యాప్నగరం

నాలుగొందల ఏళ్ల మైసూరు దసరా పండుగ!

కన్నుల నిండుగా దసరా వైభవాన్ని చూడాలన్నా, మనసు నిండుగా ఆ ఆనందాన్ని నింపుకోవాలన్నా మైసూరు వెళ్లాల్సిందే.

TNN 11 Oct 2016, 9:26 am
కన్నుల నిండుగా దసరా వైభవాన్ని చూడాలన్నా, మనసు నిండుగా ఆ ఆనందాన్ని నింపుకోవాలన్నా మైసూరు వెళ్లాల్సిందే. దసరా అంటేనే మైసూరు, మైసూరు అంటేనే దసరా అన్న స్థాయిలో అక్కడి దసరా పండుగకు గుర్తింపు వచ్చింది. దుర్గా నవరాత్రులు వివిధ కార్యక్రమాలతో ఏర్పాట్లతో దేశ విదేశీ పర్యాటకులు అమితంగా ఆకట్టుకుంటోంది మైసూరు దసరా మహోత్సవం. నాలుగొందల ఏళ్లుగా అక్కడ అంగరంగ వైభవంగా దసరా శరన్నవరాత్రులు జరుగుతూనే ఉన్నాయి.
Samayam Telugu dussehra festival in mysore
నాలుగొందల ఏళ్ల మైసూరు దసరా పండుగ!


నాలుగొందల ఏళ్ల క్రితం మైసూరు ప్రాంతాన్ని శ్రీరంగ పట్టణాన్ని రాజధానిగా చేసుకుని విజయనగర రాజులు పరిపాలించేవారు. శ్రీరంగపట్టణంలో తొలిసారి 1610లో దసరా వేడుకలు నిర్వహించినట్టు ఆధారాలు చెబుతున్నాయి. అనంతరం వారి సామ్రాజ్యం పతనమయ్యాక ఒడయార్ వంశస్థులు సింహాసనమెక్కారు. వారు శ్రీరంగపట్టణం నుంచి మైసూరుకు రాజధానిని మార్చి... ఏటా క్రమం తప్పకుండా దసరా వేడుకలను కోటలో నిర్వహించడం మొదలుపెట్టారు. ఆనాటి నుండి నేటి వరకు దసరా వేడుకల వైభవం ఏమాత్రం తగ్గకుండా ప్రతి ఏడాది నిర్వహిస్తున్నారు. బంగారు అంబారీలో చాముండి దేవి విగ్రహం, బంగారు సింహాసనంపై కూర్చుని రాజా వారు నిర్వహించే సభ, గజరాజులపై జంబూ సవారీ, వివిధ కళారూపాల ప్రదర్శనలు, కోట విద్యుద్ధలంకరణ అన్నీ చూడాల్సిన ఘట్టాలే.


దసరా నవరాత్రులూ మైసూరు కోటను పదివేల విద్యుత్ బల్బులతో అలంకరణ చేస్తారు. మహారాజు సింహాసనం కూడా పెద్ద ఆకర్షణే. దానిని అంజూర చెట్ల కలపతో తయారుచేసి, ఏనుగు దంతాలు, బంగారం పూతతో రూపొందించారు. సింహాసనానికి బంగారు కోళ్లను ఏర్పాటు చేశారు. దసరా నవరాత్రులూ ఈ బంగారు సింహాసనాన్ని ప్రజలకు తిలకించే అవకాశం ఉంటుంది. ఈ బంగారు సింహాసనంపై కూర్చుని మైసూరు మహారాజా వారు దర్బారు నిర్వహిస్తారు. కోటలోని ప్రముఖులు, మంత్రులు పాల్గొని ఉండగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఇవి చూడడానికి ప్రత్యేక టికెట్ కొని వెళ్లాల్సి ఉంటుంది.

చాముండేశ్వరీ దేవిని ఊరేగించే అంబారీని 750 కిలోల బంగారంతో తయారు చేశారు. దానిపై వీధుల్లో అమ్మవారిని ఊరేగిస్తారు. అంబారీ ఎల్లప్పుడు రాజవంశస్థుల పర్యవేక్షణలోనే ఉంటుంది.

నాగరహోళే అనే అటవీ ప్రాంతంలో ఉండే ఏనుగులను ప్రత్యేకంగా దసర ఉత్సవాల కోసం తీసుకొస్తారు. వాటి బాగోగులు చూసుకునేందుకు నాగరహోళెలోనే ఉద్యోగులు ఉంటారు. వీటిని మంగళవాయిద్యాలతో మైసూరు రప్పిస్తారు. చాముండేశ్వరీ దేవికి చెందిన బంగారు అంబారీని బలరామ, అభిమన్యు, గజేంద్ర, అర్జున, రేవతి, సరళ అనే ఏనుగులు బృందంగా వెళ్లి తీసుకువస్తాయి. మిగతా ఏనుగులు మరో బృందంగా ఉంటాయి.


మైసూరు దసరాను కర్ణాటక రాష్ట్రపండుగగా ప్రకటించాక ఇక్కడ మరిన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. శకటాల ప్రదర్శన కూడా జరుగుతుంది. దివిటీల ప్రదర్శన, లేజర్ షో ఆకట్టుకుంటాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.