యాప్నగరం

Sabarimala: నవంబరు 17 నుంచి మండల పూజ.. రిజిస్టర్ చేయించుకున్న 500 మంది మహిళలు

శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలూ ప్రవేశించవచ్చంటూ సెప్టెంబరు 28న సుప్రీంకోర్టు వెల్లడించిన తీర్పును వ్యతిరేకిస్తూ 49 రివ్యూ పిటిషన్లు దాఖలు కాగా, వీటిపై సర్వోన్నత న్యాయస్థాన మంగళవారం విచారణ చేపట్టింది.

Samayam Telugu 14 Nov 2018, 3:28 pm
మండల పూజ కోసం శుక్రవారం సాయంత్రం శబరిమల ఆలయం ద్వారాలు తెరుచుకోనుండగా, మరోసారి శబరిగిరుల్లో ఉద్రిక్తతలు చోటుచేసుకునే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు తీర్పుతో 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు అయ్యప్ప ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా భక్తులు వారిని అడ్డుకోవడంతో వెనుదిరిగారు. ప్రస్తుత తీర్పును పునః సమీక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై ఓపెన్ కోర్టులో విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీనిపై జనవరి 22న విచారణ జరుగుతుందని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. తాజాగా సామాజిక కార్యకర్త, భూమాత బ్రిగేడ్ వ్యవస్థాపకురాలు తృప్తి దేశాయ్ శబరిమలకు వెళుతున్నట్టు ప్రకటించిన ఆమె, తనకు తగినంత భద్రత కల్పించాలని కోరుతూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు ఓ లేఖ రాశారు.
Samayam Telugu sabarimala-temple


మరోవైపు నవంబరు 16న మండల పూజ కోసం తెరవనున్న ఆలయాన్ని తిరిగి డిసెంబరు 27న మూసేయనున్నారు. అనంతరం మక్కరవిళక్కు కోసం డిసెంబరు 30 నుంచి జనవరి 20 వరకు తెరిచి ఉంచుతారు. శుక్రవారమే ఆలయాన్ని తెరవనుండగా, ఇదే సమయంలో తృప్తి దేశాయ్ శబరిమలకు వెళ్లనున్నారు. మరోవైపు, నిషేదిత వయసున్న 500 మంది మహిళలు కూడా అయ్యప్ప దర్శనం కోసం ఆన్‌లైన్‌లో తమ పేర్లను నమోదు చేయించుకున్నారు. ఈ నేపథ్యంలో, మరోసారి అలజడి చెలరేగుతోంది. అయితే, స్వామి దర్శనం కోసం మూడు లక్షల మంది భక్తులు పేర్లను నమోదు చేసుకున్నారని, వీరిలో మహిళలు సైతం ఉన్నారని కేరళ పోలీస్ వర్గాలు అంటున్నాయి.

అలాగే రిజిస్ట్రేషన్ సమయంలో వారి గుర్తింపు కార్డు ప్రస్తావన కూడా ఉండదు కాబట్టి వీళ్లు ఏ వయసు మహిళలో ఖచ్చితంగా చెప్పలేమని ఓ సీనియర్ పోలీస్ అధికారి వ్యాఖ్యానించారు. మరోవైపు, శబరిమలకు వెళ్లే కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులకు ముందస్తు రిజర్వేషన్లు చేయించుకున్న మహిళల్లో 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసుల వారు లేరని ఆయన తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం మూడో సారి శబరిమల ఆలయం తెరుచుకోనుండగా కేరళ ప్రభుత్వం ముందస్తు చర్యలు ప్రారంభించింది. గురువారం అఖిలపక్ష సమావేశం నిర్వహించి, ఓ నిర్ణయానికి వస్తామని సీఎం విజయన్ స్పష్టం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.