యాప్నగరం

భువనేశ్వర్, ముంబయిల్లో శ్రీవారి ఆలయాలు: టీటీడీ

దివ్యక్షేత్రాలను నిర్మాణంలో భాగంగా దేశం నలుమూలలా శ్రీవారి ఆలయాలను తిరుమల తిరుపతి దేవస్థానం నెలకొల్పుతోంది. ఇటీవలే అమరావతిలో ఆలయానికి శంకుస్థాపన చేశారు.

Samayam Telugu 23 Feb 2019, 8:10 am
కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవేంకటేశ్వరుని భక్తులకు మరింత దగ్గర చేసేందుకు టీటీడీ అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో దివ్యక్షేత్రాలను నిర్మించాలని సంకల్పించింది. గతేడాది కురుక్షేత్ర, ఇటీవల కన్యాకుమారిలో శ్రీవారి ఆలయాలను పూర్తిచేసింది. అలాగే, ఇటీవలే ఏపీ రాజధాని అమరావతిలో రూ.140 కోట్లతో శ్రీనివాసుడి ఆలయ నిర్మాణం ప్రారంభించింది. తాజాగా మహారాష్ట్ర, ఒడిశాలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాలను నిర్మించనున్నట్లు జేఈవో బి.లక్ష్మీకాంతం వెల్లడించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముంబై, భువనేశ్వర్‌ నగరాల్లో ఆలయాలను నిర్మించనున్నట్టు తెలిపారు. ముంబయిలోని బాంద్రాలో 700 గజాల స్థలం సమకూరిందని, అక్కడ ఆలయం నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలియజేశారు. భువనేశ్వర్‌లోనూ భారీ ఆలయాన్ని నిర్మించనున్నట్టు జేఈవో పేర్కొన్నారు.
Samayam Telugu ttd


అలాగే అమరావతిలో రూ.150 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన శ్రీవారి ఆలయం వద్ద థీమ్‌పార్కును నిర్మించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. అలాగే దుబాయిలో స్థిరపడిన తెలుగువారు అక్కడ శ్రీవారి ఆలయ నిర్మాణానికి పూనుకున్న క్రమంలో మార్చి 20న శంకుస్థాపన చేయనున్నట్టు లక్ష్మీకాంతం వివరించారు. అలాగే శ్రీవారి నగల భద్రతకు మూడంచెల వ్యవస్థను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఆర్‌ఎఫ్‌ఐడీ విధానంలో భద్రపరిచిన ఆభరణాలను ఎవరైనా తాకితే తొలి అంచెలో అలారం మోగుతుందని, ఆ తర్వాత రెండు, మూడు దశల్లో ఉన్న భద్రతా సిబ్బంది అప్రమత్తమవుతారని ఆయన వివరించారు. కడప జిల్లా ఒంటిమిట్ట ఆలయంలో ఏప్రిల్‌ 18న సీతారాముల కల్యాణం జరుగుతుందని తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.