యాప్నగరం

శ్రీవారి చెంత పరమ భక్తుడి జన్మదిన వేడుకలు.. 300 ఏళ్లుగా కొనసాగుతోన్న సంప్రదాయం!

కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి శతాబ్దాలుగా పరమ భక్తులు అనేక కానుకలు అందజేశారు. శ్రీవారి భాండాగారంలో లేని నగలు, ఆభరణాలు లేవంటే అతిశయోక్తి కాదు.

Samayam Telugu 24 Jul 2019, 1:51 pm
కలియుగ వైకుంఠం తిరుమలలో మైసూరు మహారాజు జన్మించిన ఉత్తరాభాద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని జులై 24న బుధ‌వారం పల్లవోత్సవం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా సహస్రదీపాలంకారసేవ అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి ఊరేగింపుగా కర్ణాటక సత్రానికి వేంచేపు చేస్తారు. అక్కడ స్వామివారితోపాటు ఉభయ దేవేరులకు కర్ణాటక ప్రభుత్వ, మైసూరు సంస్థానం ప్రతినిధులు ఆహ్వానం పలికి ప్రత్యేక హారతి సమర్పిస్తారు. మైసూరు మహారాజు జ్ఞాపకార్థం దాదాపు 300 సంవత్సరాల నుంచి పల్లవోత్సవాన్ని టీటీడీ నిర్వహిస్తోంది. మొదట్లో ఈ ఉత్సవాన్ని తోటోత్సవం అనేవారు. ఈ ఉత్సవంలో కర్ణాటక సత్రాలకు విచ్చేసిన స్వామి, అమ్మవార్లకు పూజలు నిర్వహించి, నైవేద్యం సమర్పించి భక్తులకు ప్రసాదాలు పంపీణి చేస్తారు.
Samayam Telugu Tirumala-Adhyanotsavam


శ్రీవేంకటేశ్వరస్వామికి పరమ భక్తుడైన మైసూరు మహారాజు అచంచల భక్తి విశ్వాసంతో స్వామికి భూరి విరాళాలు అందించారు. మూలవిరాట్టు, స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు, ప్లాటినం, బంగారు, వజ్రాలు, కెంపులు, పచ్చలు, మకరం తదితర అమూల్యమైన అభరణాలు బహుకరించారు. అలాగే బ్రహ్మూత్సవాలలో శ్రీవారికి ఉపయోగించే గరుడ, గజ, ముత్యపుపందిరి, సర్వభూపాల, అశ్వ, సూర్యప్రభ, చంద్రప్రభ వాహనాలు మైసూరు మహారాజు సమర్పించినవే కావడం విశేషం. స్వామివారి వాహనసేవలలో భాగంగా ఐదో రోజు ఉదయం పల్లకీ ఉత్సవంలో ఉపయోగించే పల్లకీని ప్రత్యేకంగా ఏనుగు దంతాలు, అద్భుతమైన కళాకృతులతో తయారుచేసి అందించారు.

రోజూ తెల్లవారుజామున శ్రీవారి సుప్రభాతసేవకు ముందు మైసూరు సంస్థానం తరపున నవనీతహారతి, ఆలయంలోని అఖండ దీపాలైన బ్రహ్మదీపం, మహారాజ దీపానికి రోజూ ఐదు కిలోల నెయ్యి ఇచ్చే సాంప్రదాయం ఆయన ప్రారంభించినా అది నేటికీ కొనసాగుతుంది. మైసూరు మహారాజు జ్ఞాపకార్థం శ్రీవారి ఆలయంలో ప్రతి నెల ఉత్తరాభద్ర నక్షత్రం రోజున రాత్రి 7.30 గంటలకు ప్రత్యేక ఆస్థానం నిర్వహిస్తారు. అదేవిధంగా శ్రీవారికి నిర్వహించే ఉగాది, దీపావళి, ఆణివార ఆస్థానాలలో మైసూరు మహారాజు పేరున ప్రత్యేక హారతి ఉంటుంది. శ్రీకృష్ణ జన్మష్టమి సందర్భంగా నిర్వహించే ఉట్లోత్సవం పర్వదినం రోజున కూడా శ్రీమలయప్పస్వామి కర్ణాటక సత్రాలకు విచ్చేసి పూజలందుకుని అనంతరం ఆలయానికి చేరుకుంటారు.

తిరుమల శ్రీవారి అఖండ ప్రశస్తి ఆయన భక్తులకూ అంటుతుంది. స్వామివారి పట్ల చక్రవర్తులు, రాజులు చూపిన అంచంచల భక్తి శతాబ్దాల నుంచి స్ఫూర్తిగా నిలుస్తోంది. ఆ పంరపరను కొనసాగించేందుకు టీటీడీ తగురీతిలో వారిని స్మరించుకుంటూ, వేడుకలను నిర్వహిస్తూ గౌరవిస్తోంది. దీనికి ఉదాహరణే పల్లవోత్సవం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.