యాప్నగరం

అయ్యప్పను నెయ్యాభిషేక ప్రియుడని ఎందుకంటారు?

హరిహరసుతుడు అయ్యప్పస్వామి దర్శనానికి వెళ్లే భక్తులు నెయ్యాభిషేకం క్రతువును విశిష్టమైందిగా భావిస్తారు. ఇరుముడిలో తీసుకెళ్లే నేతితో స్వామికి అభిషేకం నిర్వహిస్తారు.

TNN 17 Dec 2017, 5:42 pm
అయ్యప్ప మాలను ధరించి దీక్ష చేసే భక్తులు నిత్యం స్వామినామ స్మరణతోనే జీవిస్తారు. శరణఘోషలు, భజనలతో స్వామిని పూజిస్తూ 41 రోజుల పాటు కఠిన దీక్ష చేస్తారు. అయితే స్వామిని నెయ్యాభిషేక ప్రియుడని, కర్పూర ప్రియుడని అంటారు. శబరిమలలో నెయ్యాభిషేకానికి విశేష ప్రాధాన్యత ఉంది. ఇరుముడితో పదునెట్టాంబడి ఎక్కి స్వామి దర్శనం చేసుకున్న భక్తులు తర్వాత జరిగే నెయ్యాభిషేకంలో పాల్గొంటారు. అందుకే దీక్షచేసిన భక్తులు శబరిగిరీశుడి దర్శనానికి వెళ్లే ముందు ఇరుముడి ధరిస్తారు. ఈ ఇరుముడిలో ప్రధానమైంది నెయ్యితో నింపిన టెంకాయ. టెంకాయలోని నీటిని తీసి, ఆవు నేతిని నింపుతారు. నెయ్‌తేంగా ‘తేంగా’ అంటే టెంకాయ అని అర్థం. దీక్షచేసిన భక్తులు ఎంతో పవిత్రంగా టెంకాయను ఇరుముడిలో కట్టి శబరిమలకు చేరుకుంటారు.
Samayam Telugu importance of ghee abhishekam for sabarimala ayyappa
అయ్యప్పను నెయ్యాభిషేక ప్రియుడని ఎందుకంటారు?


టెంకాయలో నెయ్యి నింపడం వెనుక విశేషమే ఉంది. శ్రీమహావిష్ణువు అనంతుని పాన్పుగా చేసుకుని క్షీరసాగరంలో పవళించివుంటాడు. ప్రతి జీవిలోనూ భగవంతుని ప్రతిరూపం ఉంటుంది. పాలను చిలికితే వెన్న వస్తుంది. వెన్నను కాచి నెయ్యి తయారుచేస్తారు. అంటే నెయ్యిని జీవాత్మగా భావిస్తారు. అలాంటి నెయ్యితో భగవంతుడికి అభిషేకం చేయడం ఎంతో విశిష్టం. అయ్యప్ప పరమాత్మ. ఇరుముడిలో భక్తులు తీసుకొచ్చిన నెయ్యితో అయ్యప్పకు అభిభిషేకం చేయడమంటే పరమాత్మలో జీవాత్మ ఐక్యం చెందడం. ఇందులోనూ ఎంతో పరమార్థం దాగివుంది. నెయ్యి విష్ణువుకు ప్రతిరూపమైతే పరమేశ్వరుడు అభిషేకప్రియుడు. ఇలా నెయ్యాభిషేకంతో హరిహరసుతునికి పూజలు నిర్వహించడం విశేషం.

నెయ్యి ఉంటేనే టెంకాయకు విశిష్టత. నెయ్యి తీసిన అనంతరం అది సాధారణ టెంకాయ మాత్రమే. అలాగే మనిషిలోని జీవుడు బయటకు వెళ్లిపోతే కట్టె మాత్రమే మిగులుతుందనే సత్యాన్ని ఇది తెలుపుతుంది. జీవుడు ఈ జీవన సత్యాన్ని తెలుసుకొని ఇతర మనుషులు, జీవులపై ప్రేమతో మెలగాలన్న అంతర్లీనమైన భగవత్‌ సందేశం. నెయ్యాభిషేకం అనంతరం దేవాలయ ప్రాంగణంలో ఉన్న ప్రజ్వలిస్తున్న అగ్నిలో టెంకాయలను సమర్పించడంలో అర్థం పరమార్థం ఇదే. మండలం, మకరవిలక్కు సందర్భంగా ఈ క్రతువును రోజూ నిర్వహిస్తారు. తెల్లవారుఝామున 4.15 గంటలకు ప్రారంభమయ్యే అగ్నిహోమం రాత్రి 11.30 గంటల వరకు నిరాటకంగా కొనసాగుతుంది. ఈ అగ్నిధారలతో శబరగిరులు మరింత ఆధ్మాత్మికతను సంతరించుకుంటారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.