యాప్నగరం

నేడు సమ్మక్క ఆగమనం.. మేడారానికి చత్తీస్‌గఢ్ సీఎం

తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి గాంచిన మేడారం జాతరలో మరో మహాఘట్టం నేడు ఆవిష్కృతం కానుంది. నేటి సాయంత్రం సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠించనున్నారు.

TNN 1 Feb 2018, 11:27 am
శివసత్తుల పూనకాలు, కోయరాజుల కోలాహలం, డప్పుల చప్పుళ్లతో మేడారం ఊగిపోయింది. కన్నెపల్లి నుంచి మేడారానికి సారలమ్మను తీసుకొస్తున్న సమయంలో అడుగడుగునా భక్తులు నీరాజనం పట్టి స్వాగతం పలికారు. బుధవారం రాత్రి సారలమ్మను గద్దెపై ప్రతిష్ఠించారు. ఆమెతోపాటు పగిడిద్దరాజు, గోవిందరాజులనూ గద్దెపై ఉంచారు. నమ్ముకున్న వారి కోసం ప్రాణత్యాగం చేసిన ధీశాలి... అనుక్షణం భక్తుల శ్రేయస్సును కాంక్షించే మేడారం సమ్మక్క గురువారం సాయంత్రం గద్దెపై కొలువుదీరనుంది.
Samayam Telugu goddess sammakka ammavaru will arrive on gadde from chilakala gutta
నేడు సమ్మక్క ఆగమనం.. మేడారానికి చత్తీస్‌గఢ్ సీఎం


సాయంత్రం ఈ కార్యక్రమం మొదలై రాత్రి వరకు సాగుతుంది. సమ్మక్క గద్దెకు చేరుకొనే సమయంలో చిలుకలగుట్ట మార్గం జనంతో కిక్కిరిపోతుంది. అడుగు తీసి అడుగు వేయలేనట్లుగా ఉంటుంది. ఆ మహాద్భుత దృశ్యాన్ని వీక్షించడానికి భక్తులు చెట్లు, ఇళ్లు ఎక్కుతారు. గుట్టపై నుంచి పూజారులు తల్లిని కిందికి తీసుకురాగానే జయజయధ్వానాలతో మేడారం పరిసర ప్రాంతాలు ప్రతిధ్వనిస్తాయి. కొందరు ఎదురుకోళ్లతో స్వాగతం పలుకుతారు... మరికొందరు పట్నం ముగ్గులు వేస్తారు. ఇంకొందరు బలిహరణ చేపడతారు. చాలా మంది పరవశించిపోయి నృత్యాలు చేస్తారు. సాధువులు శంకువులతో చేసే శబ్దాలు హోరెత్తిస్తాయి. రమణీయ దృశ్యాలతో ఆ మార్గం రసరమ్యంగా మారుతుంది.

గురువారం ఉదయం పూజారుల ఆడపడుచులు మేడారంలోని ఆలయానికి వెళ్లి శుభ్రం చేసి ముగ్గులు వేసి, అందంగా అలంకరించారు. అనంతరం పూజారులు ప్రత్యేక పూజలు చేస్తారు. తర్వాత కుంకుమ భరిణ రూపంలో అమ్మవారిని కిందికి తీసుకొస్తారు. అక్కడి నుంచి మహా ఘట్టం ప్రారంభమవుతుంది. పోలీసులు గౌరవ సూచికంగా గాల్లోకి కాల్పులు జరుపుతారు. ఆ సమయంలో ఎదురకోళ్లు పైకెగురుతాయి... వందలాది కొబ్బరికాయలు పగులుతాయి. మార్గమధ్యలో చెలపెయ్య చెట్టు(ఎదురుకోళ్ల చెట్టు) వద్ద కాసేపు ఆగి ప్రత్యేక పూజలు చేసి, విశ్రాంతి తీసుకొంటారు. అనంతరం మళ్లీ ప్రయాణం ప్రారంభమవుతుంది. పూజారులు గద్దెలపైకి చేరుకొని తల్లిని ప్రతిష్టించడంతో జాతరలో మహా ఘట్టం ఆవిష్కృతమవుతుంది.

గురువారం ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్ మేడారం జాతరకు విచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా పోలీసులు భారీభద్రత ఏర్పాటుచేశారు. మరోవైపు రేపు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, కేంద్ర కేంద్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి ఓరం వస్తున్న నేపథ్యంలో గద్దెల ప్రాంగణం సమీపంలో తాత్కాలిక హెలిప్యాడ్‌లు నిర్మిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.