యాప్నగరం

దేవరగట్టు: ఫలించని పోలీసుల ప్రయత్నం.. మరోసారి సంప్రదాయమే గెలిచింది

దేవరగట్టులోని మాళ మల్లేశ్వరస్వామి దర్శనం కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రల నుంచి భక్తులు తరలివస్తారు. విజయదశమి రోజు అర్ధరాత్రి స్వామివారి కల్యాణం తర్వాత బన్నీ ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ.

Samayam Telugu 20 Oct 2018, 11:41 am
దసరా సందర్భంగా దేవరగట్టులో నిర్వహించే బన్నీ ఉత్సవాన్ని ఈ సారి ప్రశాంతంగా నిర్వహించాలని భావించిన పోలీసులకు ఆశాభంగం తప్పలేదు. పోలీసుల సూచనలను సైతం భక్తులు పట్టించుకోకుండా సమరానికి సిద్ధమయ్యారు. శుక్రవారం జరిగిన కర్రల సమరంలో భక్తులు పదుల సంఖ్యలో గాయపడ్డారు. బన్ని ఉత్సవంలో భాగంగా శుక్రవారం అర్ధరాత్రి మాళ మల్లేశ్వరస్వామి ఉత్సవమూర్తులను దక్కించుకునేందుకు జరిగిన జైత్రయాత్ర ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగింది. ఒక చేతిలో కర్ర.. మరో చేతిలో కాగడాలు పట్టిన భక్తులు డిర్ర్‌ర్‌.. గోపరాక్‌.. అనే నినాదాలతో తరతరాలుగా కొనసాగుతోన్న ఆచార, సంప్రదాయాలను పాటిస్తూ ఆధ్యాత్మిక క్రతువును సాగించారు. భక్తులకు గాయాలు మినహా ఎలాంటి ప్రాణానష్టం లేకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
Samayam Telugu devara


దేవరగట్టులోని మాళ మల్లేశ్వరస్వామి దర్శనం కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రల నుంచి భక్తులు తరలివస్తారు. విజయదశమి రోజు అర్ధరాత్రి స్వామివారి కల్యాణం తర్వాత బన్నీ ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా శుక్రవారం జరిగిన కర్రల సమరం ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగింది. రాత్రి 11 నుంచి 12 గంటల మధ్య చుట్టుపక్కల నెరణికి, నెరణికితండా, కొత్తపేట, సులువాయి, ఆలూరు, బిలేహాలు, విరుపాపురం గ్రామాల ప్రజలు కర్రలు చేతబట్టి చేరుకున్నారు. కల్యాణం అనంతరం స్వామివార్ల ఉత్సవమూర్తులను పల్లకిలో ఉంచి జైత్రయాత్రకు బయలుదేరారు. గట్టుపై నుంచి వచ్చిన స్వామికి సింహాసన కట్టవద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సమయంలోనే నెరణికి, ఆలూరు, నెరణికి తండా, బిలేహాల్‌, కొత్తపేట, ఎల్లార్తి, సుళువాయి గ్రామాల మధ్య కర్రల సమరం సాగింది.

మరోవైపు బన్నీ ఉత్సవాన్ని అడ్డుకునేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. నెల రోజుల ముందు నుంచే ప్రజలకు అవగాహన కల్పించడానికి సదస్సులు నిర్వహించారు. అయితే, పోలీసులు హితబోధను భక్తులు పెడచెవినబెట్టి భారీ ఎత్తున కర్రలు గట్టుకు తీసుకొచ్చారు. ఉత్సవ విగ్రహాలను కాపాడేందుకు కర్రలు అడ్డుపెట్టే క్రమంలో చాలా మంది గాయాలపాలయ్యారు. తోపులాటలో కర్రలు తగిలి కొందరు, కాగడాలు తగిలి మరికొందరు గాయపడ్డారు. దేవరగట్టులో బన్నీ ఉత్సవాన్ని నియంత్రించాలని మానవహక్కుల సంఘం, లోకాయుక్త ఏటా ఆదేశాలు జారీచేయడంతో గట్టులో కర్రలను తగ్గించాలని పోలీసులు శతవిధాలా ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో దాదాపు 1000 మంది పోలీసులను భద్రత కోసం వినియోగించారు. అవాంఛనీయ సంఘటనల జరగకుండా 2 డ్రోన్‌ కెమెరాలతో పాటు 50 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.