యాప్నగరం

ఆ మహిళను విడుదల చేశారు...

హత్యానేరంపై పద్నాలుగేళ్లుగా జైల్లో మగ్గుతున్న మహిళ పట్ల కోర్టు ధర్మాసనం మానవత్వంతో స్పందించి విడుదల చేయమని ఆదేశించింది.

TNN 8 Mar 2016, 6:35 pm
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కోల్కతా హైకోర్టు తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. హత్యానేరంపై పద్నాలుగేళ్లుగా జైల్లో మగ్గుతున్న మహిళ పట్ల కోర్టు ధర్మాసనం మానవత్వంతో స్పందించి విడుదల చేయమని ఆదేశించింది. పశ్చిమ బెంగాల్లోని తూర్పూ మిడ్నాపూర్ కు చెందిన మహిళపై హత్యానేరం రుజువై జైలు శిక్ష పడింది. ఆమెకు 53 ఏళ్ల వయసప్పుడు ఒక వ్యక్తి అత్యాచారానికి ప్రయత్నించగా తనను తాను కాపాడుకోవడానికి ఆమె అతగాడిని హతమార్చింది. కానీ, దిగువ కోర్టు ఆమె వాదనను నమ్మలేదు. దాంతో ఆమెను పోలీసులు పురూలియా జైలుకు తరలించారు. పద్నాలుగేళ్లుగా ఆమె అందులోనే జైలు శిక్షను అనుభవిస్తోంది. ఆమెకు శిక్షపడిన వెంటనే కన్నబిడ్డలు కనీసం మానవత్వం కూడా లేకుండా ఆమెకు దూరమయ్యారు. ఆమెతో సంబంధాలు తెగతెంపులు చేసుకున్నారు. మానసిక వికలాంగుడైన ఆమె భర్త మిడ్నాపూర్లోని ఇంట్లో ఒంటరిగా జీవిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆమె పాపం మధ్యమధ్యలో తనకు విధించిన శిక్ష సరికాదంటూ న్యాయ సహాయ కేంద్రం ద్వారా కోర్టులకు విన్నవించుకున్నా ఫలితం లేకపోయింది.
Samayam Telugu calcutta high court releases lady imprisoned for last 14 years
ఆ మహిళను విడుదల చేశారు...


ఆమె పరిస్థితికి చలించిన న్యాయవాదులు జయంత్ నారాయణ్ చటర్జీ, దేవాశిష్ బెనర్జీలు తమ స్వంత ఖర్చులతో కోల్కతా హైకోర్టులో దిగువ కోర్టు తీర్పును సవాలు చేసారు. చాలా రోజుల పాటు విచారణ జరిగిన తరువాత న్యాయమూర్తులు దేవాశిశ్ దత్త గుప్తా, ముంతాజ్ ఖాన్ లతో కూడిన ధర్మాసనం మహిళా దినోత్సవం నాడు తన తీర్పును ప్రకటించింది. కేవలం తనను తాను కాపాడుకోవడానికే దిక్కుతోచని స్థితిలో అత్యాచారానికి పాల్పడేందుకు ప్రయత్నించిన వ్యక్తిని ఆమె హతమార్చిందనే వాదనతో ధర్మాసనం ఏకీభవించింది. ఆమె చేసిన పనిని కుట్రపూరితంగా ముందస్తు ప్రణాళికతో చేసిన హత్యగా పేర్కొనలేమని వ్యాఖ్యానించింది. ఇప్పటికే ఆమె పద్నాలుగేళ్లుగా కటకటాల వెనుక మగ్గిందని పేర్కొంటూ తక్షణమే విడుదల చేయాలని ఆదేశాలు జారీచేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.