యాప్నగరం

ఆయన జీవితమే... ఓ సంగీత ఝరి

ప్రపంచ ప్రజల భాష సంగీతం. మనసును కదిలించేది, మనిషిలో చైతన్యాన్ని రగిలించేది సంగీతం.

TNN 22 Nov 2016, 7:20 pm
ప్రపంచ ప్రజల భాష సంగీతం. మనసును కదిలించేది, మనిషిలో చైతన్యాన్ని రగిలించేది సంగీతం. శిశుర్వేత్తి... పశుర్వేత్తి... వేత్తిగాన రసఃఫణిః అని పెద్దలు ఏనాడో చెప్పారు. అవధులెరుగనిది..ఎల్లలు ఒల్లనిది..భాషాభేదాలు లేనిది..ప్రాంతీయతలు తెలియనిది సంగీతం ఒక్కటే. ముదిమేది వయసేది నీ పదముల చెంతను ముదమారవించగా అంటూ తనకు తన గానానికి వయోభారం లేదని మంగళంపల్లి బాలమురళీ కృష్ణ నిరూపించారు.
Samayam Telugu mangalampalli balamuralikrishna veteran carnatic musician
ఆయన జీవితమే... ఓ సంగీత ఝరి


కర్నాటక సంగీతం అనగానే ఈ తరంలో వెంటనే స్పురణకు వచ్చే పేరు మంగళంపల్లి బాలమురళీకృష్ణ. సంగీతాన్ని ఔపోసన పట్టిన మహానుభావుడు బాలమురళి. బాలమురళీకృష్ణ 06 -07 -1930 న తూర్పు గోదావరి జిల్లాలోని,శంకరగుప్తంలో పుట్టారు.ఆయన తల్లి తండ్రులు సూర్యకాంతమ్మ,పట్టాభిరామయ్య గార్లు.తల్లి వీణా విద్వాంసురాలు. మాతామహుడు అయిన శ్రీ ప్రయాగ రంగదాసు గారు సంగీత కోవిదుడు. వారు స్వయంగా కొన్ని కృతులను వ్రాసి స్వరపరిచారు. అవి ‘శ్రీ ప్రయాగ రంగదాసు కీర్తనలు’ గా ప్రసిద్ధి చెందాయి. శ్రీ బాలమురళీకృష్ణ వాటిని గానం చేసారు.

ఈయన చిన్నతనంలోనే తల్లిని కోల్పోయారు. మంగళంపల్లి ఏడవ ఏటనుండే కచేరీలు చేయటం ప్రారంభించాడు. తొమ్మిదియేళ్ళ వయసులో వయోలిన్,మృదంగం,కంజీర లాంటి వాయిద్యాలలో కూడా ప్రావీణ్యం సంపాదించాడు. కుమారునికి ఉన్న సంగీత జ్ఞానాన్ని గుర్తించి తండ్రి గారైన పట్టాభిరామయ్య గారు ఆయనను గాయక బ్రహ్మ శ్రీ పారుపల్లి రామకృష్ణయ్య గారి వద్ద శిష్యరికానికి పంపారు. దీనితో శ్రీ మంగళంపల్లి జీవితానికి ఒక మార్గం లభించింది. విద్యాభ్యాసం పూర్తి చేసుకొన్న బాలమురళీకృష్ణ విజయవాడ ప్రభుత్వ సంగీత కళాశాలకు ప్రిన్సిపాల్ గా కొంతకాలం పనిచేసారు. ఆ రోజుల్లో విజయవాడలో శ్రీ విశ్వనాధ వారి మన్నలను,ఆశీస్సులను పొందారు.

కాలక్రమంలో మద్రాస్‌లో స్థిరపడి, తమిళ , కర్ణాటక, మళయాళ భాషలపై కూడా పట్టు సాధించారు. సుమారు 30,000 కచేరీలకు పైగా ఇచ్చి ఉంటారు. అన్నమయ్య కీర్తనలు,రామదాసు కీర్తనలు,ఎంకిపాటలు,తత్వాలు,లలితగీతాలు ,ఎన్నో భక్తి గీతాలు…ఇలా చెప్పుకుంటూపోతే వారు పాడిన పాటలకు అంతే ఉండదు. ఆయన పాడింది పాట,ఆలపించింది రాగం అన్నట్లుగా ఉంటుంది. వేలాది కాసెట్లు, రికార్డ్లు రిలీజ్ అయ్యాయి! బాలమురళీ కేవలం గాయకుడే కాదు,వాగ్గేయకారుడు కూడా. 72 మేళకర్తల్లో కీర్తనలు రచించిన వాగ్గేయకారుడు ఈయన.

లవంగి,త్రిశక్తి,మహతి లాంటి పెక్కు రాగాలు సృష్టించిన సంగీత సరస్వతి శ్రీ బాలమురళీ.సినిమా పాటలు కూడా అద్భుతంగా చాలా భాషల్లో పాడారు.భక్త ప్రహ్లాద సినిమాలో నారదుడి వేషం వేసి మెప్పించారు. హంసగీతే కన్నడ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించటమే కాకుండా ఉత్తమ గాయకుడిగా పురస్కారాన్ని అందుకున్నారు. మధ్వాచార్య చిత్రానికి కూడా జాతీయ స్థాయిలో సత్కారం పొందారు. గానసుధాకర,సంగీత సామ్రాట్,సంగీత కళా సరస్వతి,కళాప్రపూర్ణ,గాన గంధర్వలాంటి కొన్ని వందల బిరుదులు వీరి సొంతం అయ్యాయి.అంతే కాకుండా ఫ్రెంచి ప్రభుత్వం నుండి ప్రతిష్టాత్మకమైన శేవేలియర్ అవార్డ్ అందుకున్న ఏకైక కర్ణాటక సంగీత విద్వాంసుడు శ్రీ బాలమురళీ.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.