యాప్నగరం

ఫేక్ అలర్ట్: అమృత్‌సర్ విషాదానికి కారణమైన రైలు డ్రైవర్ ఆత్మహత్య?

దసరా రోజున రావణ దహనం వీక్షించడానికి పట్టాలెక్కిన వారి మీదుగా రైలు దూసుకెళ్లిన ఘటనలో 58 మందికిపైగా మరణించగా.. 72 మంది గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు కారణమైన రైలు డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

TNN 23 Oct 2018, 11:31 am
అమృత్‌సర్ రావణ దహన ఘటన సమయంలో.. రైలు ఢీకొనడంతో భారీ స్థాయిలో ప్రాణ నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు కారణమైన డీఎంయూ ట్రైన్ డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడనే కథనం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి బ్రిడ్జికి వేలాడుతున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అతడి పేరు అరవింద్ కుమార్ అని, సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడని కూడా ప్రచారం జరుగుతోంది. దీంతో నిజంగానే ఆ డ్రైవర్ చనిపోయాడని చాలా మంది నమ్మేశారు, సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు షేర్ చేశారు.
Samayam Telugu amritsar-driver


వాస్తవం ఏంటంటే.. డీఎంయూ ట్రైన్ డ్రైవర్ బలవన్మరణానికి పాల్పడలేదు. ప్రస్తుతం అతడు పంజాబ్ రైల్వేస్ కస్టడీలో ఉన్నాడు. అమృత్‌సర్ ఘటనపై రైల్వే శాఖ స్వతంత్ర దర్యాప్తు చేపట్టింది. ‘టైమ్స్ ఫ్యాక్ట్ చెక్‌’లో ఈ విషయం వెల్లడైంది. ఆ డ్రైవర్ ఆత్మహత్య చేసుకోలేదని పంజాబ్ టైమ్స్‌ ఆఫ్ ఇండియా రిపోర్ట్ తెలిపారు. డ్రైవర్ సూసైడ్ వార్త ఫేక్ అని అమృత్‌సర్ రైల్వే స్టేషన్ డైరెక్టర్ అమృత్ సింగ్ తెలిపారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటో వివరాలు తెలుసుకోవడానికి గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్, కీబోర్డ్ బ్రౌజింగ్‌ ద్వారా ప్రయత్నించినప్పటికీ వివరాలు వెల్లడి కాలేదు. ఫైనల్‌గా చెప్పొచ్చేది ఏంటంటే.. తన తప్పేమీ లేకపోయినప్పటికీ, పండుగ పూట భారీ సంఖ్యలో జనం మృత్యువాత పడటానికి కారణమైన ఆ డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడనే వార్త పూర్తిగా అబద్ధం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.