యాప్నగరం

రియల్ బాహుబలి: ప్రమాదంలో పడ్డ పిల్ల ఏనుగును భుజాలపై మోసి..

తమిళనాడుకు చెందిన పి శరత్‌కుమార్.. వార్తల్లో వ్యక్తిగా మారిపోయాడు. ఓ గుంతలో చిక్కుకుపోయిన పిల్ల ఏనుగును అతడు తన భుజాలపై మోసుకొస్తున్న ఫొటోలు ప్రపంచవ్యాప్తంగా వైరల్‌గా మారాయి.

TNN 2 Jan 2018, 10:12 pm
బాహుబలి-2 సినిమా ప్రారంభ సన్నివేశం గుర్తుంది కదా.. మదమెక్కిన ఏనుగును బాహుబలి మచ్చిక చేసుకునే తీరు రోమాలు నిక్కబొడిచేలా చేస్తుంది. ఇంచుమించు అలాంటి ఫీట్‌తోనే ఓ సాధారణ యువకుడు ఇప్పుడు రియల్ హీరోగా మారిపోయాడు. అవును.. తమిళనాడుకు చెందిన పి శరత్‌కుమార్ (28) ఒక్కసారిగా వార్తల్లో వ్యక్తిగా మారిపోయాడు. ఓ గోతిలో చిక్కుకుపోయిన బుజ్జి గజరాజాన్ని శరత్‌కుమార్ తన భుజాలపై మోసుకొస్తున్న ఘటనకు సంబంధించిన ఫొటోలు ప్రపంచవ్యాప్తంగా వైరల్‌గా మారిపోయాయి.
Samayam Telugu forest guard saves baby elephant from ditch in tamil nadu
రియల్ బాహుబలి: ప్రమాదంలో పడ్డ పిల్ల ఏనుగును భుజాలపై మోసి..


ఊటీ ప్రాంతానికి 50 కి.మీ. దూరంలోని మెట్టుపలాయమ్‌ అటవీ పరిధిలో ఫారెస్టు గార్డుగా విధులు నిర్వహించే శరత్‌కు గత డిసెంబర్ 12న అకస్మాత్తుగా ఫోన్ కాల్ వచ్చింది. అక్కడికి సమీపంలోని ఓ రహదారిపై ఓ ఏనుగు వీరంగం చేస్తోందని ఆ ఫోన్ కాల్ సమాచారం. వెంటనే బయలుదేరిన శరత్.. స్పాట్‌కి వెళ్లి దాన్ని రోడ్డు పక్కకి తరిమే ప్రయత్నం చేశాడు.

ఆ మదగజాన్ని అడవిలోకి పంపించడానికి శరత్‌తో పాటు చాలా మంది వాహనదారులు శత విధాలా ప్రయత్నించారు. టపాసులు పేల్చి భయపెట్టినా.. అదిలించినా, బెదిరించినా.. అది చాలా సేపటి వరకు అక్కడి నుంచి కదల్లేదు. దీంతో శరత్‌కు ఓ అనుమానం వచ్చింది. అది ఏనుగుల మంద నుంచి తప్పిపోయి ఉండాలి.. లేదా ఏదైనా ప్రమాదంలో ఉండాలి.

తన బృందంతో కలిసి చుట్టుపక్కల ప్రాంతాలను గాలించిన శరత్‌కు ఓ చోట విషాదకర దృశ్యం కనిపించింది. ప్రమాదవశాత్తూ గొయ్యిలో పడిపోయిన ఓ పిల్ల ఏనుగు.. పైకెక్కడానికి నానా పాట్లు పడి, నీరసించి అచేతనంగా పడి ఉంది. వెంటనే ఆ బృందం దాన్ని పైకి తీసుకురావడానికి ప్రయత్నం ప్రారంభించారు.

గొయ్యికి సమాంతరంగా కొంతమేర తవ్వి, నలుగురు గార్డులు కలిసి ఆ పిల్ల ఏనుగును ఎలాగోలా పైకి తీసుకొచ్చారు. కానీ, అసలు సమస్య అప్పుడే వచ్చింది. ఆకలితో నీరసించిపోయిన ఆ ఏనుగు పిల్ల కాలు తీసి ముందుకు పెట్టలేకపోయింది. వాళ్లు దాన్ని అలాగే ముందుకు తీసుకుపోతే.. పొరపాటున తల్లి ఏనుగు గనుక వస్తే.. ఇక అంతే సంగతులు.

సరిగ్గా అలాంటి సమయంలో శరత్ అత్యంత సాహసోపేత నిర్ణయం తీసుకున్నాడు. నలుగురూ కలిసి ఆ పిల్ల ఏనుగును మోసుకెళితే.. అందరికీ ప్రమాదమని వారించి, దాన్ని అతనొక్కడే భుజాలపైకి ఎత్తుకున్నాడు. కండలు తిరిగిన యోధుడిలా అంత బరువును అలకోకగా మోస్తూ.. ముందుకుసాగాడు. ఓ నీటి కుంట దగ్గర దాన్ని వదిలేసి వారంతా ఇంటిముఖం పట్టారు.

మరుసటి రోజు వచ్చి చూస్తే.. అక్కడ ఆ పిల్ల ఏనుగు లేదు. పరిసరాల్లో పెద్ద ఏనుగుకు సంబంధించిన కాలి గుర్తులు కూడా ఉన్నాయి. అది చూసి శరత్ మనసు ఆనందంతో ఉప్పొంగింది. తప్పిపోయిన పిల్ల ఏనుగు తన తల్లి చెంత చేరిందనే సంతోషం అతణ్ని తబ్బుబ్బి చేసింది.

స్థానిక పత్రికల్లో శరత్ గురించి పతాక స్థాయి కథనాలు వండి వార్చారు. దీంతో అతడికి అనేక ప్రాంతాల నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయి. అందరి ప్రశ్న ఒక్కటే.. ‘అంత బరువును ఎలా మోయగలిగావు?’ అని.. దానికి అతడి సమాధానం.. ‘ఆ సమయంలో నా మదిలో మెదిలింది.. ఆ ఏనుగు పిల్లను కాపాడటమొక్కటే. దాని బరువు గురించి అసలు ఆలోచనే రాలేదు. అంతే.. అలా మోసుకెళ్లా’. ఇప్పుడు ‘రియల్ బాహుబలి’గా శరత్ ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.