యాప్నగరం

దుర్గగుడిలో చీరల మాయాజాలం.. రూ. 22.50 లక్షల విలువైన చీరలు మిస్సింగ్!

ఇంద్రకిలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మకు భక్తులు సమర్పించిన రూ.50వేలు, రూ.లక్ష విలువైన పట్టు చీరలను కొంతమంది అధికారులు సింగారించుకోవడంపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి.

Samayam Telugu 23 Oct 2019, 9:14 am
విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో వివాదాలకు కొత్తేంకాదు. ముఖ్యంగా అమ్మవారికి భక్తులు సమర్పించే చీరల విషయంలో అధికారగణం చేతివాటం ప్రదర్శించడం ఇక్కడ పరిపాటిగా మారింది. గతేడాది ఓ భక్తురాలు అమ్మవారికి సారెగా సమర్పించిన చీరను పాలక మండలి సభ్యురాలు కొట్టేసిన వైనం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది. తాజాగా ఓ భక్తుడు కనకదుర్గమ్మకు కానుకగా సమర్పించిన రూ.40వేల విలువైన పట్టుచీర ట్యాగ్‌ను అలాగే ఉంచి దానిని మాయ చేశారు. దీని స్థానంలో రూ.10వేల చీరను ఉంచడం విశేషం.
Samayam Telugu DurgaTemple_4598


చీరలు గోల్‌మాల్ వ్యవహారంపై విచారణ జరుపుతుండగా రోజుకో విషయం వెలుగు చూస్తోంది. మంగళవారం నాటికి రూ.22.50 లక్షల విలువైన చీరలు మాయమైనట్టు తేలింది. ఈ పరిశీలన మరో వారం రోజుల జరిగితే ఎన్ని చీరలు మాయమయ్యానేది తెలనుంది. అమ్మవారి ఆలయంలో ఉన్నతాధికారులుగా వచ్చిన వారిని ప్రసన్నం చేసుకోడానికి భక్తులు సమర్పించే ఖరీదైన చీరలను మాయం చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

దేవదాయశాఖ నిబంధనల ప్రకారం చీరల విక్రయాలను వేలం ద్వారా కాంట్రాక్టర్లకు అప్పగిస్తారు. వాటిని కాంట్రాక్టర్లు తీసుకొని విక్రయిస్తారు. వేలంలో దక్కించుకున్న మొత్తాన్ని ముందుగానే చెల్లించాలి. గతంలో ఇలాగే వేలం ద్వారా రూ.5కోట్ల ఆదాయం సమకూరేది. కానీ 2017లో ఇది అనూహ్యంగా పడిపోయింది. కేవలం రూ.2.76 కోట్ల మాత్రమే ఆదాయం వచ్చింది. ముఖ్యంగా ఐఏఎస్‌ల పాలన వచ్చిన తర్వాత వేలం ప్రక్రియ మార్చివేశారు. కాంట్రాక్టర్‌కు అప్పగించకుండానే ఓ ఉద్యోగి ద్వారా విక్రయిం చేపట్టారు. అప్పటి నుంచే చీరలు మాయమవుతున్నాయి.

సాధారణంగా భక్తులు ఇచ్చే చీరలను కౌంటర్‌లో స్వీకరించి రశీదు అందజేస్తారు. ధరను తెలిపే ట్యాగ్‌‌, దాత పేరు, ఫోన్‌ నంబరు, చిరునామాతో పాటు చీర ఫొటో తీసి భద్రపరుస్తారు. స్కానింగ్‌ ద్వారా ఈ వివరాలను కంప్యూటరీకరిస్తారు. అయితే, భక్తులు విలువైన చీరలు ఇస్తే వాటిస్థానంలో తక్కువ ధరవి ఉంచుతున్నారు. దీంతో ఆదాయం పడిపోయింది. దుర్గగుడికి వచ్చే ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల భార్యలకు, ఇతరులకు నిబంధనలకు విరుద్దంగా పట్టు చీరలను కానుకగా ఇస్తున్నారు.

గతంలో దీనిపై దేవదాయశాఖ కమిటీ విచారణ చేస్తే ఏడాదిలోనే రూ.76 లక్షల విలువైన చీరలు మాయమయినట్లు తేలింది. దీనిపై ప్రభుత్వానికి అందజేసిన నివేదికలో 2,500 వరకు పట్టు చీరలు గల్లంతైనట్లు పేర్కొన్నారు. తాజాగా మరోసారి కమిషనర్‌ పద్మ ఆధ్వర్యంలో విచారణ చేపట్టగా ఇప్పటి వరకు రూ.22.50లక్షల విలువైన చీరలు మాయమైనట్టు గుర్తించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.