యాప్నగరం

తిరుమలలో కార్తీక దీపోత్సవం.. దేదీప్యమానంగా శ్రీవారి ఆలయం

తిరుమలలో కార్తీక దీపోత్సవం కన్నుల పండువగా సాగింది. దీప వెలుగుల్లో శ్రీవారి ఆలయం వెలిగిపోయింది.

Samayam Telugu 22 Nov 2018, 11:55 pm
లియుగ వైకుంఠం, తిరుమల శ్రీ వెంకటేశ్వర ఆలయంలో గురువారం (నవంబర్ 22) కార్తీకపర్వ దీపోత్సవం కన్నులపండువగా జరిగింది. ఏటా కార్తీక మాసంలో పౌర్ణమి రోజున నిర్వహించే వేడుకకు వైభవోపేతంగా ఏర్పాట్లు చేశారు. దీప ప్రతిమల వెలుగులో శ్రీవారి ఆలయం దేదీప్యమానంగా వెలిగింది. శ్రీవారికి సాయంకాల కైంకర్యాలు, నివేదనలు పూర్తి చేసిన అనంతరం ఈ దీపోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్తీక దీపోత్సవానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్.వి. రమణ సతీ సమేతంగా హాజరయ్యారు.
Samayam Telugu Ramana


కార్యక్రమంలో భాగంగా సాయంత్రం 5.00 గంటల నుంచి 8.30 గంటల వరకు నేతితో దీపాలను వెలిగించి ఛత్రచామర, మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణం గావించి, ఆనందనిలయంలో శ్రీవారికి హారతి ఇచ్చారు. ఆ తర్వాత గర్భాలయంలో కార్తీక దీపాలు వెలిగించారు.

అనంతరం అఖండం, కులశేఖరపడి, రాములవారిమేడ, ద్వారపాలకులు, గరుడాళ్వారు, వరదరాజస్వామి సన్నిధి, వకుళామాత, బంగారుబావి, కల్యాణ మండపం, సబేరా, తాళ్లపాక అర, భాష్యకారుల సన్నిధి, యోగ నరసింహస్వామి, విష్వక్సేనులు, చందనం అర, పరిమళం అర, వెండివాకిలి, ధ్వజస్తంభం, బలిపీఠం, క్షేత్రపాలకుల సన్నిధి, తిరుమలరాయ మండపం, పూలబావి, రంగనాయక మండపం, మహాద్వారం, బేడి ఆంజనేయ స్వామి, శ్రీవరాహ స్వామి ఆలయం, స్వామి పుష్కరిణి వద్ద దీపాలు వెలిగించారు.

కార్తీక దీపోత్సవం


Also Read: కోటి దీపోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా పవన్ కళ్యాణ్

తిరుమల శ్రీవారి ఆలయం


కార్తీక పౌర్ణమి నేపథ్యంలో గురువారం సాయంత్రం శ్రీవారి ఆలయంలో సహస్ర దీపాలంకరణ సేవను రద్దు చేశారు. కార్తీక పర్వ దీపోత్సవాన్ని పురస్కరించుకుని పౌర్ణమి గరుడ సేవను కూడా రద్దు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.