యాప్నగరం

శబరిమల ప్రధాన పూజారిగా సుధీర్ నంబూద్రి.. లాటరీ ద్వారా ఎంపిక!

దేవభూమిలో వెలసిన శబరిమల అయ్యప్పస్వామి దర్శనం కోసం ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివస్తారు. మండల-మకరవిలక్కు సమయంలో మాత్రమే రెండు నెలలు ఆలయం తెరిచి ఉంటుంది.

Samayam Telugu 18 Aug 2019, 12:16 pm
ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప ఆలయం తదుపరి ప్రధాన పూజారి (మేలసంతి) గా ఏకే సుధీర్ నంబూద్రిని ఎంపిక చేశారు. మలప్పురం జిల్లాలోని తిరునవయలో అరీకర మనకు చెందిన సుధీర్ నంబూద్రి నవంబరు 17 నుంచి ఏడాది పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. అలాగే మాళికాపురుత్తమ్మ ఆలయ ప్రధాన పూజారిగా ఎర్నాకులానికి చెందిన ఎంఎస్ పరమేశ్వరన్‌ నంబూద్రి ఎంపికయ్యారు. శనివారం సాయంత్రం అయ్యప్ప ఆలయ పదునెట్టాంబడి వద్ద ఈ ప్రక్రియ చేపట్టారు. లాటరీ పద్దతిలో జరిగిన ఈ ఎంపిక ప్రక్రియ పందళం రాజవంశానికి చెందిన చిన్నారులు మాధవ్ కే వర్మ, కంచన కే వర్మల చేతులమీదుగా జరగడం విశేషం. పదునెట్టాంబడి వద్ద డ్రా తీసి ప్రధాన పూజారులను ఎంపిక చేశారు.
Samayam Telugu pjimage (54)


ఈ ప్రక్రియను పర్యవేక్షించడానికి ప్రత్యేక కమిషనర్‌గా ఎం మనోజ్‌ను కేరళ హైకోర్టు నియమించింది. ఈ కార్యక్రమంలో ట్రావెన్‌కోర్ దేవస్వామ్ బోర్డు అధ్యక్షుడు ఏ పద్మకుమార్, సభ్యులు కేపీ శంకర్‌దాస్, ఎన్ విజయకుమార్‌లు కూడా పాల్గొన్నారు. కాగా, అంతకు ముందు శబరిమల ఆలయ శాశ్వత పూజారి (తంత్రి) కందరారు మహేశ్వరారు మోహనారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మేలసంతిగా ఎంపికైనవారికి నెల రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. తంత్రితోపాటు ప్రస్తుతం పూజారి వాసుదేవన్ నంబూద్రీల ఆధ్వర్యంలో ఆలయ ఆచారాలు, సంప్రదాయాలు, నియమాలు గురించి వీరికి తెలియజేస్తారు.

కొత్తగా ఎంపికైన పూజార్లు సుధీర్ నంబూద్రీ, పరమేశ్వర‌న్‌లు ఆయా ఆలయాల సోపానాల వద్ద నవంబరు 16న బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమం జరిగిన మర్నాడే శబరిమల ఆలయం మండల-మకరవిలక్కు పూజల కోసం తెరుచుకోనుంది. మొత్తం రెండు నెలల పాటు ఆలయం తెరచి ఉంటుంది. ఈ సమయంలో లక్షలాదిగా అయ్యప్ప భక్తులు స్వామివారి దర్శనం కోసం తరలివస్తారు. మండలకాలం పాటు మాలధారణ చేసి, ఇరుముడి కట్టుకుని శబరిగిరికి చేరుకుంటారు. పావన పదునెట్టాంబడి మీదుగా సన్నిధానంలోకి చేరుకుని, స్వామికి ఇరుముడి సమర్పించి మొక్కు చెల్లించుకుంటారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.