యాప్నగరం

Sabarimala: నిషేధిత వయసు మహిళలకు ప్రత్యేక రోజుల్లో దర్శనం!

సెప్టెంబరు 28న తీర్పు వెల్లడించిన తర్వాత తొలిసారి అక్టోబరులో నెలవారీ పూజల కోసం ఆలయం తెరుచుకోగా, 50 ఏళ్లలోపు మహిళలు శబరిమలలోకి ప్రవేశించేందుకు చేసిన ప్రయత్నాలను భక్తులు అడ్డుకున్నారు.

Samayam Telugu 16 Nov 2018, 9:54 am
శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయసుల మహిళలనూ అనుమతించే విషయమై సుప్రీంకోర్టు తీర్పునకు కట్టుబడి ఉంటామని కేరళ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశంలో మరోసారి స్పష్టం చేసింది. గురువారం దాదాపు 3 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ఏకాభిప్రాయం కుదరక పోవడంతో బీజేపీ, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్‌ వాకౌట్ చేశాయి. రివ్యూ పిటిషన్లపై జనవరిలో విచారణ జరుపుతామని సుప్రీం ప్రకటించడంతో తీర్పు అమలును నిలుపుదల చేసేలా కొంతకాలం గడువు కోరాలంటూ ప్రతిపక్షాలు చేసిన డిమాండ్‌‌ను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తోసిపుచ్చారు. రాజ్యాంగం కంటే విశ్వాసం గొప్పదని ప్రభుత్వం చెప్పబోదని వ్యాఖ్యానించారు. అలాగే, 10 నుంచి 50 ఏళ్ల మహిళల దర్శనానికి ప్రత్యేకంగా కొన్ని రోజులు కేటాయించాలని యోచిస్తున్నట్టు విజయన్‌ సూచనప్రాయంగా వెల్లడించారు. ఈ విషయమై సంబంధిత పక్షాలతో చర్చిస్తామని, తీర్పుపై స్టే ఇవ్వనందున అమలు చేయడం మినహా గత్యంతరం లేదని, భక్తులు దీనిని అర్థం చేసుకోవాలని ఆయన కోరారు.
Samayam Telugu Sabrimala-Latest


ఈ నేపథ్యంలో అఖిలపక్ష సమావేశంపై విపక్షాలు పెదవివిరిచాయి. ఇది ఓ ప్రహసనమేనని, శాంతిభద్రతలు లోపిస్తే ప్రభుత్వమే దానికి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించాయి. రాష్ట్ర సర్కారు మొండిగా వ్యవహరిస్తోందని, సీఎం వైఖరి ఆమోదయోగ్యం కాదని ప్రతిపక్ష నేత రమేశ్‌ చెన్నితాల, బీజేపీ అధ్యక్షుడు పీఎస్‌ శ్రీధరన్‌ పిళ్లైలు విమర్శించారు. కేరళను ముఖ్యమంత్రి ‘స్టాలిన్స్‌ రష్యా’లా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారంటూ శ్రీధరన్‌ పిళ్లై దుయ్యబట్టారు. నిషేధిత వయసు మహిళల ప్రవేశానికి ఆలయ ఆచారాలు, సంప్రదాయాలకు విరుద్ధంగా ఉన్నందున, దీనికి అనుగుణంగానే తమ వైఖరి ఉంటుందని పందళం రాజ కుటుంబం పునరుద్ఘాటించింది. రాజ కుటుంబానికి చెందిన శశికుమార్‌ వర్మ, ప్రధాన అర్చకుడు కందరారు రాజీవరులతో సీఎం వేరుగా భేటీ అయ్యారు. 10-50 ఏళ్ల మహిళలు శబరిమలకు రావొద్దంటూ అభ్యర్థించడం మాత్రమే చేయగలమని రాజీవరు పేర్కొన్నారు.

మరోవైపు, రెండు నెలల పూజలకు గాను గతంలో ఎన్నడూ లేనంత భద్రత నడుమ శుక్రవారం సాయంత్రం ఆలయాన్ని తెరవనున్నారు. గురువారం అర్ధరాత్రి నుంచే నిషేధాజ్ఞలు అమలు చేశారు. ఇటీవల ఆలయాన్ని తెరచినప్పటి కంటే శబరిమల పరిసర ప్రాంతాల్లో భద్రతను రెట్టింపు చేసినట్లు డీజీపీ లోక్‌నాథ్‌ బెహరా తెలిపారు. మహిళా పోలీసులు సహా 15,000 మందిని మోహరిస్తున్నారు. దాదాపు 700 మందికి పైగా 10-50 ఏళ్ల మహిళలు కేరళ గత వారం రోజులుగా దర్శనం కోసం ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.