యాప్నగరం

కనదుర్గమ్మకు ఉండవల్లి భక్తులు ఆషాడం సారె

ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మకు ఆషాఢ మాసం తొలి రోజు ఆలయ ఈవో కోటేశ్వరమ్మ కుటుంబ సమేతంగా అమ్మవారికి సారె సమర్పించారు. ఈ సంప్రదాయం అనేక సంవత్సరాలుగా కొనసాగుతోంది.

Samayam Telugu 18 Jul 2019, 1:18 pm
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మను తమ ఆడపడుచుగా భావించి భక్తులు సారె సమర్పించుకుంటారు. ఆషాడ మాసంలో ఈ సారెను భక్తులు అందజేస్తారు. ఈ ఏడాది జులై 3 న ప్రారంభమైన ఈ వేడుక ఆగస్టు 1 శ్రావణమాసం వరకు కొనసాగుతుంది. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఆలయానికి చేరుకుంటారు. అనంతరం తమ వెంట తీసుకొచ్చిన పూలు, పండ్లు, సారె, గాజులు అమ్మకు సమర్పిస్తారు. గురువారం నాడు ఉండవల్లి గ్రామ మహిళలు కనకదుర్గమ్మకు ఆషాడం సారె అత్యంత వైభవోపేతంగా తీసుకెళ్లారు. డప్పు వాయిద్యాలతో పూలు,పండ్లు, సారె, గాజులు తీసుకొని సంబరంగా తరలివెళ్లారు.
Samayam Telugu undavalli2


గతేడాది సైతం ఇలాగే అమ్మవారికి సారె తీసుకెళ్లామని భక్తులు తెలిపారు. సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు పండి రైతులు, ప్రజలు ఆనందంగా ఉండాలని కోరుకుంటూ అమ్మకు వీటిని సమర్పిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రాజెక్టులు నిండుగా కళకళలాడాలని వారు ఆకాంక్షించారు. ఉండవల్లి గ్రామంలోని రెడ్ల బజారు రామ మందిరంలో పూజలు చేసిన అనంతరం అమ్మవారికి సారే తీసుకొని మేల తాళాల నడుమ కాలినడకన బయల్దేరి వెళ్లారు.

కాగా, గతేడాది అమ్మవారికి ఓ భక్తురాలు సారె కింద సమర్పించిన చీర మాయమైన వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఉండవల్లికి చెందిన పద్మ అనే ఓ భక్తురాలు దుర్గమ్మకు ప్రత్యేకంగా నేయించిన రూ.18 వేలు విలువైన చీరను అమ్మవారికి సారెగా సమర్పించింది. ఆగస్టు 5 న మల్లికార్జున మహామండపం ఆరో అంతస్థులో అమ్మవారి ఉత్సవ విగ్రహం వద్ద ఈ చీరను ఉంచి పూజలు నిర్వహించి సమర్పించారు. భక్తురాలి కోరిక మేరకు అర్చకులు అమ్మవారి ఉత్సవ విగ్రహంపై చీర ఉంచి ఆ తర్వాత పక్కన పెట్టారు. కాసేపటికే ఆ చీర మాయమైంది. దీనిపై ఆరా తీయగా పాలకమండలి సభ్యురాలు కోడెల సూర్యలత తీసుకెళ్లినట్టు తేలింది. దీంతో ఆమెను పదవి నుంచి తొలగించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.