యాప్నగరం

ప్రమాదాల నివారణకు పూజ చేయించిన పోలీసులు!

ఆ జాతీయ రహదారిపై ఒకే ప్రాంతంలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయట..

TNN 31 Mar 2017, 7:45 pm
ఆ జాతీయ రహదారిపై ఒకే ప్రాంతంలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయట. గత పది రోజుల్లోనే అక్కడ జరిగిన భీతావహ యాక్సిడెంట్లలో 10 మంది వరకూ మరణించారట. దీంతో పోలీసులు అక్కడ పూజ చేయించారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని బర్ధమాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రత్టాలా ప్రాంతంలో.. నేషనల్ హైవేపై యాక్సిడెంట్లు ఎక్కువవుతుండటంతో.. పోలీసులే స్వయంగా పూజ చేయించారు. పూజారి శాంతి పూజ నిర్వహించిన తర్వాత రహదారిపై పవిత్రజలాలు చల్లారు. ఈ తంతు కోసం ఆ రహదారిపై 10 నిమిషాల పాటు ట్రాఫిక్‌ను కూడా నిలిపేశారు. ఈ శాంతి పూజకు స్థానికుల నుంచి కూడా మంచి స్పందన లభించింది.
Samayam Telugu police performs puja to check road accidents
ప్రమాదాల నివారణకు పూజ చేయించిన పోలీసులు!


ఈ సంఘటనపట్ల పోలీసులకు తీవ్రస్థాయి విమర్శలు ఎదురవుతున్నాయి. ప్రజలకు భద్రత ఇవ్వాల్సిన మీరే దేవుడిపై భారం వేసి.. ఇలా పూజలు చేసి, జనానికి ఏం సందేశం ఇద్దామనుకుంటున్నారు అని కొంత మంది నాస్తికులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై మీడియా సంబంధిత ఎస్సైని ప్రశ్నించగా.. ‘ఇదే విషయంపై నాకు ఉదయం నుంచి వందల్లో ఫోన్ కాల్స్ వస్తున్నాయి. కానీ, అలాంటిదేదీ నా దృష్టికి రాలేదు. మా సిబ్బంది ఎవరూ రహదారి భద్రత కోసం పూజలు చేయలేదు’ అని వివరణ ఇచ్చారు.

పూజలు నిర్వహించిన పురోహితుడు మరోవిధంగా స్పందించాడు.. ‘బర్ధమాన్ పోలీస్ స్టేషన్ సిబ్బందే ఈ పూజా ఏర్పాట్లు చేశారు. ఆ ప్రాంతంలో శాంతి కోసం పూజలు విజయవంతంగా నిర్వహించాం. ఆపదలో మనకు దేవుడు తప్పకుండా అండగా నిలుస్తాడు. అందుకే.. కాళీ పూజ నిర్వహించి, పవిత్ర జలాలతో ఆ ప్రాంతాన్ని శుద్ధి చేశాం’ అయన చెప్పాడు. రత్టాలా రహదారిపై మార్చి 22న ఒక ప్రమాదం జరిగింది. నాటి నుంచి వరసగా ప్రతి రోజూ ఒక యాక్సిడెంట్ జరుగుతోందట. ఈ వివాదం విషయాన్ని పక్కనపెడితే.. భగవంతుడు ఇలాగైనా అక్కడి ప్రజల మొర ఆలకించి.. సరైన పరిష్కారాన్ని చూపితే అంతకంటే సంతోషం ఏముంటుంది?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.