యాప్నగరం

చీరను ఎత్తుకెళ్లింది సూర్యలతే.. పాలకమండలి నుంచి తొలగింపు

విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో తరుచూ వివాదాలు చోటుచేసుకోవడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. అమ్మవారి ఆలయంలో నిర్వహణ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.

Samayam Telugu 10 Aug 2018, 9:09 am
విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో తరుచూ వివాదాలు చోటుచేసుకోవడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. అమ్మవారి ఆలయంలో నిర్వహణ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. నాలుగు రోజుల కిందట అమ్మవారికి ఒక భక్తురాలు సమర్పించిన ఖరీదైన చీర కనపడకపోవడం, స్వయంగా పాలకమండలి సభ్యురాలిపైనే ఆరోపణలు రావడంతో తీవ్ర వివాదం చెలరేగింది. దుర్గగుడిలో ఆషాడ మాసం సందర్భంగా అమ్మవారికి సారె సమర్పించే కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. ఇందులో భాగంగా ఉండవల్లికి చెందిన పద్మజ అనే భక్తురాలు ప్రత్యేకంగా నేయించిన రూ.18 వేలు విలువైన చీరను అమ్మవారికి సారెగా తీసుకుని వచ్చింది. ఆగస్టు 5 న మల్లికార్జున మహామండపం ఆరో అంతస్థులో అమ్మవారి ఉత్సవ విగ్రహం వద్ద ఈ చీరను ఉంచి పూజలు నిర్వహించి సమర్పించారు.
Samayam Telugu అమ్మవారి చీర మాయం


భక్తురాలి కోరిక మేరకు అర్చకులు అమ్మవారి ఉత్సవ విగ్రహంపై చీర ఉంచి ఆ తర్వాత పక్కన పెట్టారు. కాసేపటికే చీర మాయమైంది. దీనిపై ఆరా తీయగా పాలకమండలి సభ్యురాలు కోడెల సూర్యలత తీసుకెళ్లినట్టు తేలింది. దీంతో పాలక మండలి సభ్యురాలి పదవి నుంచి ఆమెను తొలగిస్తూ దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శి మన్మోహన్‌ సింగ్‌ గురువారం ప్రత్యేక జీవో విడుదల చేశారు. మల్లికార్జున మహా మండపంలో సమర్పించిన చీరను దేవస్థానం స్వీకరించినట్లు రసీదు ఇవ్వక పోవడం, దానిని పాలక మండలి సభ్యురాలు తమ కళ్లముందే తీసుకెళ్లడంపై విచారణ జరిపించాలని ఈవో పద్మ, పాలక మండలి ఛైర్మన్‌ గౌరంగబాబుకు భక్తురాలు లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు.

ఈ నేపథ్యంలో చీర అదృశ్యం కావడం వెనక ఉన్న పాత్రపై ఈవో పూర్తి స్థాయి విచారణ జరిపి నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. వైదిక కమిటీ సభ్యుల సమక్షంలో చీరల విభాగానికి చెందిన నాగమణి నుంచి సూర్యలత చీరెను తీసుకువెళ్లినట్లు తేలింది. దాంతో ఆమెను పదవి నుంచి 1987 ఎండోమెంట్స్‌ యాక్టు సెక్షన్‌ 28 ప్రకారం తొలిగించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉత్తర్వు కాపీలను దేవాదాయ శాఖ కమిషనర్‌, దుర్గగుడి ఈవో, ఛైర్మన్‌లకు పంపినట్లు జీవోలో పేర్కొన్నారు. చీరను సూర్యలత తీసుకెళ్లినట్టు ఆరోపణలు రావడంతో నిజాలు నిగ్గుతేలేవరకు ఆలయనానికి రావొద్దని, ధర్మకర్తల మండలి కార్యకలాపాలకు దూరంగా ఉండాలని చైర్మన్‌ గౌరంగబాబు బుధవారం ఆదేశించిన విషయం తెలిసిందే. విచారణలో ఆమే దొంగిలించినట్టు తేలడంతో పదవి నుంచి తప్పించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.