యాప్నగరం

ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవాలు.. మోహినీ అవతారంలో కోదండరాముడు

కోదండరాముడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు బుధ‌వారం ఉదయం మోహినీ అలంకారంలో జగన్మోహనాకారుడిగా శ్రీరామచంద్రమూర్తి దర్శనమిచ్చారు.

Samayam Telugu 17 Apr 2019, 2:00 pm
ఒంటిమిట్టలోని శ్రీకోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు బుధ‌వారం ఉదయం మోహినీ అలంకారంలో జగన్మోహనాకారుడిగా శ్రీరామచంద్రమూర్తి దర్శనమిచ్చారు. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు స్వామివారి ఊరేగింపు కనుల పండువగా జరిగింది. భక్తజన బృందాలు చెక్క భజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా సాగింది. భక్తులు అడుగడుగునా నీరాజనం పలుకుతూ స్వామిని దర్శించుకున్నారు.
Samayam Telugu In-form-of-Mohini-682x1024


మోహినీ అవతారం గురించి భాగవతంలో రమణీయంగా వర్ణించారు. అమృతం కోసం క్షీరసాగరాన్ని దేవతలు, రాక్షసులు కలిపి మథిస్తారు. మందరగిరి పర్వతాన్ని కవ్వంగా, వాసుకిని తాడుగా చేసుకుని పాల సముద్రాన్ని మథించగా వారు కోరుకున్న అమృతం లభించింది. దీని పంపకాల విషయంలో ఇరువురి మధ్య వివాదం ఏర్పడటంతో ఈ సమస్య పరిష్కారానికి శ్రీమన్నారాయణుడు మోహిని రూపం ధరించాడు. రాక్షసులకు మాయలో పడేసి దేవతలకు అమృతాన్ని పంచడానికి మోహినీ రూపంతో సాక్షాత్కరించాడు. తన భక్తులు కానివారు ఆ మాయాధీసులు కాక తప్పదనీ, తనకు ప్రసన్నులైనవారు మాయను సులభంగా దాటగలరనీ ఈ మోహినీ రూపంలో స్వామి ప్రకటిస్తున్నాడు.

స్వామివారి ఊరేగింపు అనంతరం ఉదయం 11 నుంచి 12 గంటల వరకు గర్భాలయంలో స్నపనతిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, చందనంతో స్వామి, అమ్మవారికి అభిషేకం చేశారు. సాయంత్రం ఊంజల్‌సేవ వైభవంగా జరగనుంది. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు బుధ‌వారం రాత్రి గరుడ వాహనంపై స్వామి భక్తులకు దర్శనమిస్తారు. శ్రీహరికి గరుత్మంతుడు నిత్యవాహనం. దాసుడుగా, సఖుడుగా, విసనకర్రగా, చాందినిగా, ఆసనంగా, ఆవాసంగా, వాహనంగా ధ్వజంగా అనేక విధాల సేవలందిస్తున్న నిత్యసూరులలో అగ్రగణ్యుడైన వైనతేయుడు కోదండరామస్వామిని వహించి కదిలే తీరు సందర్శనీయమైనది. 108 దివ్య దేశాలలోనూ గరుడ సేవ విశిష్టమైనది.

బ్రహ్మోత్సవాల్లో టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ధార్మిక, సంగీత కార్యక్రమాలు భక్తిభావాన్ని పంచాయి. ఉదయం ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో మంగళధ్వని, ధార్మికోపన్యాసం చేశారు. సాయంత్రం ఊంజల్‌సేవలో క‌డ‌ప‌కు చెందిన వాణిశ్రీ‌ బృందం భక్తి సంకీర్తనలు, భాగవతార్‌ హరికథ వినిపిస్తారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.