యాప్నగరం

Tirumala: నేటి నుంచి శ్రీవారి వసంతోత్సవాలు.. పలు ఆర్జిత సేవలు రద్దు

వేసవికాలంలో వసంత రుతువులో శ్రీమలయప్పస్వామికి జరిగే ఉత్సవానికి ‘వసంతోత్సవ’మని పేరు. ఈ క్రతువులో సుగంధ సంభరిత వికాస పుష్పాలను స్వామికి సమర్పించి, ఫలాలు నివేదిస్తారు.

Samayam Telugu 17 Apr 2019, 9:05 am
తిరుమలలో శ్రీవారి వార్షిక సాలకట్ల వసంతోత్సవాలు బుధవారం నుంచి మూడు రోజుల పాటు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీవారికి ఈ మూడు రోజుల పాటు ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. కల్యాణోత్సవం, ఊంజలసేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలతో పాటు వారపుసేవను కూడా నిలిపివేసినట్టు ప్రకటించింది. అలాగే బుధవారం జరిగే సహస్రకలశాభిషేకం, గురువారం తిరుప్పావడ, శుక్రవారం నిజపాద దర్శనం సేవలను రద్దు చేసినట్టు అధికారులు వెల్లడించారు. వేసవికాలంలో వసంత రుతువులో శ్రీమలయప్పస్వామికి జరిగే ఈ ఉత్సవానికి ‘వసంతోత్సవ’మని పేరు. ఈ క్రతువులో సుగంధ సంభరిత వికాస పుష్పాలను స్వామికి సమర్పించడమే కాకుండా వివిధ ఫలాలను తెచ్చి స్వామికి నివేదించడం ప్రధాన ప్రక్రియ. స్వామివారికి ఉపశమనం కలిగించేలా ఏటా వసంతోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ.
Samayam Telugu vasanthotsavam


బుధవారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీమలయప్పస్వామి తిరు మాడవీధుల్లో ఊరేగుతూ వసంత మండపానికి వేంచేయనున్నారు. మధ్యాహ్నం నుంచి అభిషేక నివేదనలు ఉంటాయి. ఆస్థానం అనంతరం తిరిగి మందిరానికి దేవతామూర్తులు చేరుకుంటారు. ఏప్రిల్ 18న ఉదయం స్వామివారు బంగారు రథాన్ని అధిరోహించి తిరుమాడవీధుల్లో ఊరేగనున్నారు. అనంతరం ఉభయ దేవరులతో వసంత మండపానికి చేరుకుంటారు. ఏప్రిల్ 19న ఉత్సవాల చివరి రోజు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామితో పాటు శ్రీసీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి, రుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తులు ఊరేగింపుగా వసంత మండపానికి రానున్నారు. వసంతోత్సవం అనంతరం తిరు మాడవీధుల్లో ఊరేగుతూ ఆలయానికి చేరుకోనున్నారు. ఈ ఉత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు చేపట్టింది. వ‌సంత మండ‌పాన్ని రంగురంగుల పుష్పాలు, విద్యుత్‌ దీపాల‌తో శోభాయ‌మానంగా అలంక‌రించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.