యాప్నగరం

మదర్ థెరేసాకు సెయింట్ హోదా ఖరారు

ప్రపంచ నిరుపేదలకు తల్లిగా పేరొందిన మదర్ థెరెసాకు సెయింట్ హుడ్ (పునీతురాలు లేదా దైవదూత) అధికారికంగా ఖాయమైంది

TNN 15 Mar 2016, 5:42 pm
ప్రపంచ నిరుపేదలకు తల్లిగా పేరొందిన మదర్ థెరెసాకు సెయింట్ హుడ్ (పునీతురాలు లేదా దైవదూత హోదా) అధికారికంగా ఖాయమైంది. ఈ ఏడాది సెప్టెంబర్ 4వ తేదీన జరిగే కార్యక్రమంలో ఆమెకు సెయింట్ హుడ్ ఇవ్వాలని నిర్ణయించినట్లు వాటికన్ సిటీ మంగళవారం ప్రకటించింది. 1910వ సంవత్సరంలో ఒకప్పటి ఒట్టోమన్ సామ్రాజ్యంలో (ఇప్పటి మాసిడోనియా)లో ఆగ్నస్ గోన్షా బొజాక్షువాగా అల్బేనియన్ దంపతులకు జన్మించిన మదర్ చిన్నవయసులోనే సన్యాసినిగా మారి భారత్ చేరుకున్నారు. మిషనరీస్ ఆఫ్ చారిటీని స్థాపించి మదర్ థెరేసా ఆఫ్ కోల్కతాగా పేరుపొందారు. ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా ప్రపంచపు అత్యున్నత పురస్కారం నోబెల్ శాంతి బహుమతి ఆమెకు వరించింది. ఆ తరువాత మన దేశం ఆమెకు భారత రత్న ఇచ్చి గౌరవించుకుంది. 1997వ సంవత్సరంలో 87 సంవత్సరాల నిండు వృద్ధాప్యంలో ఆమె మరణించేవరకు నిరుపేదల సేవలో తరిస్తూనే ఉన్నారు. ప్రపంచంలో ఏ ఒక్కరిని అడిగినా మదర్ థెరేసా అంటే ఎవరో ఇట్టే తడుముకోకుండా చెప్పేస్తారు. అంతటి అంతర్జాతీయ పేరు ప్రఖ్యాతులను మదర్ థెరేసమ్మ సంపాదించుకున్నారు. ఆమెకు ఎప్పటి నుండో సెయింట్ హుడ్ ఇవ్వాలని క్రైస్తవులు కోరుతున్నారు. కేథలిక్ క్రైస్తవ సంప్రదాయం ప్రకారం సెయింట్ హుడ్ ఇచ్చే ప్రక్రియ చాలా సుదీర్ఘమైనది. కొంతమందికి వారు చనిపోయిన శతాబ్దాల తరువాత కూడా సెయింట్ హోదా ఇచ్చిన సందర్భాలున్నాయి. అంత సుదీర్ఘంగా, క్లిష్ఠంగా ఆ ప్రక్రియ ఉంటుంది. వారితో పోల్చితే మదర్ థెరేసాకు చాలా తక్కువ సమయంలోనే సెయింట్ హోదా లభించినట్లే. ఎవరికైనా సెయింట్ హోదా ఇవ్వాలంటే వారు చనిపోయిన తరువాత కొన్ని అద్భుతాలు చేసి ఉండాలనేది వాటికన్ నిబంధన. మదర్ చనిపోయిన తరువాత నుండి ఇప్పటి వరకు చాలా అద్భుతాలు చేశారని అంటున్నారు. వాటిలో ప్రముఖమైన రెండింటిని వాటికన్ గుర్తించిందని పోప్ కార్యాలయ వర్గాలు తెలిపాయి. దీంతో ఆమెకు సెయింట్ హోదా ఖరారయ్యిందని చెప్పాయి.
Samayam Telugu pope francis approves mother teresas elevation to sainthood
మదర్ థెరేసాకు సెయింట్ హోదా ఖరారు


తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.