యాప్నగరం

నేడు ఉత్తరాంధ్రుల కల్పవల్లి పైడితల్లిమ్మ తోలేళ్ల ఉత్సవం

విజయనగరంలోని పైడితల్లి అమ్మవారి జాతరకు సర్వం సిద్ధమైంది. సోమవారం సాయంత్రం తోలేళ్ల ఉత్సవం జరగనుంది. ఇప్పటికే వేలాది మంది భక్తులు ఆ తల్లిని దర్శించుకుంటున్నారు.

Samayam Telugu 14 Oct 2019, 10:52 am
ఉత్తరాంధ్రులు ఇలవేలుపు విజయనగరం పైడితల్లి అమ్మవారి ఉత్సవాల్లో సిరిమానోత్సవం ప్రధాన ఘట్టం. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు లక్షలాదిగా భక్తులు తరలివచ్చి సిరిమాను రూపంలో ఉన్న పైడిమాంబను దర్శించుకుంటారు. సిరిమానును అమ్మవారిగా ఆరాధించే ఉత్సవానికి ముందురోజు తొలేళ్లు నిర్వహిస్తారు. తొలి ఏరే తొలేళ్లుగా మారింది. ఏరు అంటే నాగలి. తొలేళ్ల నాడు రాత్రి ప్రధాన పూజారి బంటుపల్లి వెంకటరావు రైతులకు విత్తనాలు అందజేస్తారు. వాటిని పొలాల్లో జల్లి నాగలితో భూమాతను పూజిస్తే సమృద్ధిగా పంటలు పండుతాయని విశ్వాసం. ఇది తరతరాలుగా వస్తున్న సంప్రదాయం.
Samayam Telugu tolellu2


తొలేళ్ల ఉత్సవం ఉదయం నుంచి పండగ సందడి నెలకొంటుంది. బంధువులు, స్నేహితులతో ప్రతీ ఇల్లూ కళకళలాడుతుంది. సంప్రదాయం ప్రకారం తోలేళ్ల ఉత్సవం రోజు ఉదయం ఆలయ ధర్మకర్తలు పూసపాటి అశోక్‌గజపతిరాజు కుటుంబసమేతంగా ఆలయానికి వచ్చి తన పుట్టింటి ఆడపడుచుకు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఉదయం 6 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతించారు. ఇక, సిరిమాను సంబరాల్లో విచిత్ర వేషాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవారు తెల్లని వస్త్రాలు కట్టుకుని అమ్మవారిని దర్శించుకుంటున్నారు. రాత్రి 9 గంటలకు హుకుంపేట నుంచి ఘటాలు ఆలయానికి వస్తాయి.

మేళతాళాలతో ఘటాలను ఊరేగింపుగా అమ్మవారి పుట్టిల్లు కోటకు తరలిస్తారు. రాజవంశీయుల అర్చనలు అనంతరం ఘటాలను తిరిగి ఆలయానికి తీసుకొస్తారు. ఆలయ ఆవరణలో సంప్రదాయ కళారూపం తూర్పుభాగవతం ప్రదర్శిస్తారు. పట్టణంలో పలు ప్రాంతాల్లో ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. అమ్మవారి జాతరలో ప్రధాన ఘట్టం సిరిమానోత్సవం. ఏటా ఈ ఉత్సవం ముగిసే సమయానికి సమయం మించిపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది మాత్రం ముందే ముగిసేలా చర్యలు చేపట్టారు. సిరిమానును ఉదయం 11 గంటలకే ఆలయానికి తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.