యాప్నగరం

మహిళలకు నో ఎంట్రీ, వెనక్కువచ్చిన 10 మంది ఏపీ భక్తులు.. ప్రశాంతంగా శబరిమల

శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించాలన్న అంశాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం విస్తృత ధర్మాసనానికి బదిలీచేయడంతో గతేడాది తీర్పును కేరళ సర్కారు పక్కనబెట్టింది.

Samayam Telugu 17 Nov 2019, 10:06 am
మండల-మకరు విలక్కు పూజల కోసం శబరిమల అయ్యప్ప ఆలయ ద్వారాలు శనివారం తెరుచుకున్నాయి. భారీ భద్రత నడుమ అయ్యప్ప ఆలయం తెరుచుకోగా, కేరళ, ఏపీ, తెలంగాణ, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. శనివారం సాయంత్రం 5 గంటలకు గర్భగుడిని తంత్రి కందరారు మహేశ్‌ మోహనరారు తెరిచి ప్రత్యేక పూజలు చేయగా, అంతకు ముందు పూజారులు ‘పడిపూజ’ నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి భక్తులు కొండ ఎక్కేందుకు అనుమతించారు.

ఇరుముడితో పవిత్రమైన పదునెట్టాంబడి ఎక్కి ఆలయం వద్దకు చేరుకున్నారు. అయితే, అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పించాలన్ని గతేడాది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కేరళ ప్రభుత్వం ప్రస్తుతానికి పక్కనబెట్టింది. దీంతో సన్నిధానం పరిసరాల్లో ప్రశాంతత నెలకుంది. భద్రత కోసం దశలవారీగా 10 వేల మందికిపైగా పోలీసులను మోహరించారు.

10 నుంచి 50 ఏళ్లలోపు మహిళలను అనుమతించకపోవడంతో విజయవాడ నుంచి వచ్చిన 10 మందిని వెనక్కుపంపారు. ఇరుమడి కట్టుకుని దీక్షదారులైన మహిళలను సన్నిధానానికి 5 కిలోమీటర్ల దూరంలోని పంబ వద్ద వారిని నిలిపివేశారు. వీరంతా 50 ఏళ్లలోపు వారే కావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత పరిస్థితి గురించి వివరించడంతో వారు వెనుదిరిగినట్టు పోలీసులు తెలిపారు. శబరిమల అంశాన్ని విస్తృత ధర్మాసనానికి బదిలీచేయాలని సుప్రీం కోర్టు ఇటీవల నిర్ణయించిన నేపథ్యంలో మహిళల ప్రవేశంపై ప్రాధాన్యం ఏర్పడింది.

అన్ని వయస్సుల మహిళలను ఆలయంలోకి అనుమతించాలని గత ఏడాది సెప్టెంబర్‌ 28న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. దీనిని కేరళ ప్రభుత్వం అమలుచేయడానికి ప్రయత్నించగా ప్రతిపక్షాలు సహా అయ్యప్ప భక్తులు తీవ్ర స్థాయిలో నిరసనలకు దిగారు. గతంలో తీర్పుపై సుప్రీం కోర్టు ఎలాంటి స్టే ఇవ్వనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈసారి ఆలయం వద్ద ఏ విధమైన ఆందోళనలకు తావివ్వరాదని నిర్ణయించింది. పబ్లిసిటీ కోసం శబరిమలలోకి ప్రవేశించే మహిళలను ప్రోత్సహించబోమని స్పష్టం చేసింది. ఒకవేళ ఆలయాన్ని దర్శించుకోవాలంటే కోర్టు నుంచి అనుమతి తీసుకోవాలని దేవాదాయ మంత్రి సురేంద్రన్‌ ఉద్ఘాటించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.