యాప్నగరం

నేటి నుంచే తిరుమలలో మహాసంప్రోక్షణ.. అంకురార్పణ

తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్కరానికి ఒకసారి నిర్వహించే అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణకు శనివారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది.

Samayam Telugu 12 Aug 2018, 9:52 am
తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్కరానికి ఒకసారి నిర్వహించే అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణకు శనివారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఆగస్టు 12 నుంచి 16 వరకు వైఖానస ఆగమోక్తంగా అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ వైదిక కార్యక్రమం జరగనుంది. ఇందు కోసం శ్రీవారి ఆలయంలోని అదనపు పరకామణి ప్రాంతంలో యాగశాలను సిద్ధం చేశారు. ఇక్కడ శ్రీవారి మూలవర్లకు ఐదు, ద్వారపాలకులకు ఒకటి, విమాన వేంకటేశ్వరస్వామికి ఒకటి, శ్రీగరుడాళ్వార్‌, ఆలయ గోపురానికి కలిపి రెండు, శ్రీ వరదరాజస్వామి, ఆలయ గోపురానికి కలిపి రెండు, అన్నప్రసాద పోటు తాయారుకు ఒకటి, పడిపోటు తాయారుకు ఒకటి, విష్వక్సేనుడికి ఒకటి, భాష్యకార్లకు ఒకటి, యోగనరసింహస్వామి, ఆలయ గోపురానికి కలిపి రెండు, రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణుడికి ఒకటి, బేడి ఆంజనేయస్వామి, ఆలయ గోపురాలకు కలిపి రెండు, వాస్తు హోమ గుండాలతో కలిపి మొత్తం 28 హోమగుండాలను ఏర్పాటుచేశారు.
Samayam Telugu శ్రీవారి మహాసంప్రోక్షణం


శనివారం సాయంత్రం ప్రధాన అర్చకులు వేణుగోపాలదీక్షితులు శ్రీవారి సేనాధిపతి విష్వక్సేనుల వారికి హారతి ఇచ్చి ఆలయ ప్రదక్షిణ అనంతరం వసంత మండపానికి చేరుకున్నారు. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సేనాధిపతి ఉత్సవం నిర్వహించారు. విష్వక్సేనులవారిని నాలుగు మాడ వీధుల్లో ఊరేగించిన తర్వాత వసంత మండపం వద్ద మేదినిపూజ నిర్వహించి, అక్కడ పుట్టమన్ను సేకరించి ఆలయానికి చేరుకున్నారు. యాగశాలలోని పాలికల్లో నవధాన్యాలు పోసి శాస్త్రోక్తంగా అంకురార్పణ చేశారు. రాత్రి 9 నుంచి 10 గంటల వరకు ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. అరవైఏళ్ల కిందట విళంబినామ సంవత్సరంలో బాలాలయ మహాసంప్రోక్షణం జరగ్గా, ప్రస్తుతం అదే ఏడాది మళ్లీ జరగడం విశేషం.

మరోవైపు శనివారం ఉదయం శ్రీవారి ఆలయంలో రుత్విక్‌వరణం వైభవంగా జరిగింది. ముందుగా 44 మంది రుత్వికులు, 16 మంది సహాయకులు, ఇతర వేదపారాయణదారులు శ్రీవారి ఆజ్ఞ తీసుకున్నారు. తరువాత ఆలయ ప్రధానార్చకులు శ్రీ వేణుగోపాలదీక్షితులు రుత్వికులకు యాగగుండాల వద్ద స్థానాలను నిర్దేశించారు. ఈ సందర్భంగా స్వామివారు ఆశీర్వదించిన వస్త్రాలను వారికి అందజేశారు. ఈ వస్త్రాలను పసుపునీటిలో తడిపి రుత్వికులు దీక్షా వస్త్రాలుగా ధరిస్తారు. ఐదు రోజుల పాటు జరిగే యాగశాల కార్యక్రమాల్లో మాత్రమే ఈ పసుపు వస్త్రాలను రుత్వికులు ధరిస్తారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.