యాప్నగరం

పెళ్లికాని కొడుకు లోకం వీడినా.. నాన్నమ్మ అయ్యింది!

అమ్మ ప్రేమకు అవధులు లేవనే విషయాన్ని ఈ సంఘటన మరోసారి నిజం చేసింది. తన పిల్లల కోసం ఆమె ఎంతటి సాహసానికైనా తెగిస్తుందనే అంశాన్ని రూఢిచేసింది.

TNN 15 Feb 2018, 12:50 pm
అమ్మ ప్రేమకు అవధులు లేవనే విషయాన్ని ఈ సంఘటన మరోసారి నిజం చేసింది. తన పిల్లల కోసం ఆమె ఎంతటి సాహసానికైనా తెగిస్తుందనే అంశాన్ని రూఢిచేసింది. అల్లారు ముద్దుగా పెరిగిన తన కుమారుడు రెండేళ్ల కిందట కేన్సర్‌తో మరణించాడు. బ్రెయిన్ ట్యూమర్‌తో దూరమైన తన కుమారుడికి పునర్జన్మ ఇవ్వాలని సంకల్పించింది ఓ అమ్మ. దీంతో అతడి వీర్యాన్ని సేకరించి సరోగసీ విధానం ద్వారా వారసుణ్ని తీసుకురావాలని ప్రయత్నించి, విజయం సాధించింది. ఆమె నిర్ణయాన్ని చాలా మంది తప్పుబట్టినా వెనకడుగు వేయలేదు, ధైర్యంతో ముందుకు సాగి తన కొడుకు ప్రతిరూపాన్ని పొందింది. టీచరమ్మ ప్రేమకు, సైన్సు కూడా తోడవటంతో ఆ తల్లి కోరిక నెరవేరింది.
Samayam Telugu woman uses dead sons sperm to relive legacy in surrogate twins
పెళ్లికాని కొడుకు లోకం వీడినా.. నాన్నమ్మ అయ్యింది!


ఇది పుణేకు చెందిన రాజశ్రీ పాటిల్ అనే మహిళ కథ. ఉపాధ్యాయినిగా విధులు నిర్వహించే రాజశ్రీ కుమారుడు కేన్సర్‌తో రెండేళ్ల కిందట ప్రాణాలు కోల్పోయాడు. చెట్టంత కొడుకు తన కళ్ల ముందే కేన్సర్‌తో కుచించికుపోతుంటే ఆమె కుమిలిపోయింది. అతణ్ని బతికించుకోడానికి ఆమె చేయని ప్రయత్నం లేదు. అవివాహితుడైన తన కొడుకు అల్పాయుష్కుడేనని గ్రహించిన ఆమె, అతడి వీర్యాన్ని చికిత్సకు ముందే భద్రపరచాలని వైద్యులను కోరింది. జరగరానిది జరిగితే అతడి ప్రతిరూపాన్ని మళ్లీ చూడాలనే కోరికతో ఇలా చేసింది. ఈ ప్రక్రియలో తాను చాలా ఆటంకాలను ఎదుర్కొన్నాని, ఇందులో డబ్బు, సమయం చాలా కీలకమైనవి రాజశ్రీ పాటిల్ తెలిపారు. కానీ నా ప్రయత్నానానికి భగవంతుడు సహకరించి, ఇద్దరు పిల్లల్ని తిరిగి పంపాడని, వీరిని కంటికి రెప్పలా చూసుకుంటానని ఆమె సంతోషం వ్యక్తం చేస్తోంది.

ఈ కవల్లో ఒకరు అమ్మాయి, అబ్బాయి కావడం విశేషం. వీరిలో అబ్బాయికి ప్రథమేశ్, అమ్మాయికి ప్రీశా అని నామకరణం చేసింది. సరోగసీ ద్వారా పుట్టిన తన మనవళ్లకు కొడుకు, కుమార్తెల పేర్లనే పెట్టుకోవడం అమ్మ ప్రేమకు నిదర్శనం. కొడుకు వీర్యం ద్వారా తనే ముందు గర్భం దాల్చాలని ప్రయత్నించింది. అయితే ఆరోగ్య కారణాల వల్ల అది కుదరకపోవడంతో మరో మహిళ కోసం అన్వేషించారు. ఈ విషయంలో ఆమె తల్లిదండ్రులు, బంధువులు కూడా అండగా నిలిచారు. చివరకు ఓ 35 ఏళ్ల మహిళ తన గర్భాన్ని అద్దెకు ఇవ్వడానికి అంగీకరించారు. దీంతో గతేడాది జూన్‌లో తొలి ప్రయత్నంలోనే ఆమె గర్భం దాల్చారు. ఈ ఏడాది ఫిబ్రవరి 12న పుణేలోని సహ్యాద్రి హాస్పిటల్‌లో ఆమె కవలలకు జన్మనిచ్చారు.

తన కొడుకును మళ్లీ చూడాలనే ఆ అమ్మ సంకల్పాన్ని అభినందించకుండా ఉండలేకున్నామని సరోగసీ చికిత్సలో కీలకంగా వ్యవహరించిన డాక్టర్ పురానిక్ తెలిపారు. అభివృద్ధి చెందిన సైన్స్, కొత్త సాంకేతిక పరిజ్ఞానంతోపాటు మావన సహకారంతో ఆమె కల సాకారమైందని సంతోషాన్ని డాక్టర్ వ్యక్తం చేశారు. ప్రథమేశ్ సార్థక నామధేయుడే. చదువులోనూ ముందుండే ప్రథమేశ్ ఇంజినీరింగ్ పూర్తయిన తర్వాత 2010లో ఎంఎస్ కోసం జర్మనీ వెళ్లాడు. అయితే 2013 ఫిబ్రవరిలో కేన్సర్ సోకినట్లు బయటపడటంతో అక్కడే చికిత్స తీసుకున్నాడు. మే 2013లో ఇండియాకు తిరిగొచ్చిన ప్రథమేశ్ చికిత్స కోసం ముంబైలోని హిందుజా హాస్పిటల్‌లో చేరాడు. కానీ చికిత్స ఎలాంటి ఫలితం ఇవ్వకపోవడంతో ఆరోగ్యం క్షీణించింది. దీంతో 2016 ఫిబ్రవరి 28 న తుదిశ్వాస విడిచాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.