యాప్నగరం

1994లో అదృశ్య‌మయ్యాడు.. తిరిగి 25 ఏళ్ల తర్వాత కుటుంబాన్ని కలిశాడు!

మానసిక వైకల్యంతో బాధపడే చత్తీస్‌గఢ్‌కు చెందిన సలీం షేక్ (52) తన 27వ ఏట అదృశ్య‌మయ్యాడు. అతడి కోసం కుటుంబసభ్యులు పదేళ్లపాటు వెదికి చనిపోయిన ఉంటాడని ఆశలు వదులుకున్నారు.

Samayam Telugu 24 Jun 2019, 3:48 pm
25 ఏళ్ల కిందట కనిపించకుండా పోయిన ఓ ఓ వ్యక్తి తిరిగి తన కుటుంబాన్ని చేరుకున్నాడు. మానసిక వైకల్యంతో బాధపడే చత్తీస్‌గఢ్‌కు చెందిన సలీం షేక్ (52) తన 27వ ఏట అదృశ్య‌మయ్యాడు. అతడి కోసం కుటుంబసభ్యులు పదేళ్లపాటు వెదికి చనిపోయిన ఉంటాడని ఆశలు వదులుకున్నారు. అయితే, సలీంను మహారాష్ట్రలోని కళ్యాణ్‌లో ఉన్న ఓ స్వచ్ఛంద సంస్థ చేరదీసి, కుటుంబసభ్యులకు ఆదివారం అప్పగించింది. కళ్యాణ్‌కు చెందిన న్యాయవాది వినాయక్ అభేలా అధర్ సామాజిక సంస్థాన్ అనే స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నాడు. మానసిక వికలాంగులు, నిరాశ్రయులైన వ్యాధిగ్రస్తులను చేరదీసి ఆశ్రయం కల్పిస్తాడు. కళ్యాణ్ పట్టణంలోని బెయిల్ బజార్ ప్రాంతంలో మతిస్థిమితం సరిగాలేని ఓ వ్యక్తి తిరుగుతున్న విషయం తన కార్యకర్తల ద్వారా జూన్ 19న అతడు తెలుసుకున్నాడు.
Samayam Telugu chhattisgarh


దీనిపై లాయర్ అభేలా మాట్లాడుతూ.. సలీం షేక్‌ను తొలిసారి కలిసినప్పుడు తనతో అయిష్టంగానే మాట్లాడినట్టు తెలిపాడు. తన పేరు సలీం షేక్ అని, చత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ అని మాత్రమే చెప్పాడన్నారు. దీంతో ఇంటర్నెట్‌లో శోధించి బిలాస్‌పూర్ రేంజ్ ఐజీ ప్రదీప్ గుప్తా ఫోన్ నెంబర్ తెలుసుకుని ఆయనతో మాట్లాడి, సలీం ఫోటోను వాట్సాప్‌లో షేర్ చేశానన్నారు. అయితే వినాయక్ అందజేసిన వివరాలతో సలీం కుటుంబసభ్యుల గురించి తెలుసుకోవడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సలీం నుంచి మరిన్ని వివరాలు రాబట్టి తమకు పంపాలని ఐజీ గుప్తా కోరారు. మరోసారి అతడిని గుచ్చి గుచ్చి ప్రశ్నించడంతో తనది బిలాస్‌పూర్‌లోని విద్యానగర్ సమీపంలో ఇందిరా కాలనీ అని చెప్పాడు. ఈ పోలీసులకు వివరాలు అందజేయడంతో జూన్ 20న సలీం కుటుంబసభ్యులు తర్బాహర్ పోలీస్‌ స్టేషన్ పరిధిలో ఉన్నట్టు గుర్తించారు.

ఇదే సమయంలో మరో సమస్య వచ్చి పడింది. బెయిల్ బజార్ ప్రాంతంలో సలీం షేక్ కనిపించకపోవడంతో పోలీసుల సాయం తీసుకున్నాడు. తిరిగి సలీం ఆచూకీ కనుగొని, దంబోవిలిలోని తన ఆశ్రమానికి తరలించాడు. ఆదివారం ఉదయం సలీం తమ్ముడు జునైద్ తన బంధువులతో కలిసి కళ్యాణ్‌కు చేరుకుని, సోదరుడ్ని కలుసుకున్నారు. 25 ఏళ్ల కిందట కనిపించకుండా పోయిన తమ సోదరుడు తిరిగి కుటుంబ చెంతకు చేరడం సంతోషంగా ఉందని జునైద్ అన్నాడు. 1994లో అదృశ్య‌మైన తర్వాత పదేళ్లు వెతికి, ఆశలు వదలుకున్నామని తెలిపాడు. ఏడాది కిందటే తల్లి రజియా చనిపోయిందని, తండ్రి ఉన్నారని అన్నాడు. సలీం బతికే ఉన్నాడని తెలిసి ఆయన ఎంతో సంబరపడ్డారని వివరించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.