యాప్నగరం

టీటీడీ మండలి సమావేశంలో హైడ్రామా.. ఈవో కారుపైనే రాజీనామా లేఖరాసిచ్చిన సభ్యుడు!

ఎన్నికల కోడ్ ముగియడంతో మంగళవారం తిరుమలలోని టీటీడీ పాలక మండలి సమావేశం నిర్వహించగా, ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండానే నాటకీయ పరిణామాల మధ్య అర్ధంతరంగా ముగిసింది.

Samayam Telugu 29 May 2019, 9:27 am
ఎన్నికల కోడ్ ముగియడంతో మంగళవారం టీటీడీ పాలక మండలి సమావేశం నిర్వహించారు. అయితే, ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండానే ఈ సమావేశం నాటకీయ పరిణామాల మధ్య అర్ధాంతరంగా ముగిసింది. ప్రభుత్వం మారిన అంశాన్ని పరిగణనలోకి తీసుకోకుండా, ముందుగా నిర్ణయించిన ప్రకారం నిర్వహించిన ఈ సమావేశంపై పలువురు సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో ఉదయం 10 గంటలకు టీటీడీ ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ అధ్యక్షతన సమావేశం ప్రారంభమైన తర్వాత ప్రార్థన చేశారు. అనంతరం పాలక మండలి సభ్యుడు పొట్లూరి రమేష్‌బాబు తన రాజీనామా పత్రాన్ని ఈవో సింఘాల్‌కు అందజేశారు.
Samayam Telugu ttd


తనకు టీటీడీ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన చంద్రబాబుకు ఆయన ధన్యవాదాలు చెప్పారు. తమ పాలక మండలిని అవమానించారని, కొత్తగా వచ్చే మండలికి ఇలా జరగకుండా చూడాలని ఆయన ఉన్నతాధికారులను కోరారు. ఇకనైనా మారాలని వ్యాఖ్యానిస్తూ సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు. అయితే, ఇతర సభ్యులు ఆయనను సముదాయించి, అందరం ఒకేసారి వెళ్లిపోదామంటూ కూర్చోబెట్టారు. తమ సిఫార్సు లేఖలను ఇటీవల టీటీడీ అధికారులు పరిగణనలోకి తీసుకోకపోవడం వల్లే పొట్లూరి రమేశ్ ఈ వ్యాఖ్యలు చేశారు. మరో సభ్యుడు చల్లా రామచంద్రారెడ్డి కూడా రాజీనామా చేస్తున్నటు ప్రకటించారు.

నాటి కిరణ్‌కుమార్‌రెడ్డి నుంచి ప్రస్తుత ప్రభుత్వం వరకు గత ఎనిమిదేళ్ల నుంచి జేఈవోగా శ్రీనివాసరాజు కొనసాగుతున్నారని, ఇంకా మరో ప్రభుత్వం కోసం ఎదురు చూస్తున్నారని ఆయన విమర్శించారు. వీఐపీల సేవల్లో తరించడం తప్ప సామాన్య భక్తులకు ఏం చేశారో చెప్పాలని ఆయన నిలదీశారు. మండలి సభ్యులను అవమానపరిచేలా వ్యవహరించారని తీవ్ర స్థాయిలో చల్లా మండిపడ్డారు.

ఈ సమయంలో జోక్యం చేసుకున్న జేఈవో వ్యక్తిగత విమర్శలు చేయవద్దని అన్నారు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరుగుతుండగా ఈవో సింఘాల్‌ సమావేశం నుంచి వెళ్లిపోయారు. ఆయన వెనుకే జేఈవో, చల్లా రామచంద్రారెడ్డి కూడా బయటకు వచ్చారు. అనంతరం తన వాహనంలో వెళ్లిపోతున్న ఈవోను ఆపి, ఆయన కారు బ్యానెట్‌పైనే తన రాజీనామా పత్రాన్ని రాసి అక్కడే అందజేసి నమస్కరించి వెళ్లిపోయారు. తర్వాత పాలక మండలి అధ్యక్షుడు పుట్టా సుధాకర్‌ యాదవ్‌, ఇతర సభ్యులు.. అధికారులు లేకుండా సమావేశం నిర్వహించలేమంటూ వాయిదా వేసి వెళ్లిపోతున్నట్టు ప్రకటించారు.

మరోవైపు, సెంటిమెంటు దృష్ట్యా తాము రాజీనామా చేయదలచుకోలేదని, తమ పాలకమండలి కొనసాగింపు వ్యవహారం కొత్త ప్రభుత్వం నిర్ణయానికి వదిలేస్తున్నామని ఛైర్మన్‌ పుట్టా సుధాకర్‌యాదవ్‌ పేర్కొన్నారు. ఈ పాలకమండలిని కొత్త ప్రభుత్వం రద్దు చేస్తే తమకు అభ్యంతరం లేదని, దర్శనం టిక్కెట్ల కోసం పదవులు అంటిపెట్టుకోవడం లేదని స్పష్టం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.