యాప్నగరం

మార్చి 29 నుంచి శ్రీవారి వార్షిక వసంతోత్సవాలు

ఏటా చైత్రశుద్ధ త్రయోదశి నుంచి పౌర్ణమి వరకు తిరుమల శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలను మూడు రోజులపాటు నిర్వహించడం ఆనవాయితీ.

Samayam Telugu 23 Mar 2018, 3:17 pm
ఏటా చైత్రశుద్ధ త్రయోదశి నుంచి పౌర్ణమి వరకు తిరుమల శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలను మూడు రోజులపాటు నిర్వహించడం ఆనవాయితీ. చైత్రశుద్ధ త్రయోదశి రోజు (మార్చి 29)న ఉదయం 7.00 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి నాలుగు మాడవీధులలో ఊరేగుతారు. అనంతరం వసంతోత్సవ మండపానికి వేంచేసి, వసంతోత్సవ అభిషేక నివేదనలు పూర్తయిన అనంతరం తిరిగి ఆలయానికి చేరుకుంటారు. రెండో రోజు దేవేరులతోపాటు స్వామివారు ఉదయం 8.00 నుంచి 9.00 గంటల వరకు బంగారు రథాన్ని అధిరోహించి తిరుమాడ వీధులలో ఊరేగుతారు. తర్వాత వసంత మండపంలో అర్చకులు వసంతోత్సవాన్ని నిర్వహిస్తారు.
Samayam Telugu vasanthotsavam-copy1


చివరిరోజు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామితో పాటు శ్రీసీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి, రుక్మిణీ సమేత శ్రీకృష్ణ ఉత్సవమూర్తులను కూడా వసంతోత్సవ మండపానికి ఊరేగింపుగా తీసుకెళ్తారు. వసంతోత్సవ వేడుకలు పూర్తయిన తర్వాత తిరిగి సాయంకాలానికి ఆలయానికి చేరుకుంటారు. ఈ సందర్భంగా రోజు మధ్యాహ్నం 2.00 నుంచి 4.00 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం చేస్తారు.

అలాగే రోజూ సాయంత్రం 6.00 నుంచి 6.30 గంటల వరకు ఆస్థానం ఘనంగా నిర్వహిస్తారు. వసంత ఋతువులో శ్రీమలయప్పస్వామికి జరిగే ఈ ఉత్సవాన్ని ‘వసంతోత్సవ’మని అంటారు. ఈ క్రతువులో సుగంధ సంభరిత వికాస పుష్పాలను స్వామికి సమర్పించడమే కాదు వివిధ రకాల ఫలాలను స్వామికి నివేదించడం ప్రధాన ప్రక్రియ. వసంతోత్సవ వేడుకలను పురస్కరించుకొని మార్చి 29 న తిరుప్పావడసేవ, మార్చి 30న తోమాలసేవ, అర్చన, నిజపాదదర్శనాలను రద్దు చేశారు. అలాగే మార్చి 29 నుంచి 31వ తేదీ వరకు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోతవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.