమ్‌నాథ్ దేవాలయమంతా ఇక బంగారంతో మెరిసిపోనుంది. చరిత్రాత్మక ఈ ఆలయంలోని 72 స్తంభాలకు స్వర్ణ తాపడాన్ని వేయించాలని దేవాలయ బోర్డు నిర్ణయించింది. ఇందులో భాగంగా తొలి దశలో 10 స్తంభాలకు తాపడం వేయించనున్నారు. పది స్తంభాలకు 30 కిలోల బంగారంతో చేయించిన తాపడాలను దేశ రాజధాని నుంచి సోమ్‌నాథ్‌కు మంగళవారం తరలించారు. ఇప్పటికే గర్భగుడితోపాటు ఆలయ శిఖరానికి సువర్ణ తాపడం ఉంది. ఢిల్లీ నుంచి కళాకారులను రప్పించిన ఆలయ స్తంభాలకు బంగారు తాపడం చేయిస్తున్నట్టు సోమ్‌నాథ్ బోర్డు కార్యదర్శి పీకే లహరి తెలిపారు. ముందు రాగితో ఆకృతులను రూపొందించి, వాటిపై బంగారు తాపడం వేయిస్తామని పేర్కొన్నారు. కళాకారులు ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌ను ఉపయోగించి, స్తంభాల నమూనాలను రాగితో తయారు చేసి, దీనిపై బంగారాన్ని పూతపూసినట్టు సోమ్‌నాథ్ ఆలయ జనరల్ మేనేజర్ విజయ్‌సిన్హా చావడ తెలిపారు. సేకరించిన విరాళాలతో బంగారాన్ని ఢిల్లీలో కొనుగోలు చేసినట్టు ఆయన తెలిపారు.
Samayam Telugu సోమ్‌నాథ్ ఆలయం


సోమ్‌నాథ్ ఆలయాన్ని అనేక సార్లు పునర్మించారు. ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని 1951లో చాళుక్యుల కాలం నాటి శైలిలో నిర్మించారు. అంతకు ముందు గజనీ మహ్మద్, ఘోరీ మహ్మద్ లాంటి వాళ్లు ఈ ఆలయాన్ని అనేక సార్లు ధ్వంసం చేశారు. ఎన్నో విదేశీ దండయాత్రలను తట్టుకుని సోమ్‌నాథుడు తన ఉనికిని చాటుకున్నాడు. 12 జ్యోతిర్లింగాలలో సోమ్‌నాథ్‌ ఆలయం మొదటిది. సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రారంభించిన జీర్ణోద్దరణ పనులను కేఎం మున్షి పూర్తిచేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.