యాప్నగరం

దుర్గగుడిలో పట్టుచీర మాయం.. మీనమేషాలు లెక్కిస్తున్న పోలీసులు!

విజయవాడ కనకదుర్గమ్మకు ఉండవల్లికి చెందిన పద్మజ అనే భక్తురాలు సమర్పించిన చీర మాయమైన విషయం తెలిసిందే. ఆదివారం అమ్మవారికి సారె రూపంలో సమర్పించిన రూ.18 వేలు విలువైన చీర కాసేపటికే మాయమైనట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి.

Samayam Telugu 6 Aug 2018, 3:11 pm
విజయవాడ కనకదుర్గమ్మకు ఉండవల్లికి చెందిన పద్మజ అనే భక్తురాలు సమర్పించిన చీర మాయమైన విషయం తెలిసిందే. ఆదివారం అమ్మవారికి సారె రూపంలో సమర్పించిన రూ.18 వేలు విలువైన చీర కాసేపటికే మాయమైనట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే, ఈ ఘటనపై విచారణ విషయంలో పోలీసులు, అధికారులు సాకులు చెప్పి, మీనమేషాలు లెక్కిస్తున్నారు. అసలు ఆ చీరను భక్తులు సమర్పించినట్టు రికార్డుల్లో నమోదు కానందున పోలీసులకు ఫిర్యాదు చేయలేమని అధికారులు వ్యాఖ్యానించడం గమనార్హం. అదే సమయంలో దీనిపై తమకు ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతోనే కేసు నమోదు చేయలేదని పోలీసులు అంటున్నారు. విషయం తెలిసిన వెంటనే ఆలయానికి వచ్చిన పోలీసులు భక్తులు, అర్చకులు, పాలకమండలి సభ్యులను విచారించారు. ఆలయంలోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించారు. అయితే, తదుపరి చర్యలకు మాత్రం వెనుకంజ వేస్తున్నారు.
Samayam Telugu దుర్గగుడిలో చీర మాయం


నిబంధనల మేరకు ఫిర్యాదు వస్తేనే కేసు నమోదు చేస్తామని చెబుతున్నారు. అయితే అమ్మవారికి ఆ చీర సమర్పించిన భక్తులు మాత్రం పాలకమండలి సభ్యుడు పెంచలయ్య విజ్ఞప్తి మేరకే తాము పోలీసులకు ఫిర్యాదు చేయలేదని పేర్కొన్నారు. సాక్షాత్తు మహామండపంలోనే జరిగిన ఈ ఘటనపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. మరికాసేపట్లో పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. అమ్మవారికి సమర్పించేందుకు మదనపల్లిలో ప్రత్యేకంగా ఈ పట్టుచీరను నేయించారు.

మహామండపంలో ఉత్సవ విగ్రహానికి అలంకరించిన కాసేపటికే చీర కనిపించలేదు. ట్రస్ట్ బోర్డ్ సభ్యురాలికి ఆ చీరను ఇచ్చారని ఆరోపణలు వస్తున్నాయి. సీసీటీవీ ఫుటేజీని ఆలయ అధికారులు పరిశీలిస్తున్నారు. ఇటీవల తెలంగాణలోని కాళేశ్వరం ఆలయంలోని అమ్మవారికి సీఎం కేసీఆర్ సమర్పించిన చీర మాయమైంది. 2016 జూన్‌ 2న అమ్మవారికి సమర్పించిన చీర మాయమవడం పట్ల ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఇంటిలిజెన్స్ కూడా రంగంలో దిగి విచారణ చేపట్టింది. ఇటీవల కాలంలో దుర్గగుడిలో జరుగుతోన్న పరిణామాలు భక్తులను తీవ్రంగా కలిచివేస్తున్నాయి. తరుచూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.