యాప్నగరం

పరిమితితోనే పరమానందం...!

ఆధునిక కాలంలో మానవ జీవితమంతా ధనార్జనతోనే గడిచిపోతోంది. పోనీ సంపాదించిన దాన్ని సక్రమంగా ఖర్చుపెడుతున్నారా అంటే అదీ సందేహమే! ఏ వస్తువునూ అవసరానికి మించి కోరుకోరాదు.

Samayam Telugu 4 Jun 2018, 6:10 pm
ఆధునిక కాలంలో మానవ జీవితమంతా ధనార్జనతోనే గడిచిపోతోంది. పోనీ సంపాదించిన దాన్ని సక్రమంగా ఖర్చుపెడుతున్నారా అంటే అదీ సందేహమే! ఏ వస్తువునూ అవసరానికి మించి కోరుకోరాదు. ఒక వస్తువును కొన్నప్పుడు, బేరమాడి ఎంతకు కొనవచ్చో అంతే ధర చెల్లిస్తాం. కానీ ఆవస్తువు మనకు అవసరమా, కాదా అని ఆలోచించం? వస్తు సముదాయాన్ని వృధా చేసుకుంటూ పోతే సుఖపడతామనుకోవడం భ్రమ. జీవితం సుఖంగా సాగాలంటే కొన్ని ముఖ్యమైన వస్తువులుంటే చాలు. ఈ విషయాన్ని గుర్తించగలిగితే మన ఆచారాలు, సంప్రదాయాలు వదలుకొని దేశాంతరాలకు వెళ్లి విస్తార ధనార్జన చేయాల్సిన అవసరం ఉండదు. ఆత్మవిచారం, భగవత్ ధ్యానం, పరోపకారానికీ తగిన సమయం కావాలంటే, అవసరాలకు మించి వస్తువులను సముపార్జించే లక్ష్యాన్ని వదిలిపెట్టాలి. మనిషి రెండు విధాలుగా కాలాన్ని వృధా చేస్తున్నాడు. ఒకటి ధనార్జన, రెండోది సంపాదించింది రక్షించడం కోసం.
Samayam Telugu లక్ష్మీదేవి అనుగ్రహం


ఈ రెండింటి నుంచి మనస్సును కాస్త మళ్లించగలిగితే, ఆత్మ తుష్టికరమైన సాధన చేసి జీవితాన్ని శాంతంగా, సుఖంగా, ఆనందంగా గడపవచ్చు. ఈ పొదుపు వస్తువుల విషయంలోనే కాదు సంభాషణల్లోనూ అలవరచుకోవాలి. పదిమాటల్లో చెప్పాల్సిన విషయాన్ని ఒక్కమాటలో చెప్పగల సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి. ఈ విధమైన వాచాసంయమనం కలిగినప్పుడే బుద్ధిలో తీక్షణం, వాక్కులో ప్రకాశం చూడగలం. మన వాక్కులు వ్యర్థం కాకూడదు. ‘మౌనేన కలహం నాస్తి’: మౌనం వల్ల కలహాలకు అవకాశమే ఉండదు.. మితభాషణం వల్ల మనశ్శాంతి, ఆత్మశ్రేయస్సూ వృద్ధిచెందుతాయి. నేటి కాలంలో మనం చూస్తున్నదంతా వాగాడంబరమే!. పొదుపు ఒక్క చేతల్లోనే కాకుండా మాటల్లో కూడా ఉండాలి. భాషణంలో కూడా పరిమితిని పాటిస్తే ప్రశాంతంగా ఉండగలం.

‘దాతృత్వంతోనే లక్ష్మీకటాక్షం’ కోరికలన్నీ సంకల్పం వల్లే ఉద్భవిస్తున్నాయి. కొత్త సంకల్పం ఉదయించకుండా చూసుకుంటే కోరికలూ క్రమక్రమంగా క్షీణిస్తాయి. కోరికలు క్షీణించే కొద్దీ మన కార్యక్రమాలు, ధనార్జన, వస్తు సంపాదన తగ్గుతుంది. సంకల్పాలు క్షీణించాలంటే సద్వస్తువులపై దృష్టి నిలపాలి. అప్పుడు చిత్తవృత్తులు సమసిపోయి, ఏకాగ్రత సిద్ధిస్తుంది. ఏకాగ్రతకు అపరిగ్రహం అత్యవసరం. మనం సంపాదించే ధనమంతా స్వార్థం కోసమే కాక దానధర్మాలకూ వెచ్చించాలి. సమాజంలోనే సత్కార్యాల కోసం దానధర్మాలు చేసే గొప్పవారు చాలా మంది ఉన్నారు. లోకంలో చాలా మంది దరిద్రం అనుభవిస్తుంటే ధనాన్ని మనం వృధా చేయడం పాపం. మన దగ్గరున్న ధనంతో దీనుల దుఃఖాశ్రువులను తొలగించగలిగితే అంతకన్నా పుణ్యకార్యం వేరే ఉండదు. సంపద ఉండగానే సరిపోదు.. దానిని సద్వినియోగం చేస్తున్నామా? పరోపకారానికి అది ఉపయోగపడుతుందా? దీనజనోద్ధరణకు సహాయపడుతుందా? అని జాగ్రత్తగా గమనించాలి. సంపద ఇలా సద్వినియోగమయ్యే కొద్దీ మనకు లక్ష్మీకటాక్షం కూడా సమృద్ధిగా లభిస్తుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.