యాప్నగరం

భక్తులకు అందుబాటులోకి జూబ్లీహిల్స్ శ్రీవారి ఆలయం.. వైభవంగా కుంభాభిషేకం

హైదరాబాద్‌లో తిరుమల తిరుపతి దేవస్థానం రూ.28 కోట్ల వ్యయంతో జూబ్లీహిల్స్ రోడ్డు నెంబరు 92లో నిర్మించిన రెండో ఆలయం ప్రతిష్ఠాపన మహోత్సవం మార్చి 8 నుంచి 13 వరకు జరిగింది.

Samayam Telugu 13 Mar 2019, 12:44 pm
హైదరాబాద్‌లో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మించిన రెండో శ్రీవారి ఆలయం బుధవారం నుంచి భక్తులకు అందుబాటులోకి వచ్చింది. ఫిలింనగర్‌లో రూ.28 కోట్ల వ్యయంతో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఈ ఆలయాన్ని నిర్మించారు. బుధవారం తెల్లవారుజామున 2.30 గంటల నుంచి సుప్రభాతం, కుంభారాధన, నివేదన, హోమం, మహాపూర్ణాహుతి నిర్వహించారు. ఉదయం 5.30 నుంచి 6 గంటల వరకూ కుంభాలను, ఉత్సవమూర్తులను ఊరేగింపుగా ఆయా సన్నిధుల్లోకి వేంచేంపు చేశారు. అనంతరం వైఘానస ఆగమన ప్రకారం 6 గంటల నుంచి 7.30 వరకు మీన లగ్నంలో మహాకుంభాభిషేకం వైభవంగా జరిగింది. తర్వాత స్వామివారికి బ్రహ్మఘోష, ధ్వజారోహణం, అర్చక బహుమానం, నిత్య కైంకర్యాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టీటీడీ పాలకమండలి సభ్యులు కూడా పాల్గొన్నారు.
Samayam Telugu jubilee-hills-ttd-temple


ఈ సందర్భంగా టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ.. శ్రీవారి ఆలయ ప్రతిష్ఠాపన మహోత్సవాలకు మార్చి 8న అంకురార్పణం చేశామని తెలిపారు. ఈ కార్యక్రమాలను వేదపండితులు ఓ క్రమపద్దతిలో నిర్వహించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే ఈ ఉత్సవాలను విజయవంతం చేయడానికి ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్, ఎస్వీబీసీ సిబ్బంది తమ వంతు పాత్ర పోషించారని అభినందించారు. కొత్తగా నిర్మించిన ఆలయంలో కొన్ని ఆర్జిత సేవలను త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు.

హైదరాబాద్‌లో టీటీడీ నిర్మించిన రెండో ఆలయం ఇది. జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 92లో రూ.28 కోట్ల వ్యయంతో 2016 ఆగస్టు 10న ఈ ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సుమారు మూడున్నర ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ.17 కోట్ల టీటీడీ నిధులతో శ్రీవారి ఆలయాన్ని పోలిన రూపంతో నిర్మించారు. మరో రూ.6 కోట్ల రహదారులు, పార్కింగ్, అర్చకుల నివాసాలు, ఇతర నిర్మాణాలకు కేటాయించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.