యాప్నగరం

తెలుగు ప్రజలకు ‘సైకత’ శుభాకాంక్షలు

ఉగాదితో తెలుగు ప్రజలకు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. మనం ఇంగ్లిష్ క్యాలెండర్‌ను అనుసరిస్తున్నా.. తెలుగు సంవత్సరాది ఉగాదికి ఉండే ప్రాధాన్యత వేరు.

TNN 28 Mar 2017, 7:34 pm
ఉగాదితో తెలుగు ప్రజలకు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. మనం ఇంగ్లిష్ క్యాలెండర్‌ను అనుసరిస్తున్నా.. తెలుగు సంవత్సరాది ఉగాదికి ఉండే ప్రాధాన్యత వేరు. ఈ పవిత్రమైన రోజున తమ ఇష్టదైవాన్ని పూజించి, షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడి రుచి చూస్తారు. మంచి చేకూరాలని తమ జీవితానికి ఎంతో ముఖ్యమైన కార్యక్రమాలను కూడా ఈరోజునే చాలామంది ప్రారంభిస్తారు. అంతేకాకుండా కొత్త పంచాంగాలు కొనుక్కొని తమ రాశిఫలాలు ఏవిధంగా ఉన్నాయో చూసుకుంటారు. అయితే ప్రతి ఏటా వచ్చే ఉగాదికి ఒక ప్రత్యేక నామం ఉంటుంది. అలాగే ఈ ఉగాదిని ‘శ్రీ హేవళంబి నామ సంవత్సరం’గా పిలుస్తున్నారు.
Samayam Telugu sri hevalambi ugadi sand sculpture by tarani prasad mishra
తెలుగు ప్రజలకు ‘సైకత’ శుభాకాంక్షలు


ఉగాది సందర్భంగా మన మిత్రులకు, బంధువులకు శుభాకాంక్షలు తెలుపుతాం. ఆ శుభాకాంక్షలు నేరుగానో లేకపోతే ఎస్ఎంఎస్, వాట్సాప్, ఫోన్ కాల్ ద్వారానో చెపుతాం. అయితే శ్రీకాకుళం జిల్లా ఎల్.ఎన్.పేటకు చెందిన సైకత శిల్పి తరణి ప్రసాద్ మిశ్రా తనదైన శైలిలో ‘సైకత ఉగాది శుభాకాంక్షలు’ తెలిపారు. బుధవారం ఉగాది పండుగను పురస్కరించుకుని వంశధార నదీ తీరంలో సైకత శిల్పాన్ని నిర్మించారు. తెలుగింటి ఆడపడుచు, మామిడి కాయలు, చిన్న గుడిసె ఆకారంలో తీర్చిదిద్దిన ఈ సైకత శిల్పంపై ‘శ్రీ హేవళంబి ఉగాది శుభాకాంక్షలు’ అని రాశారు. పండుగలు, విశిష్టమైన ప్రాధాన్యం ఉన్న రోజుల్లో తరణి ప్రసాద్ సైకత శిల్పాలు నిర్మించి ఆకట్టుకుంటున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.