యాప్నగరం

తిరుమలలో అద్దె గదులు మరింత ప్రియం.. భక్తులకు షాక్ ఇచ్చిన టీటీడీ

తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివస్తారు. కోనేటి రాయుడి దర్శన భాగ్యం కోసం రోజుల తరబడి వేచి ఉంటారు. అయితే, తిరుమలలో బస చేసే భక్తులకు టీటీడీ షాక్ ఇచ్చింది.

Samayam Telugu 7 Nov 2019, 3:11 pm
శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తులకు వసతి గదులు విషయంలో మరింత భారం కానుంది. టీటీడీ తీసుకున్న నిర్ణయంతో ముఖ్యమంగా మధ్యతరగతి వారికి మరింత భారం పడుతుంది. నందకం, కౌస్తుభం, పాంచజన్యం వసతి సముదాయాల్లో పెంచిన ధరలు గురువారం నుంచి అమల్లోకి వచ్చాయి. నందకం గెస్ట్‌హౌస్‌లో రూ.600 నుంచి రూ.1000కి, కౌస్తుభం, పాంచజన్యంలో రూ.500 నుంచి రూ.1000కి పెంచింది. తిరుమలకు వెళ్లే భక్తులకోసం రూ.50 నుంచి రూ.3వేల వరకు వసతి సదుపాయం అందుబాటులో ఉంది. ఆన్‌లైన్‌, ఈ దర్శన్‌ల ద్వారా ప్రస్తుతం రూ.100, రూ.500, రూ.600, రూ.999, రూ.1500 వసతి గదులను మాత్రమే కేటాయించేవారు. వీటిలో రూ.100, రూ.500, రూ.600 సాధారణ వసతికాగా, రూ.999, రూ.1500 ఏసీ సౌకర్యం ఉంటుంది.
Samayam Telugu tirupati


శ్రీవారి భక్తుల్లో ఎక్కువ మంది రూ.100 గదుల్లో ఉండేందుకు మొగ్గుచూపుతారు. అయితే రూ.100 గదులు చాలా తక్కువగా కేటాయించటంతో అవి దొరకని వారు రూ.500, రూ.600 గదులను ఆశ్రయిస్తారు. మధ్య, ఎగువ మధ్యతరగతికి ఇవి అందుబాటులో ఉండేవి. తిరుమలలో ధరలు పెరిగినా తిరుపతిలో మాత్రం యథావిధిగా కొనసాగుతున్నాయి. శ్రీనివాసంలో సాధారణ గది రూ.200, ఏసీ రూ.400, డీలక్స్‌ ఏసీ రూ.600, మాధవంలో ఏసీ రూ.800, డీలక్స్‌ ఏసీ రూ.1000, తిరుచానూర్‌లో ఏసీ రూ.300, సాధారణ గది రూ.100 చొప్పున ఆన్‌లైన్‌, ఈ-దర్శన్‌ల ద్వారా కేటాయిస్తున్నారు.

కలియుగ వైకుంఠనాథుడు శ్రీనివాసుని దర్శనం సకల పాపహరణమని భక్తులు భావిస్తారు. ఆయన దివ్యసుందర రూపాన్ని క్షణకాలం చూసినా ఆనందంతో పరవశించిపోతారు. అలాంటి తిరుమలేశుని భక్తులకు టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయం ఒకింత నిరాశకు గురి చేసేదనే చెప్పవచ్చు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.