యాప్నగరం

Eid ul Fitr: ఘనంగా ఈద్ వేడుకలు.. దేశ ప్రజలకు ప్రముఖుల శుభాకాంక్షలు

దేశవ్యాప్తంగా ముస్లిం సోదరులు ఈదుల్-ఫితర్ పండుగను ఘనంగా జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు.

Samayam Telugu 16 Jun 2018, 10:02 am
Samayam Telugu eid
దేశవ్యాప్తంగా ముస్లిం సోదరులు ఈదుల్-ఫితర్ పండుగను ఘనంగా జరుపుకొంటున్నారు. మసీదుల్లో వేలాది మంది ప్రార్థనలు జరిపారు. కుటుంబ సభ్యులు, మిత్రులతో ఆనందోత్సాహలతో పండుగ చేసుకుంటున్నారు. ఈదుల్ ఫితర్ సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘దేశ ప్రజలకు ముఖ్యంగా దేశ విదేశాల్లోని ముస్లిం సోదర సోదరీమణులకు ఈద్ శుభాకాంక్షలు. ఈ వేడుక మీ కుటుంబాల్లో ఆనందోత్సాహాలు నింపాలి. సమాజంలో సోదరభావం, ఒకరినొకరు అర్థం చేసుకునే తత్వం పెరగాల’ని రాష్ట్రపతి ఆకాంక్షించారు. ఇంగ్లిష్, హిందీ, ఉర్దూ భాషల్లో రాష్ట్రపతి ట్వీట్ చేశారు.

ప్రధాని నరేంద్ర మోదీ, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు దేశ ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈద్ ముబారక్.. ఈ రోజు మన సమాజంలో ఐక్యత మరింత పెరగాలని, సామరస్యం వెల్లివిరియాలని ప్రధాని ఆకాంక్షించారు.

ముస్లిం సోదరులకు తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఈదుల్ ఫితర్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్‌ పర్వదినం ఐక్యత, సోదర భావానికి ప్రతీక అని సీఎం కేసీఆర్ చెప్పారు.

ముస్లిం సోదర, సోదరీమణులకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ‘సర్వమత సమ్మేళనానికి ప్రతీకగా జరుపుకునే ఈ పండుగ అందరి జీవితాల్లో సంతోషం, శాంతి సందేశం నింపాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ముస్లింల సర్వతోముఖాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేస్తున్నాన’ని ఆయన ట్వీట్ చేశారు. ఈదుల్ ఫితర్ సందర్భంగా ఆయన ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.