యాప్నగరం

కోటానుకోట్లున్నా.. కొడుకు కారణంగా అద్దె ఇంట్లో!!

దేశంలోని అత్యంత ధనికుల్లో ఒకరాయన.. కానీ కొడుకు కారణంగా చేతిలో చిల్లిగవ్వ లేక.. అద్దె కొంపలో జీవితం వెళ్లదీస్తున్నారు.

TNN 9 Aug 2017, 2:26 pm
భారతదేశంలోని అత్యంత ధనికుల్లో ఒకడైన డాక్టర్ విజయపత్ సింఘానియా ఇప్పుడు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రేమండ్ బ్రాండ్‌తో దుస్తుల విక్రయాల్లో 20 ఏళ్లపాటు తిరుగులేని హవా కొనసాగించిన ఆ వ్యాపారవేత్తకు ఇప్పుడు మూడు పూటలా తిండి దొరకడమే కష్టంగా మారింది. వేల కోట్ల ఆస్తులు కూడబెట్టిన సింఘానియా ఇప్పుడు అద్దె ఇంట్లో కాలం వెళ్లదీస్తున్నారు. ఆయనేమీ వ్యాపారంలో నష్టపోలేదు. కానీ కొడుకు మీదున్న అమితమైన ప్రేమే ఆయన కొంప ముంచింది. కంపెనీలో తనకు వాటాల రూపంలో ఉన్న రూ. 1000 కోట్ల విలువైన ఆస్తులను ఆయన తన కొడుక్కి ఇచ్చేశారు. వేల కోట్ల సామాజ్ర్యాన్ని తన చేతుల్లో పెట్టిన తండ్రిని ఆ పుత్రరత్నం అసలు పట్టించుకోవడం లేదు. సింఘానియాకు ఉన్న కొద్ది పాటి ఆస్తులను కూడా లాగేసుకున్నారు. కారును కూడా ఆయనకు ఇవ్వలేదు. దీంతో ఒకప్పుడు పెద్ద బంగళాలో బతికిన ఆయన.. ఇప్పుడు దక్షిణ ముంబైలోని ఓ అపార్ట్‌మెంట్లో అద్దె ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి తలెత్తింది.
Samayam Telugu vijaypat singhania one of indias richest men is now penniless all thanks to his tycoon son gautam
కోటానుకోట్లున్నా.. కొడుకు కారణంగా అద్దె ఇంట్లో!!


కొడుకుపై పెంచుకున్న ప్రేమ తనను ఇంతటి ఇబ్బందుల్లో పడేస్తుందని సింఘానియా గ్రహించలేకపోయారు. ఇప్పుడు 78 ఏళ్ల వయసులో తను బతకడం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. రేమండ్ సంస్థకు మలబార్ హిల్స్ ప్రాంతంలో జేకే హౌస్ అనే 36 అంతస్థుల భవనం ఉంది. వాస్తవానికి దాన్ని 1960ల్లో 14 అంతస్తుల్లో నిర్మించారు. తర్వాత అందులోని నాలుగు డూప్లెక్స్‌లను రేమెండ్ సంస్థకు సబ్సిడరీ అయిన పష్మానియా హోల్డింగ్స్‌కు బదలాయించారు. 2007లో దాన్ని పునర్నిర్మాణం ప్రారంభించారు. ఇందులో సింఘానియా, ఆయన కుమారుడు గౌతమ్‌కు 5,815 చదరపు అడుగుల మేర దక్కుతుంది. అందుకోసం చదరపు అడుగుకు రూ. 9 వేల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.

ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సింఘానియా కనీసం ఈ భవనంలో వాటానైనా తనకు దక్కేలా చేయాలని కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ‘విజయ్‌పత్ తన ఆస్తినంతటినీ కొడుక్కే ఇచ్చేశారు.. ఇప్పుడు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు’ అని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. కంపెనీయే సింఘానియాకు నివాసం కల్పించాలని, నెలకు రూ. 7 లక్షల చొప్పున జీవన భృతి చెల్లించాలని వారు న్యాయస్థానాన్ని కోరారు. అదీ సంగతి..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.