యాప్నగరం

శ్రీకాళహస్తి ఆలయానికి కాంగ్రెస్ నేత రూ.15 కోట్ల భారీ విరాళం!

పరమ శివభక్తుడైన కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత తన ఇంటితోపాటు కమర్షియల్ కాంప్లెక్స్‌ను శ్రీకాళహస్తి ఆలయానికి చెందేలా శుక్రవారం రిజిస్ట్రేషన్ చేయించడం విశేషం.

Samayam Telugu 14 Oct 2019, 9:49 am
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఆలయానికి కాంగ్రెస్ సీనియర్ నేత భారీ విరాళం అందజేశారు. మొత్తం రూ.15 కోట్లు విలువైన తన నివాసం, కమర్షియల్ కాంప్లెక్స్ సహా ఖాళీ స్థలాన్ని ముక్కంటి ఆలయానికి విరాళంగా ఇచ్చారు. తమిళనాడు పొన్నేరి సమీపంలోని మీంజూరుకు చెందిన కాంగ్రెస్‌ నేత వీఆర్‌ భగవాన్‌ ఈ మేరకు రిజిస్ట్రేషన్ చేయించారు. మీంజూరులోని తన ఇల్లు, వ్యాపార భవన సముదాయం, దాని వెనుక ఉన్న ఖాళీ స్థలాన్ని పొన్నేరి రిజిస్ట్రార్‌ కార్యాలయంలో శ్రీకాళహస్తి ఆలయం పేరిట శుక్రవారం రిజిస్టర్‌ చేయించడం విశేషం.
Samayam Telugu SRIKALAHASTI (1)


త్వరలోనే ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, ఆస్తులకు సంబంధించిన పత్రాలను ఆలయ అధికారులకు అందజేయనున్నట్టు ఆయన తెలిపారు. ఈ మొత్తాన్ని ఆలయ అభివృద్ధికి, వివిధ ధార్మిక కార్యక్రమాలకు వినియోగించాలని ఆయన సూచించారు. శివభక్తుడైన వీఆర్ భగవాన్‌ ద్వాదశ జ్యోతిర్లింగాలను పలుసార్లు సందర్శించారు. తమిళనాడులో 30కి పైగా ఆలయాలను కూడా నిర్మించారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో శ్రీకాళహస్తీశ్వరాలయం నిత్యాన్నదాన పథకానికి ఓ దాత భారీ విరాళం అందజేసి, తన గొప్ప మనసు చాటుకున్న విషయం తెలిసిందే. శ్రీకాళహస్తి పాత వరదయ్యపాళెం రోడ్డులో నివాసముంటోన్న యు.సుబ్రహ్మణ్యం, రాధిక దంపతులు రూ.1,11,11,112 విరాళంగా అందజేశారు. తల్లిదండ్రులు వెంకటసుబ్బయ్య, రామలక్ష్మమ్మ జ్ఞాపకార్థం ఈ విరాళం అందజేస్తున్నట్లు సుబ్రమణ్యం తెలిపారు. ఈ మొత్తానికి సంబంధించిన చెక్కును ఆలయ ఈవోకు అందజేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.