యాప్నగరం

ఆశలు వదులుకోను.. పోరాడుతా: సైనా నెహ్వాల్

క్లిష్ట పరిస్థితుల్లోనూ ఆశలు వదులుకోకుండా.. చివరి వరకూ పోరాడటం తన నైజమని భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ వెల్లడించింది.

Samayam Telugu 16 Apr 2018, 1:45 pm
క్లిష్ట పరిస్థితుల్లోనూ ఆశలు వదులుకోకుండా.. చివరి వరకూ పోరాడటం తన నైజమని భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ వెల్లడించింది. ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్ వేదికగా ఆదివారం ముగిసిన కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకం గెలుపొందిన సైనా నెహ్వాల్.. ఈ క్రీడల్లో రెండు వ్యక్తిగత స్వర్ణాలు సాధించిన ఏకైక భారత షట్లర్‌గా రికార్డు సృష్టించింది. ఢిల్లీ వేదికగా 2010లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లోనూ సైనా నెహ్వాల్ పసిడి పతకం గెలుపొందిన విషయం తెలిసిందే. పీవీ సింధుతో ఆదివారం ఉదయం జరిగిన మహిళల సింగిల్స్‌ ఫైనల్ మ్యాచ్‌లో 21-18, 23-21తో తేడాతో గెలిచిన సైనా నెహ్వాల్ స్వర్ణంతో భారత్‌ పతకాల వేటని ముగించింది.
Samayam Telugu i never lost hope just kept fighting says saina nehwal on cwg gold
ఆశలు వదులుకోను.. పోరాడుతా: సైనా నెహ్వాల్


కామన్వెల్త్‌లో స్వర్ణం గెలిచిన సైనా నెహ్వాల్ తాజాగా ‘సమయం తెలుగు’తో ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడింది. ‘నేను చాలా విమర్శలు ఎదుర్కొన్నాను. కానీ.. అవి నాకు మంచే చేశాయి. ఇంకా చెప్పాలంటే.. ఆ విమర్శలే నా బలహీనతల్ని సరిదిద్దుకునేందుకు ఉపయోగపడ్డాయి. నా ఫిటెనెస్‌ని మెరుగుపర్చుకుని.. కామన్వెల్త్‌లో బంగారు పతకం గెలుపొందడం చాలా సంతోషంగా ఉంది. ఇది చాలా ప్రతిష్ఠాత్మకమైన టోర్నీ.. ప్రతి ఒక్కరూ దేశం కోసం గెలవాలని కోరుకుంటూ ఉంటారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ నేను ఆశలు వదులుకోను.. పోరాడుతాను.ఈ వారంలో జరగనున్న టోర్నీలో కూడా గెలిచి నన్ను నేను నిరూపించుకోవాలనుకుంటున్నా. అంతేకాకుండా ఈ ఏడాదంతా ఫిటెనెస్‌పై కూడా ప్రత్యేక శ్రద్ధ వహిస్తా’ అని సైనా నెహ్వాల్ వెల్లడించింది. 2016 రియో ఒలింపిక్స్‌ ఆరంభంలోనే ఓడి ఇంటి బాట పట్టిన సైనా నెహ్వాల్ అనంతరం గాయంతో దాదాపు ఏడాదన్నర ఆటకి దూరమైంది. దీంతో.. ఆమె కెరీర్‌ ముగిసిపోయిందనే కామెంట్లు అప్పట్లో వినిపించాయి. గత ఏడాది పునరాగమనంలో కూడా ఆమె చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయింది. కానీ.. కామన్వెల్త్‌లో పసిడి పతకం గెలవడం ద్వారా.. తనలో పోరాట పటిమ తగ్గలేదని సైనా నిరూపించుకుంది.

కామన్వెల్త్‌లో పోటీ గురించి మాట్లాడుతూ ‘మెగా టోర్నీలో పోటీపడిన టాప్-15 మంది షట్లర్లు చాలా చురుకైనవారు. ఆరంభం నుంచి ఫిటెనెస్, ఆత్మవిశ్వాసంతో కనిపించారు. అందుకే పోటీలు చాలా కఠినంగా సాగాయి. నా వరకూ తీసుకుంటే.. సెమీ ఫైనల్లో క్రిస్టీతో మ్యాచ్.. ఫైనల్లో పీవీ సింధుతో పోరు చాలా కఠినంగా అనిపించింది. నా ఆట మెరుగుకి కారణం కోచ్ గోపీ సార్, ఫిజియో క్రిస్టోఫర్. నేను కాలి గాయం నుంచి వేగంగా కోలుకునేందుకు క్రిస్టోఫర్ సాయం అందించారు’ అని సైనా వెల్లడించింది.

బంగారు పతకం గెలిచారు కదా.. సంబరాలు ఎలా..? అంటే ‘కచ్చితంగా సంబరాలు ఉంటాయి. కానీ.. నా వ్యక్తిగత స్వర్ణంపై కాదు.. భారత మిక్సెడ్‌ టీమ్ ఈవెంట్‌లో గెలిచిన పసిడి పతకంపై ఉండొచ్చు. ఎందుకంటే.. జట్టు మొత్తానికి ఈ పతకం చాలా ప్రత్యేకం. అయితే.. సంబరాలకి తగినంత సమయం లేదు. ఈ వారంలోనే మరో టోర్నమెంట్ ఉంది. దేశం తరఫున బంగారు పతకం గెలవడం చాలా గర్వంగా ఉంది. ఈ పతకమే రానున్న టోర్నీల్లో నాకు స్ఫూర్తి’ అని సైనా నెహ్వాల్ ఆనందం వ్యక్తం చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.