యాప్నగరం

గీతలోని అక్షరపరబ్రహ్మ యోగం చెప్పేది ఇదే!

మహాభారతం భీష్మ పర్వంలోని కొన్ని అధ్యాయాలు భగవద్గీతగా ప్రసిద్ధి చెందాయి. ఇందులోని 25 నుంచి 42 వరకు ఉన్న 18 అధ్యాయాలను ఒక ప్రత్యేక గ్రంథంగా మన భావిస్తున్నాం.

Samayam Telugu 5 Dec 2022, 5:25 pm
భగవద్గీతలోని ఎనిమిదో అధ్యాయం అక్షరపరబ్రహ్మ యోగం. వాస్తవానికి మహాభారతం భీష్మ పర్వంలోని కొన్ని అధ్యాయాలు భగవద్గీతగా ప్రసిద్ధి చెందాయి. ఇందులోని 25 నుంచి 42 వరకు ఉన్న 18 అధ్యాయాలను ఒక ప్రత్యేక గ్రంథంగా మన భావిస్తున్నాం. మహాభారత సంగ్రామం ప్రారంభంలో సాక్షాత్తు కృష్ణ భగవానుడు అర్జునునికి బోధించిన జ్ఞానమే గీత. కాబట్టి ఇది హిందువులకు పరమ పవిత్ర గ్రంథంగా విరాజిల్లుతోంది. భగవద్గీతలో వేద, వేదాంత, యోగ విశేషాలున్నాయని నమ్మకం. భగవద్గీతను ‘గీత’అని, ‘గీతోపనిషత్తు’ అనే పేర్లతోనూ పిలుస్తారు. దీనిలో భగవంతుని తత్వం, ఆత్మ తత్వం, జీవన గమ్యం, గమ్యసాధనా విధానం గురించి భగవానుడు ఉపదేశించాడు.
Samayam Telugu gita

PC : Unsplash

కృష్ణా.. బ్రహ్మం, అధ్యాత్మం, కర్మ, అధిభూతం, అధిదైవం అంటే ఏంటి?ఈ దేహంలో అధియజ్ఞుడు అంటే ఎవరు?అతడెలా ఉంటాడు?యోగులు మరణ సమయంలో నిన్ను ఏ విధంగా తెలుసుకుంటారని అర్జునుడి అడిగాడు. దీనికి భగవానుడు... నాశనంలేనిదీ, సర్వోత్కృష్టమైనది బ్రహ్మం... ప్రకృతి సంబంధమైన స్వభావాలే అధ్యాత్మం... భూతాల ఉత్పత్తికైన సంఘటనే ధర్మం. నాశనమయ్యే పదార్థం అధిభూతం. పురుషుడు అధిదైవతం. అంతర్యామినైన నేనే అధియజ్ఞుడినని తెలియజేశాడు.

మరణానికి మందు కూడా తనను తలచుకుంటూ శరీరాన్ని విడిచినవారు మళ్లీ నన్నే పొందుతారు... మానవుడు అంత్యకాలంలో ఏ భావంతో మరణిస్తాడో ఆ భావాన్నే తిరిగి పొందుతాడు.. కాబట్టి నన్నే స్మరిస్తూ యుద్ధం చేయమని కార్యోన్ముఖుని చేశాడు. అన్యచింతనలు లేని మనసుతో పరమాత్మను ధ్యానించేవాడు అతడినే పొందుతాడని ఉపదేశించాడు.

ఎవరైతే అంత్యకాలంలో ప్రాణవాయువును భూమధ్యంలో నిలిపి పరమాత్మున్ని ధ్యానిస్తారో వారు ఆ పరమాత్ముని సన్నిధికి చేరుకుంటారు. నవద్వారాలను బంధించి, ఇంద్రియాలను నిగ్రహించి, మనోవృత్తులను నిరోధించి, ప్రాణాన్ని బ్రహ్మరంధ్రంలో నిలిపి ఓంకారాన్ని ధ్యానిస్తూ, నన్ను స్మరిస్తూ మరణించేవాడు పరమపదాన్ని పొందుతాడని భగవానుడు తెలిపాడు. ఇతర అలోచనలు లేకుండా నన్నే స్మరిస్తూ నమ్ముకున్నవాడికి పునర్జన్మ ఉండదని, భగవంతుని సన్నిధిని పొందుతాడని తెలియజేశాడు.

బ్రహ్మలోకం వరకూ పునర్జన్మ ఉందికానీ నన్నుచేరినవారికి లేదు. బ్రహ్మకు వేయి యుగాలు ఒక పగలు, వేయి యుగాలు ఒక రాత్రి. పగటి కాలంలో పుట్టిన ప్రకృతి రాత్రికాలంలో లయమవుతుందని, సకల ప్రాణకోటి కూడా అలాగే నశిస్తుంది కానీ, ప్రకృతికి అతీతమైన, శాశ్వతమైన పరబ్రహ్మం మాత్రం నశించదు. అదే నా నివాస స్థానం.అది ఇంద్రియాలకు గోచరం కాదు... జగత్తు అంతా వ్యాపించి ఉన్న పరమాత్మ భక్తసులభుడు.

అగ్ని, జ్యోతి, పగలు, శుక్లపక్షం, ఉత్తరాయణ మార్గాలలో జన్మించినవారు పరబ్రహ్మను పొంది పునర్జన్మను పొందరు. పొగ, రాత్రి, కృష్ణపక్షం, దక్షిణాయనంలో మరణించినవారు తిరిగి జన్మిస్తారు. ఇవన్నీ తెలిసిన యోగి భ్రాంతి చెందడు... గ్రహించిన జ్ఞాన వేద, యజ్ఞ, జపతపాదుల వల్ల కలిగే పుణ్యస్థానాన్ని అధిగమించి శాశ్వత బ్రహ్మపదాన్ని పొందుతాడని అర్జునుడికి భగవానుడు కర్తవ్యాన్ని బోధించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.