యాప్నగరం

దశావతార వేంకటేశ్వరస్వామి విగ్రహం.. ప్రత్యేకతలివే

అవతారం అంటే దిగి రావడం... దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం శ్రీమహావిష్ణువు భూమిపై అవతరించాడు. ఆయన 21 అవతారాలలో అతి ముఖ్యమైన దశావతారాలు.

Samayam Telugu 22 Jun 2018, 1:51 pm
ఏకశిలతో శ్రీమహావిష్ణువు ఏకాదశ రూపాలు కలిగిన 11 అడుగుల ఎత్తైన దశావతార వేంకటేశ్వరస్వామి విగ్రహాన్ని గుంటూరు సమీపంలోని లింగమనేని టౌన్‌షిప్‌లో శుక్రవారం ప్రతిష్ఠించారు. దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి చేతుల మీదుగా విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం జరిగింది. ఈ దశావతార విగ్రహం భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. అవతారం అంటే దిగి రావడం... దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం శ్రీమహావిష్ణువు భూమిపై అవతరించాడు. ఆయన 21 అవతారాలలో అతి ముఖ్యమైన దశావతారాలు. శ్రీహరి దశావతారాలకు వేర్వేరుగా ఆలయాలు ఉన్నా, అత్యధికంగా నారసింహా, శ్రీకృష్ణ, శ్రీరాముడు, వెంకటేశ్వర క్షేత్రాలే అత్యధికంగా దర్శనమిస్తాయి. కూర్మవతారానికి సంబంధించి ప్రపంచంలో కూర్మనాథ ఆలయం ఒక్కటే ఉంది. మిగతా అవతారాలకు దేవాలయాల సంఖ్య చాలా స్వల్పమని చెప్పవచ్చు.
Samayam Telugu దశావతార వేంకటేశ్వర స్వామి


మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, నృసింహావతారం, వామనావతారం, పరశురామావతారం, రామావతారం, కృష్ణావతారం, వేంకటేశ్వరవతారం, కల్కి అవతారాలు.. ఈ దశావతారాలను ఒకే విగ్రహంలో ఉండేలా శ్రీవెంకటేశ్వరుని రూపంలో మలిచారు. ప్రపంచంలో మరెక్కడా ఈ దివ్య మంగళ స్వరూపం మనకు కనిపించదు. అందుకే ఈ దశావతార వేంకటేశ్వరస్వామి ఆలయం విశిష్టతను సంతరించుకుంది.

శ్రీవారి పాదాలతోనూ, మోకాళ్ల వరకూ మత్స్యావతారంలో, నడుము వరకూ కూర్మావతారంలోనూ దర్శనమిస్తుంది. శ్రీనివాసుడు, నృసింహ, వరాహ అవతారాలతో త్రిముఖం.. విగ్రహం ఎనిమిది చేతుల్లో వామనావతారానికి సూచికగా ఒక చేత్తో గొడుగు, రామావతారానికి సూచికగా బాణం, విల్లుమ్ములు, పరశురామావతారానికి సూచికగా గండ్రగొడ్డలి, కృష్ణావతారానికి సూచికగా నెమలి పింఛం, కల్కి అవతారానికి సూచికగా ఖడ్గం.. విష్ణుమూర్తి చేతిలో ఉండే శంఖు, చక్రాలు మరో రెండు చేతులకు అలంకరించారు.

ఆగమశాస్త్రం ప్రకారం ఆలయం నిర్మాణం మొత్తం స్వామీజీ పర్యవేక్షణలోనే సాగింది. స్వామి వారి రూపాన్ని చిత్రలేఖనం ద్వారా శిల్పి రమణ గీయగా.. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన శిల్పి వి. సుబ్రమణ్య ఆచార్యులు.. రాతితోనే ఈ ఆలయాన్ని నిర్మించారు. భూదేవిసమేత దశావతార వేంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, గణపతి, విష్వక్సేనాళ్వార్‌, గరుడాళ్వార్‌, హయగ్రీవాచార్యుల విగ్రహాలను కోయంబత్తూరు సమీపంలోని తిరుమురుగన్‌ పూండికి చెందిన స్థపతి కనకరత్నం అద్భుతంగా మలిచారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.